ఐక్యరాజసమితి యోగా దినోత్సవం ప్రకటించక మునుపే, భారతదేశాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలకి నెలవుగా ప్రపంచమంతా గుర్తించేవారు. ఎన్నో వేల సంవత్సరాలుగా, యోగులు శ్రేయస్సును కలిగించే ఈ పరికరాలను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా సంచరించారు. ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవాలనుకున్నవారు  ఎక్కడెక్కడి నుంచో ఈ భరతఖండానికి పయనమై వచ్చారు. ఈ ఆర్టికల్ లో సద్గురు మనకు ప్రాచీన సందర్శకులు ఇంకా యోగుల గురించి చెబుతున్నారు.

పైతాగరస్(Pythagoras)

ఈయన రేఖా గణితానికి ప్రఖ్యాతి గాంచారు. కాని అది ఈయన జీవితంలో అతికొద్ది భాగం మాత్రమే. ఈయన జీవితంలో చాలా భాగం ఆధ్యాత్మిక సాధనకై వెచ్చించారు. భారతీయ యోగులచే ప్రభావితమై, 2500ల సంవత్సరాల క్రితం ఈయన భారతదేశానికి పయనమై వచ్చారు. ఈయన మంత్రసాధన, శాకాహార భోజనాన్ని ప్రోత్సహించటం, పునర్జన్మ ఉంటుందని నమ్మడం ఇంకా కొంతమందిని ఏళ్ళ కొలది మౌన దీక్షలో  ఉంచడం చేసేవారని చెబుతూ ఉంటారు. మొట్టమొదటి సారిగా ప్రపంచానికి ఆ భాగంలో ఉన్నవారు, మౌనం వల్ల ప్రయోజనం గురించి మాట్లాడారు.

అపోల్లొనియస్(Apollonius of Tyana)

ఈయన 1 A.D కు చెందినా గ్రీకు తత్త్వవేత్త. ఈయన పైతాగరస్ అనుచరుడు. పైతాగరస్ వల్ల ప్రభావితమై ఈయన భారతదేశానికి వచ్చి ఎన్నో సంవత్సరాలు ఒక యోగి వద్ద గడిపారు. ఆయనను అయార్చాస్(Ayarchas) అని సంభోధించారు. ఇలాంటి పేరు భారతదేశంలో లేదు, బహుశా గ్రీకులు పేరుని తప్పుగా సంభోదించి ఉండవచ్చు. మనకు అసలు పేరేంటో తెలీదు. తరువాత ఆయన గ్రీస్ దేశానికి తిరిగి వస్తూ ఆయన గురువుగారి మీద ఒక కవిత రాసారు. అందులో "నేను నేల మీదనే వచ్చాను కాని ఆయన నా మీద ఒక సముద్రాన్నే కురిపించారు" అని అన్నారు. ఈయన తిరిగి వస్తూ టర్కీ, ఉత్తర ఆఫ్రికా, ఈజిప్ట్ దేశాలకు వెళ్ళారు. ఇక్కడి వారి అజ్ఞాన స్థాయిని చూసి నిరాశ చెందారు. అక్కడ కేవలం గుడ్డి సాంప్రదాయాలు మాత్రమే పాటిస్తున్నారు. ఒక ఈజిప్ట్ మతాధికారి "మీకింత గర్వం ఎక్కడినుంచి వచ్చింది? మీరు ఇంత అధికారంతో ఎలా మాట్లాడగలుగుతున్నారు" అని అడిగాడు. "నేను ఎలాంటి గడ్డ కు వెళ్లి  వస్తున్నానంటే, ఒక్కసారి అక్కడ అడుగు పెడితే చాలు ఈ రకమైన అధికారాలతో మాట్లాడగలరు" అని బదులిచ్చాడు.

రోమన్ సామ్రాజ్యానికి రాణి అయిన జూలియా డోమ్నా(domna) పై వీరిని చూసి  ప్రభావితురాలయ్యింది. ఈ రాణి అపోల్లొనియస్ పై ఒక పుస్తకం రాయమని నియమించగా ఫిలొస్ట్రటస్(Philostratus) దీన్ని రచించారు. ఈ పుస్తకం యూరప్ లోని అన్ని ప్రధాన స్థానాలలోకి పంపబడింది. ఎన్నో చోట్ల జాగ్రత్త చేయబడింది కూడా.

పైర్ర్హో (Pyrrho)

ఒక పెద్ద తత్త్వవేత్త, గణితశాస్త్రజ్ఞుడు ఇంకా శాస్త్రవేత్త  అయినటువంటి పైర్ర్హో , ఆలెగ్జాండర్ తో పాటు భారతదేశానికి వచ్చారు. ఈయన ఇక్కడ కొంత కాలం గడిపి తిరిగి గ్రీకు దేశానికి వెళ్లి అక్కడ అంతః ప్రశాంతత, శాంతి గురించిన తత్త్వం అందచేసారు. యూరప్ లో ఇటువంటివి వింత విషయాలు. వారికి ప్రశాంతత అంటే వారి పోరుగువారిని చంపేయడమే.

61 స్త్రీలు

సుమారు 3500 సంవత్సరాల క్రితం 61మంది స్త్రీలు ఒక సమూహంగా ఉత్తర భారతదేశానికి వచ్చి కొంతమంది గురువుల వద్ద మంత్ర, యంత్ర, తంత్ర విద్యలను అభ్యసించారన్న ఋజువులు ఉన్నాయి. వీరు సెంట్రల్ ఆసియ, యూరప్, టర్కీ, అరేబియా దేశాలకు పయనమై, ఈ విద్యలను అక్కడ వ్యాప్తింప చేసారు. వీరి గురించి ఎక్కువగా తెలియడం కాని, మాట్లాడటం గాని జరగలేదు కాని వీరు వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని ఈ భాగాలలో ఒక పెద్ద స్థాయిలో  మేల్కొలుపుని తీసుకొచ్చారు. అరేబియా, యూరప్, ఫోనిశియా ఇంకా అనేక ప్రదేశాల్లో దేవి పూజలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కొన్ని తీవ్రవాద నమ్మకాలు వీటిని అణిచివేసేవరకు ఇవి కొనసాగాయి.

మన్సూర్ అల్- హల్లాజ్ (Mansoor Al - Hallaj)

సూఫీ విధానంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి మన్సూర్ అల్- హల్లాజ్. ఈరోజు ఇరాక్ గా పిలవబడుతున్న బస్రా అనే ప్రాంతం నుండి ఈయన వచ్చారు. ఈయన ప్రయాణాల్లో గుజరాత్ కు సుమారు 10 A.D ప్రాంతం లో వచ్చి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఒక గురువుతో గడిపారు. ఈయన కేవలం ఒక గోచీ గుడ్డ పట్టుకుని ఇరాక్ కు తిరిగి పయనమయ్యారు - ఇది సరిగ్గా ఒక యోగి ఉండే విధానమే..! ఈయన "అన్ అల్ హక్ (Ana - Al- Haqq)" అని చెప్పారు అంటే "అహం బ్రహ్మాస్మి", "నేనే భగవంతుడిని".

ప్రజలు ఈయనని పిచ్చివాడనుకున్నారు - ఒక విషయమేమిటంటే గోచీ గుడ్డ, రెండోది నేనే భగవంతుడిని అనడం. అయినా ఈయన ఆగలేదు. ఈయన మక్కాకు వెళ్లి అక్కడ ఒక చిన్నవిగ్రహాన్ని ప్రతిష్ట చేసారు. ప్రజలు అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. దీనిని సహించలేక, ఈయనని దారుణంగా చంపేశారు. ఈయన చర్మం వలిచి సజీవంగా ఉండగానే కటి వరకు పాతిపెట్టారు. ఆ వీధిగుండా, అటు వైపు వెళ్ళినవారేవరైనా సరే ఈయన మీద ఒక రాయి విసిరేయ్యాలి. మన్సూర్ కు ప్రియ స్నేహితుడు ఒకసారి అటు వైపు వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఏదో ఒకటి విసిరేయాలి - ఒక రాయి విసరడానికి మనసు రాక, ఆయన పైన ఒక పువ్వును విసిరాడు. ఇది జరిగినప్పుడు, మన్సూర్ తన దుఖాన్ని ఒక కవితలా చెప్పారు " అన్నిటిలోకేల్ల ఆ రాళ్ళు నన్ను బాధపెట్టలేదు. అవి విసిరినా వారు అజ్ఞానులు, నువ్వు నాపై ఈ పువ్వు విసిరావు. ఇది నన్నుతీవ్రంగా బాధపెడుతోంది. ఎందుకంటే, నీకు అన్నీతెలిసినా నువ్వు నా మీద ఎదో ఒకటి విసిరేసావు."

ఆగ్నేయ ఆసియా (South east Asia)

భారతపురాణంలోని, ఇంకా ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో పాతాళలోకం గురించి మాట్లాడతారు, దీనిని నాగలోకం అని కూడా అంటారు. నాగులుగా పిలవబడే ఒక పెద్ద మానవ సమాజమే ఉండేది. ఈ నాగులు సర్ప జాతికి చెందినవారు. భారతదేశ, ఇంకా అనేక సంస్కృతుల చైతన్యాన్ని పెంపొందించడంలో వీరు ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు కంబోడియాకు చెందిన గొప్ప దేవాలయాలైన ఆంగ్కోర్, ఆంగ్కోర్ తోం ఇంకా ఆంగ్కోర్ వాట్ లు నాగుల వంశీయులు కట్టినవే అని మనకు తెలుసు. నాగులు భారతదేశం నుండి వెళ్లి అక్కడ దేశీయ ప్రజలతో కలిసిపోయి, నాగుల సామ్రాజ్యాన్ని అక్కడ స్థాపించారు.

చైనాకు జెన్ ఎలా వచ్చింది?

దక్షిణ భారతదేశంలో ఉన్న పల్లవ రాజ్యానికి బోధి ధర్ముడు యువరాజుగా జన్మించాడు. ఈయన కాంచీపుర రాజకుమారుడు. కాని అతిచిన్న వయసులోనే రాజ్యాన్ని, యువరాజ పదవిని వదిలి సన్యాసిగా మారాడు. ఈయనకు 22వ సంవత్సరంలో జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఈయనను దూతగా చైనాకు పంపించారు. జెన్ ను చైనాకు తీసుకువచ్చింది బోధిధర్ముడే.

గౌతమ బుద్ధుడు ధ్యానాన్ని నేర్పించాడు. కొన్ని వందల సంవత్సరాల తరువాత బోధిధర్ముడు ఈ ధ్యానాన్ని చైనాకు తీసుకువచ్చాడు. ఇక్కడ ఇది "చాన్" అయ్యింది. ఈ చాన్ ఇండోనేషియా, జపాన్ తదితర తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి "జెన్" గా మారింది.

సప్తఋషులు

యోగ సంప్రదాయంలో శివుడిని ఒక దేవుడిగా పూజించరు. ఈయన “ఆదియోగి” అంటే మొట్టమొదటి యోగి ఇంకా “ఆది గురువు” అంటే మొట్టమొదటి గురువు. ఈయన నుండే యోగ శాస్త్రమంతా ఉద్భవించింది. దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజున ఆదియోగి ఆదిగురువుగా మారాడు.  ఆదియోగి తన మొదటి ఏడుగురు శిష్యులైన సప్తఋషులకు బోధించడం మొదలుపెట్టాడు.

మానవ జీవనంలో గురుపూర్ణిమ ఎంతో వైశిష్ట్యం కలది. ప్రయత్నంతో భౌతిక స్వభావీకాలైన పరిమితులను మానవుడు అధిగామించవచ్చునన్న ఆవశ్యకతను ఆదియోగి మనముందుంచారు. ఈరోజున ఈ విషయం మనం గుర్తుచేసుకోవలసింది.ఆదియోగి చేసిన ప్రసరణ చాలా కాలం గడిచింది, ఎన్నో సంవత్సరాల తరువాత ఇది పూర్తయ్యింది. ఈయన ఈ ఏడుగురికి జ్ఞానోదయం కలిగించారు. ఆదియోగి అప్పుడు వారితో "మీరు ఇది ఈ ప్రపంచమంతా వ్యాపింప చేయండి" అని చెప్పారు.

వీరిలో ఒకరు మధ్య ఆఫ్రికాకు వెళ్లారు. మిడిల్ ఈస్ట్,  ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి ఒకరు వెళ్లారు, ఒకరు దక్షిణ అమెరికాకు వెళ్లారు. ఒకరు ఆదియోగి వద్దే ఉండిపోయారు. ఒకరు హిమాలయాలలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లారు. ఒకరు ఉత్తర ఆసియాకు వెళ్ళారు, మరొకరు దక్షిణానికి వచ్చారు. దక్షిణం వైపు ప్రయాణం చేసి భారత దేశానికి వచ్చిన అగస్త్యముని మనకెంతో ప్రముఖమైనవారు. మనం దక్షిణం అంటే హిమాలయాలకు దక్షిణంగా ఉన్నది అని అర్ధం. ఈయన దక్షిణానికి వచ్చి ఆధ్యాత్మిక ప్రక్రియను ప్రతిఒక్కరి జీవనంలో భాగం చేసేసారు. ఈ ఉపఖండం లో ఈయన ఒక్క మానవసమూహాన్ని కూడా వదిలిపెట్టలేదంటారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతీ మానవ సమూహం ఏదోవిధంగా స్పృశించ బడేలాగా చూసారు. దీనిని ఒక భోదనలా చేయలేదు, ఆధ్యాత్మిక ప్రక్రియను వారి జీవితాల్లో అంతర్లీనం చేసేసారు. భారతదేశంలోని ప్రతి కుటుంబంలోనూ ఇప్పటికీ ఈ ఛాయలు కనిపిస్తాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు