ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఒక కోటి డెబ్భై లక్షల మంది ఒక్క హృద్రోగాల కారణంగానే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. 2012 “ఒకే హృదయం, ఒకే ఇల్లు, ఒకే ప్రపంచం “అనే అంశాన్ని చర్చించే సంవత్సరంగా భావించటం చేత ఇంట్లో ఉన్న తల్లులు పిల్లలతో సహా అందరి హృదయ ఆరోగ్యాన్ని కాపాడటంపై దృష్టిని నిలిపారు. ఈశా బ్లాగు ద్వారా మేము కూడా ఈ విషయంలో భాగస్వామ్యం తీసుకోదలచుకున్నాము. ఈ సందర్భంగా స్త్రీలలో హృద్రోగాలపట్ల అవగాహనను పెంచ దలచు కున్నాము.

హృద్రోగాల ముప్పు:

ప్రపంచంలో స్త్రీల మరణాలకు గల కారణాలలో హృద్రోగం మొదటిదని, భారతదేశంలో మాత్రమే పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలనే ఈవ్యాధి పీడిస్తుందని మీకు తెలుసా? అమెరిక సంయుక్త రాష్ట్రాల్లో ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు హృదయ సంబంధ మైన జబ్బులతో మరణిస్తున్నారు. ఈ సంఖ్యా పెరుగుతూ ఉండటం, ముఖ్యంగా శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకుంటూ, క్రియారహితంగా స్థిర జీవనాన్ని గడిపే వారిలో ఈ సంఖ్య పెరగటం మరింత ఆందోళనను కలిగిస్తోంది.

ఇది ఇలాగే కొనసాగితే, 2030 నాటికి సంవత్సరానికి ఏటా రెండుకోట్ల ముప్ఫై లక్షలమంది ఈ జబ్బు వల్ల మరణిస్తారు. వీరిలో స్త్రీలే ఎక్కువగా ఉంటారు. పురుషులతో పోల్చి చూసినప్పుడు స్త్రీలకు హృద్రోగాల ముప్పు తక్కువ అని సాధారణంగా అందరూ అనుకునే అభిప్రాయానికి ఇది విరుద్ధంగా ఉంది. అవగాహన లేక పోవటం,నిర్లక్ష్యం, తీవ్రమైన ఒత్తిడులు, ఆధునిక పట్టణాల్లో అసమతుల్య ఆహరపుటలవాట్లతో గడిపే జీవితం, బహుశః ఇవన్నీ స్త్రీలలో హృద్రోగాలకు ముఖ్య కారణం అవుతున్నాయేమో!

స్త్రీలలో హృద్రోగ ప్రమాద కారకాలు:

• కరోనరి హార్ట్ డిసీజ్, బ్రోకెన్ హార్ట్ సిండ్రోం, కరోనరి మైక్రో వాస్క్యులర్ డిసీజ్, హృదయ వైఫల్యం – ఇలా ఎన్ని రోగాల పేర్లు చెప్పుకున్నా అన్నింటికి ప్రమాద కారకాలు ఒకటిగానే ఉన్నాయి. వాటిలో కొన్ని స్ర్తీ పురుషులకు సమానంగా ఉన్నాయి. స్థూలకాయం, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్. ఇవి కాక స్త్రీలలో హృద్రోగాలు అధికం కావటానికి మరికొన్ని కారకాలు ఉన్నాయి.

• వత్తిడి, డిప్రెషన్ : పురుషుల కంటే స్త్రీలను మానసికమైన వత్తిడి, ఎక్కువ బాధిస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.వ్యాకులత చెందిన స్త్రీ ఆరోగ్యకర జీవనాన్ని గడపలేదు.

• పొగ త్రాగటం: పురుషులలో కన్నా స్త్రీలపై పొగ త్రాగే అలవాటు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

• ముట్లుడిగిపోవటం/మెనోపాజ్ : చిన్న రక్త నాళాల్లో హృద్రోగ సంబంధ లక్షణాలు పెరగటానికి మెనో పాజ్ తరువాత స్త్రీలలో ఈస్ట్రో జేన్ ఉత్పత్తి తగ్గటం ప్రధానకారణం అవుతోంది.

• జివక్రియలకు సంబంధించిన వ్యాధి: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక ట్రైగ్లిజ రేడ్స్, పొట్ట చుట్టూ పేరుకొన్న క్రొవ్వు. ఇవన్ని కారణాలు. వీన్నింటికి జీవక్రియలు మందగించటం తోడయినట్లయితే అది పురుషులకన్నా స్త్రీలకూ అధిక చేటును తెస్తుంది.

వ్యాధి నివారణ వ్యాధిని నయం చెయ్యటం కన్నా మంచిది:

స్త్రీలక శుభ వార్త ఏమిటంటే జీవన విధానంలోను, కొన్ని ఆహారపుటలవాట్లలోను మార్పు చేసుకున్నంత మాత్రాన ఈ వ్యాధులను నివారించవచ్చు. అందుకోసం పెద్ద ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలను, నూనెలను, క్రొవ్వు పదార్థాలను బాగా తగ్గించటం, సహజసిద్ధమైన ఆహారాలను తీసుకోవటం సాధారణంగా అందరూ సూచిస్తారు.

వ్యాయామం కూడా ముఖ్యమే! గబా గబా నడవటం, పరుగెత్తటం, ఈత కొట్టడం వంటి వ్యాయామాలను వారానికి ఐదారు రోజులు రోజులు, రోజుకు అరగంట చేస్తే చాలు. వీలైనంత వరకు రోజంతా శారీరకంగా చురుకుగా ఉండటం లాభదాయకం.మీ గుండెను మీరు ఎంతగా ఉపయోగిస్తారో అంతగా అది ఆరోగ్యంగా ఉంటుంది. మీ కుటుంబ చరిత్రను బట్టి, మీ వయసును బట్టి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను చేసుకోవటం ద్వారా వ్యాధిని చాలా వరకు నివారించ వచ్చు.

యోగం పాత్ర:

గుండెనొప్పిని, ఇతర హృద్రోగాలను నివారించడంలో యోగం ముఖ్య పాత్రను నిర్వహిస్తుంది. యోగం ఒత్తిడిని దూరం చేస్తుందన్న విషయం మనకందరికి తెలిసి నదే !క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేసే వారిలో ఒత్తిడి తగ్గించటమే కాక ఒత్తిడి ఉండే పరిస్థితులలో కలిగే ప్రతిస్పందన కూడా తగ్గుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అధిక రక్త పోటు, మధుమేహం, అధిక కోలెస్ట్రాలులతో పాటు, కోపం, నిస్త్రాణ, ఉద్రిక్తత కూడా ఇందుమూలంగా తగ్గుతాయి.