ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు – కానీ ఆయన భార్య గాంధారి తన ఇష్టంగా తాను కళ్ళకు గంతలు వేసుకొని అంధురాలు అయింది. కొత్త తరంలో ఎవరైతే ముందు పుడుతారో వారే రాజ్యానికి కాబోయే మహారాజు అవుతారు, కనుక తన తమ్ముని భార్య సంతానం పొందటానికి ముందే తన భార్య సంతానం పొందాలని ధృతరాష్ట్రుడు తీవ్ర పట్టుదలతో వున్నాడు. ఎలాగోలా గాంధారి  ఒక కొడుకును కనాలని, ధృతరాష్ట్రుడు ఆమెతో అన్ని రకాల ప్రియ వచనాలు చెప్పాడు. కొద్దికాలం తరువాత గాంధారి గర్భవతి అయింది. నెలలు గడుస్తున్నాయి, తొమ్మిది వెళ్లి పది, పదకొండవ నెల వచ్చినా ఆమెకు ప్రసవం కాలేదు. తరువాత కొద్దికాలానికి పాండురాజుకు మొదటి కొడుకుగా యుధిష్టురుడు పుట్టాడు అనే వార్తను వారు తెలుసుకున్నారు. దీంతో ధృతరాష్ట్రుడు, గాంధారి తీవ్ర నిరాశకు, బాధకు గురయ్యారు.

అశుభ సూచకంగా మాసపు ముద్ద పుట్టడం

పాండురాజుకు మొదటి కొడుకుగా యుధిష్టురుడు పుట్టడం వల్ల సహజంగా అతనే కాబోయే ప్రభువు. పదకొండు, పన్నెండు నెలలు గడచినా గాంధారికి ప్రసవం కాలేదు. ఆమె ‘ఇది ఏమిటి? ఈ గర్భ శిశువు చనిపోయాడా లేక బ్రతికి వున్నాడా? ఇది మనిషా లేక మృగామా?’ అన్న తీవ్ర నిరాశతో తన గర్భాన్ని తానే కొట్టుకుంది, కానీ ఏమీ కాలేదు. దీంతో ఆమె తన సేవకురాలిని ఒక కర్రను తెమ్మని, దాంతో తన గర్భాన్ని కొట్టుకుంది. దీంతో ఆమెకు గర్భస్రావం జరిగి ఒక నల్లని మాంసపు ముద్ద బయటకు వచ్చింది. దానిని చూసినవారు తీవ్ర భయానికి లోనయ్యారు, ఎందుకంటే అది మానవ పిండంగా కాక – అది ఒక చెడు కలిగించే  అరిష్ట సూచకంగా కనపడింది. హఠాత్తుగా ఏర్పడ్డ భయంకరమైన శబ్దాలు, నక్కల అరుపులు, అడవి మృగాలు వీధుల్లో సంచరించడం, గబ్బిలాలు పట్టపగలు ఎగరడం వంటి చెడు శకునాలతో  హస్తినాపురి పట్టణమంతా తీవ్రంగా భయపడింది. ఈ శకునాలు ఏదో చెడు జరగబోతున్నదని స్పష్టంగా తెలియచేశాయి. వీటిని గమనించిన సాధువులు హస్తినాపురి నుంచి వెనుతిరిగిపోయారు. సాధువులు వెళ్లిపోయారనే వార్త అంతటా వ్యాపించింది. విదురుడు ఈ పరిణామాలతో కలత చెంది ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ‘మనం ఒక పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నాం?’ అని తెల్పాడు. ధృతరాష్ట్రుడు తనకు సంతానం కలుగాబోతోందనే ఉత్సాహంతో ఆ విషయాన్ని వదిలేయమని చెప్పాడు, ఎందుకంటే అతను వేటినీ చూడలేడు, కనుక ‘ఏం జరిగింది? ఎందుకు అందరూ భయపడుతున్నారు, ఏమిటా భయంకర శబ్దాలు?’ అని ప్రశ్నించలేదు. 
 

100 కుండలు, 100 మంది కొడుకులు

ఒకసారి, వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినపుడు ఆయన గాయపడిన పాదాలకు గాంధారి సేవ చేసి, ఆయనకు కావలసిన సపర్యలన్నీ చేసింది. ఇందుకు ఆయన సంతోషించి ‘నీకు ఎలాంటి కోరిక ఉన్నా, దానిని తీరుస్తానని’ ఆమెకు ప్రమాణం చేశాడు. గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా, మహర్షి అలాగే నీకు వంద మంది కొడుకులు పుడతారని తెలిపాడు. గాంధారి గర్భస్రావం జరిగిన తరువాత  వ్యాస మహర్షిని పిలిచి – ఆయనతో ‘ఏమిటిది? నేను 100 మంది కొడుకులను కంటానని ఆశీర్వదించారు, కానీ దానికి బదులుగా, నేను ఒక మాంసపు ముద్దను ప్రసవించాను, అది కూడా మానవ ఆకారం లేని ఒక ముద్ద. ఈ మాంసపు ముద్దను అడవిలో వదలివేయండి, ఎక్కడైనా పూడ్చేయండి’ అని చెప్పింది.

వ్యాస మహర్షి ఆమెతో ‘ఇప్పటి వరకు నేను చెప్పింది ఏదీ తప్పు కాలేదు, ఇకపై తప్పు కాదు. ఆ మాంసపు ముద్దను తీసుకొనిరా’ అని చెప్పాడు. ఆ ముద్దను నేలమాళిగలోకి తీసుకొని వెళ్లి, 100 మట్టి కుండలను సీసం నూనెతో, వివధ రకాల మూలికలతో తీసుకురమ్మని తెలిపాడు. తరువాత ఆ మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి ఆ 100 కుండలలో వుంచి, వాటిని మూసి, ఆ నేలమాళిగలోనే వుంచాడు. తరువాత మిగిలిపోయిన ఒక చిన్న మాంసపు ముద్ద గమనించి, గాంధారితో ‘మరో కుండను తీసుకురమ్మని, నీకు 100 మంది కొడుకులు, ఒక కూతురు’ కలుగుతారని తెలిపాడు. అలాగే ఆ చిన్న ముద్దను ఒక కుండలో వుంచి అదే నేలమాళిగలో వుంచాడు. ఇలా మరో సంవత్సరం గడచింది. అందువలనే గాంధారి రెండు సంవత్సరాలు గర్భంతో ఉన్నది – ఒక సంవత్సరం ఆమె కడుపులో, మరో సంవత్సరం నేలమాళిగలో ఆ గర్భ పిండం వున్నది.

పాము కళ్ళతో పుట్టినవాడు

ఒక సంవత్సరం గడచిన తరువాత, మొదటి కుండ పగిలి, అందులోంచి ఒక పెద్ద పిల్లవాడు పాము కళ్ళతో వచ్చాడు. అంటే అతడు రెప్ప వేయలేదు – అతని కళ్ళు స్థిరంగా, ఎటూ చూడకుండా నేరుగా ఉన్నాయి. ఆ పిల్లవాని పుట్టుకతో ఏవైతే రాత్రి పూట జరుగుతాయో అవి పగటి పూట జరగడం వంటి  చెడు శబ్దాలు, శకునాలు మళ్ళీ కలిగాయి. అంధుడైన ధృతరాష్ట్రుడు చెడు ఏదో జరుగుతుందని భావించి విదురునితో ‘ఏమి జరుగుతోంది? ఏదో తప్పు జరిగింది. నాకు కొడుకు పుట్టాడా?’ చెప్పమన్నాడు. ఇందుకు విదురుడు నీకు కొడుకు పుట్టాడని తెలిపాడు. నెమ్మదిగా, అన్ని కుండలలోని ముద్దలు పొదగబడి – మిగిలిన కొడుకులు బయటకు వచ్చారు, ఒక కుండ లోంచి మాత్రం ఒక అమ్మాయి బయటకు వచ్చింది.

తదుపరి విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడుతూ ‘నీకు 100 మంది కొడుకులు, ఒక కూతురు కలిగారు. కానీ నేను చెబుతున్నాను – నీ మొదటి కొడుకును చంపగాలవా’ అని ప్రశ్నించాడు. ఇందుకు ధృతరాష్ట్రుడు ‘ఏమిటీ, నా మొదటి సంతానాన్ని చంపమని నన్ను అడుగుతున్నావా? ఎందుకని ప్రశ్నించాడు. విదురుడు చెబుతూ ‘నీ మొదటి సంతానాన్ని నీవు చంపితే, నీవు ఈ కురు మహా వంశానికి, మానవాళికి ఎంతో ఉపకారం, సేవ చేసిన వాడవుతావు. అంతేగాక నీకు 100 మంది పిల్లలూ వుంటారు – ఎలాగంటే 99 మంది కొడుకులు, ఒక కూతురు. ఈ మొదటి సంతానం లేకపోతే వారు ఎలాంటి హానికారులు కారు. ఈ మొదటి కొడుకు వుంటే, మనకు తెలిసినట్లే వారు ప్రపంచ నాశనానికి కారణం అవుతారు.

చెడు శకునాలను పట్టించుకోని ధృతరాష్ట్రుడు

ఇదే సమయంలో, గాంధారి తన మొదటి సంతానమైన దుర్యోధనుని ఎత్తుకొని మురిసిపోయింది. ఆ ప్రేమలో ఆమె ఈ చెడు శబ్దాలను వినలేదు, చెడు శకునాలను పట్టించుకోలేదు. తనకు మొదట కొడుకు పుట్టాడనే ఆనందలో, అతన్ని పెంచి పెద్ద చేయాలని ఎంతో ఉత్సాహంతో మైమరచి వున్నది. విదురుడు ఇది గమనించి ధృతరాష్ట్రునితో ‘జ్ఞానులు, వివేకవంతులు ఎప్పుడూ చెప్పేది ఇదే – ఒక కుటుంబం బాగు కోసం ఒక వ్యక్తిని  వదులుకోవచ్చు, ఒక ఊరి బాగు కోసం ఒక కుటుంబాన్ని వదులుకోవచ్చు, ఒక దేశం బాగు కోసం ఒక ఊరినే వదులుకోవచ్చు. అంతెందుకు పరమాత్మ కోసం ప్రపంచమే తనకు తాను త్యాగం చేసుకోవచ్చు’ అని ఉపదేశించాడు.

విదురుడు మరింత ప్రాధేయపడుతూ ‘ఓ! నా సోదరా, నీ ఈ వికృత ఆకారం గల కొడుకు ఈ మానవాళిని నాశనం చేయడానికి నరకం నుంచి వచ్చాడు. కనుక అతన్ని వెంటనే హతమార్చు. నేను ప్రమాణం చేస్తున్నా, అతను లేకుండా అతని సోదరులు ఎలాంటి హాని చేయరు – మిగిలిన 99 మంది రాకుమారులతో నీవు ఎంతో ఆనందంగా వుండవచ్చు. కానీ ఈ నీ పెద్ద కొడుకు ప్రమాదకారి, కాబట్టి అతన్ని నీవు ప్రాణాలతో వదలొద్దు’ అని కోరాడు. కానీ ధృతరాష్ట్రుడుకి తనకు గల విజ్ఞానం కంటే తన రక్త, మాంసమైన కొడుకుపై ఏర్పడ్డ ప్రేమ, అనుబంధం పెద్దది. కాబట్టి విదురుని హెచ్చరికలను పట్టించుకోలేదు. ఈ విధంగా దుర్యోధనుడు తన 100 తోబుట్టువులతో హస్తినాపురిలో పెరుగుతున్నాడు. అదే సమయంలో పాండవులు అడవిలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు.