సప్తర్షులలోఒకరు, ఆదియోగి శివుడికి ప్రత్యక్ష శిష్యులు అయిన అగస్త్య ముని ఎన్నో మహత్తర అంశాలు నిండిన జీవి. దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గ దిశానిర్దేశం చేయడానికి ఆయన గణనీయమైన సమయం వెచ్చించారు. ఈనాటికి కూడా ఆయన జీవితానికి సంభందించిన ఎన్నో కథలు ఈ భూభాగంలో ప్రతిధ్వనిస్తుంటాయి, ఆయన దక్షిణ భారతదేశ మార్మికతకు గురువుగా ప్రసిద్ధి కెక్కారు.

విషయసూచిక
1. దక్షిణ భారతదేశ మార్మికతకు గురువుగా అగస్త్యముని ఎలా ప్రసిద్ధి చెందారు?
2. కార్తికేయుని కోపాన్ని అణచిన అగస్త్య ముని
3. వింధ్యాచల పర్వతాలను జయించిన అగస్త్య ముని
4. అగస్త్య ముని నాటిన పరిమళ భరిత పూల చెట్టు
5. కావేరి నదిలో అబ్బురపరిచే నత్తత్రీశ్వరార్ కోవెల
6. అగస్త్య ముని ప్రతిష్టించిన ఒక రహస్య దేవాలయం

#1 దక్షిణ భారతదేశ మార్మికతకు గురువుగా అగస్త్యముని ఎలా ప్రసిద్ధి చెందారు?

సద్గురు: ఆదియోగి తన జ్ఞానాన్ని ప్రసరింపచేసే క్రమంలో ఒక మనిషి తన పరమోత్తమ స్వభావాన్ని చేరుకునేందుకు 112 మార్గాలను అన్వేషించి ప్రతిపాదించారు. సప్త ఋషులు – ఆదియోగికి ఉన్న ఏడుగురు శిష్యులు – ఈ 112 మార్గాలను గ్రహించుటకు ఎక్కువ సమయం పడుతుందని గమనించిన ఆదియోగి, 112 మార్గాలను ఒకొక్క ఋషికి 16 మార్గాల చొప్పున విభజించారు. ప్రతి ఒక్క ఋషి ముక్తిని పొందటానికి 16 మార్గాలను అభ్యసించారు. ఈ 16 మార్గాలను అభ్యసించటానికి ఒకొక్కరికి 84 సంవత్సరాలు పట్టినట్లు చెబుతారు. ఆదియోగితో గడిపిన ఈ 84 సంవత్సరాల కాలంలో, ఆదియోగి వారికి కేవలం గురువు మాత్రమే కాక క్రమంగా సర్వస్వము తానే అయ్యారు. 

వారు తమ 16 మార్గాలను గ్రహించి, ఆ జ్ఞానంలో మునకలేయటం మొదలు పెట్టిన సప్త ఋషులతో ఆదియోగి "ఇక వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది" అని అన్నారు. ఆ మాటతో వారు నిశ్చేష్టులయ్యారు, ఎందుకంటే, ఆదియోగిలేని జీవితాన్ని వారు ఊహించలేకపోయారు. ఆదియోగి మాత్రం "లేదు, మీరు వెళ్ళవలసిన సమయం ఇది. మీరు వెళ్లి మీ జ్ఞానాన్ని మిగిలిన ప్రపంచజనులందరికి అందించాలి." అని అన్నారు.

వారు ఇక వెళ్ళబోతున్నారు అనగా ఆయన "గురు దక్షిణ మాటేమిటి?" అని అడిగారు. ఈ గురుదక్షిణ ఉద్దేశం గురువుకి ఎదో కావాలి అని కాదు, శిష్యులు వెళ్లే ముందు ఒక సమర్పణాభావం అలవర్చుకుని వెళ్లాలని గురువు కోరుకుంటారు. ఎందుకంటే, ఒక మనిషి సమర్పణా స్థితిలో ఉన్నపుడే అత్యున్నత స్థాయిలో ఉంటాడు. ఈ కారణంగానే ఆదియోగి గురు దక్షిణ అడిగారు. ఆ మాటలకు ఈ ఏడుగురు దిగ్భ్రాంతి చెందారు. ఆయనకు ఇవ్వగలిగింది వారి దగ్గర ఏం ఉందని?

కొంత సేపు మధన పడిన తరువాత, అగస్త్య ముని ముందుకు వచ్చి ఇలా అన్నారు. "నా జీవితంలో నాకున్న అత్యంత విలువైనవి, నా జీవం కంటే కూడా విలువైనవి ఏమంటే, నా గురువు దగ్గర నుంచి నేను పొందిన 16 జీవన పార్శ్వాలు. నేను వాటినే ఇప్పుడు మీకు సమర్పిస్తున్నాను." ఇన్ని సంవత్సరాలుగా ఆయన నేర్చుకున్న ప్రతి దానినీ అగస్త్య ముని తిరిగి ఆదియోగికి సమర్పించేసారు. ఆయన బాటలోనే మిగిలిన ఋషులు కూడా సమర్పణ చేశారు.

ఈ జ్ఞానం పొందాటానికి వారు 84 సంవత్సరాలు కఠోర సాధన చేసారు, కానీ ఆదియోగి గురుదక్షిణ అడగగానే, ఈ సాధనాసారం మొత్తం ఒక్క క్షణంలో ఆదియోగి పాదాల దగ్గర సమర్పించి రిక్త హస్తాలతో నుంచున్నారు. అప్పుడు ఆదియోగి "ఇక వెళ్ళండి" అన్నారు. వారు ఖాళీ చేతులతో అక్కడ నుంచి బయలుదేరారు. ఇదే, ఆదియోగి భోదన మొత్తంలో చాలా గొప్ప అంశం. వారు ఖాళీగా అయ్యారు కనుకనే, వాళ్లు కూడా ఆదియోగిలా అయిపోయారు. "శి-వ" అంటే "ఏదైతే లేదో అది" వారు "ఏది లేదో, అది" అయిపోయారు. వారు ఈ స్థితికి పరిణామం చెందారు కనుకనే, 112 జీవన ముక్తి మార్గాలూ ఈ ఏడుగురిలో వ్యక్తమయ్యాయి. వేటినైతే వారు గ్రహించలేకపోయారో, వేటిని సాధించటానికి వారి శక్తిచాలదో, వేటిని గ్రహించగల జ్ఞానం వారి దగ్గర లేదో – అటువంటివన్నీ ఇప్పుడు వారిలో భాగం అయ్యాయి, దీనికి కారణం వారు ఇప్పటి వరకు కూడబెట్టిన జ్ఞానాన్ని, వారి జీవితాలలో అత్యంత విలువైన దానిని, తిరిగి ఆదియోగికి సమర్పించి, ఖాళీ చేతులతో వెళ్లిపోవటమే.

#2 కార్తికేయుని కోపాన్ని అణచిన అగస్త్యముని 

కార్తికేయుడు శివుని కుమారుడు. ఆయనకి ఒకసారి తీవ్ర కోపం వచ్చి తన తండ్రికి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. అత్యంత తీవ్రమైన కోపంతో దక్షిణ భారతదేశం వైపు కిందకి వచ్చి ఒక యోధుడిలా మారాడు. ఎన్నో విధాలుగా అతను సాటిలేని గొప్ప యోధుడు. కనుక అతను అందరిని జయిస్తూ పోతున్నాడు. అతను పాలనాకాంక్షతో జయించటంలేదు. ఏదైతే అతనికి అన్యాయంగా తోచిందో దానిని వధిస్తూ పోతున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో తన తల్లిద్రండులు తన పట్ల అన్యాయం చేసారు. అందుకే అతను ప్రపంచంలో న్యాయం నెలకొల్పాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం కోపంగా ఉంటామో అప్పుడు మనకు ప్రతిదీ అన్యాయంగానే తోస్తుంది. కార్తికేయునికి కూడా ఈ ప్రపంచంలో ఎంతో అన్యాయం ఉన్నట్లు తోచింది, అందుకనే ఎన్నో యుద్దాలు చేస్తూ వధించదగిన వారిని ఎంతో మందిని కనుగొన్నాడు. 

అగస్త్య మునే కార్తికేయుని కోపాగ్నిని జ్ఞానోదయానికి సాధనంగా మార్చారు. చివరికి కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడిగా ప్రశాంతతని పొందాడు. సుబ్రమణ్య అనే ఊరిలో చివరి సారిగా తన ఖడ్గాన్నికడిగి, ఆ ప్రదేశంలో కొన్ని రోజులు గడిపి, కుమార పర్వతం పైకెక్కి అక్కడ నిలబడిన భంగిమలో మహా సమాధి చెందాడు కార్తికేయుడు. కార్తికేయుని కోపాన్ని జ్ఞానోదయమార్గంగా మలచటం అనే ఒక గొప్పకళకి కర్త అగస్త్యముని.

#3 వింధ్యాచల పర్వతాలను జయించిన అగస్త్య ముని

అగస్త్య ముని దక్షిణ భారతదేశంవైపు ప్రయాణిస్తుండగా, వింధ్యాచలం ఎదురుపడింది. వింధ్య పర్వతాలు, భారతదేశంలో హిమాలయాల కంటే ప్రాచీనమైన పర్వతాలు. కానీ పర్వతరాజుగా హిమాలయం ఎన్నుకోబడింది. కనుక కోపంగా ఉన్న వింధ్యాచలం, అగస్త్య ముని దక్షిణ భారతదేశంవైపు పయనిస్తుండగా అడ్డుకుని ఈ విధంగా నిలదీసింది. "హిమాలయాన్ని మీరందరూ రాజుగా ఎలా ప్రకటిస్తారు? నాతో పోల్చుకుంటే అతను చాలా చిన్నవాడు" అని.

అగస్త్య మునికి ఒక విషయం బాగా తెలుసు, ఒక మనిషికి కోపం వస్తేనే అది చాలా దుర్భర స్థితులకు దారి తీస్తుంది, అలాంటిది ఒక పర్వతానికి కోపం వస్తే, అది ఎంత నష్టం చేకూరుస్తుందో అంచనా వేయలేం. అగస్త్య ముని వింధ్యాచలం ముందు కూర్చొనగానే, ఆ పర్వతం గొప్ప శ్రద్ధా భక్తులు కలిగినది కావటంతో, శిరస్సు వంచి నమస్కరించింది. అప్పుడు అగస్త్య ముని "ఇలానే ఉండు, నేను దక్షిణంవైపు వెళ్లి తిరిగి వస్తాను; అప్పుడు నీ సమస్య సంగతి చూద్దాం" అని వెళ్లి పోయారు. కనుక వింధ్యాచలం అగస్త్య ముని తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ అలా వంగే ఉంది. అగస్త్య ముని ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ విధంగా వింధ్యాచలాన్ని తప్పించుకుని, ఆ పర్వతాన్ని అలానే లొంగదీసి ఉంచొచ్చని ఆయన ఉత్తర భారతదేశం వెళ్ళవలసి వచ్చినప్పుడు, పూరిజగన్నాథ్ మీదుగా ఇంకొక మార్గంలో వెళ్ళారు. వింధ్యాచలం అలా వొంగి ఉన్నది కనుకనే అది చిన్న పర్వతం అయింది. హిమాలయం నుంచుని ఉంది, ఇంకా ఇంకా ఎత్తు పెరుగుతోంది కనుక అది పెద్ద పర్వతం అయింది.

#4 అగస్త్య ముని నాటిన పరిమళ భరిత పూల చెట్టు

కర్ణాటకలో BR హిల్స్, లేదా బెల్లిగిరి రంగనబెట్ట అని పిలవబడే కొండలలోని ఒక ప్రదేశంలో ఒక సంపెంగ చెట్టు ఉంది. దానినే చంపా అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు సంపెంగ చాలా పరిమళ భరిత పుష్పం. అక్కడి వారందరూ, ఈ చెట్టు 6000 సంవత్సరాలకి పూర్వం అగస్త్య మునిచేత నాటబడింది అని చెప్తారు. ఆ చెట్టు ఖచ్చితంగా చాలా పాతది. అది గట్టిగా అల్లుకుని, తన జాతి సంపెంగ వృక్షాలు అన్నిటిలోకెల్లా చాలా పాతదిగా కనిపిస్తుంది. ఈచెట్టుని "దొడ్డసంపెంగ" అంటే "పెద్ద సంపెంగ" అని పిలుస్తారు.

#5 కావేరి నదిలో అబ్బురపరిచే నత్తత్రీశ్వరార్ కోవెల 

కావేరి నదికి మధ్య స్థానంలో ఉండే నత్తత్రీశ్వరార్ దేవాలయం ఒక అద్భుతమైన కోవెల. తలకావేరి దగ్గర పుట్టిన కావేరి నది, సముద్రం వైపు ప్రయాణించే మార్గంలో సరిగ్గా సగం దూరం దగ్గర నదిలో ఉన్న ఒక ద్వీపం మీద కొలువై వుంది ఈ దేవాలయం. కనుక ఈ ప్రదేశాన్ని కావేరి నదికి నాభి స్థానంగా భావిస్తారు. ఈ కోవెలలోని లింగాన్ని 6000 సంవత్సరాలకి పూర్వం అగస్త్య ముని ప్రతిష్టించారని చెబుతారు. ఈ లింగం ఆ రోజులలో దొరికే కొన్ని సంప్రదాయ మిశ్రమాలు కలిపిన ఇసుకతో తయారు చేయబడింది. ఈ ఇసుక లింగం ఈనాటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంక శక్తి రూపేణా గమనిస్తే, ఈ లింగం ఒక శక్తి భాండాగారం. అది 6000 సంవత్సరాలకి పూర్వం అయినప్పటికీ, నిన్నో మొన్నో ప్రతిష్టించినట్లు మనం అనుభూతి చెందుతాం.

ఈ ఇసుక లింగం ఈ నాటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంక శక్తి రూపేణా, ఈ లింగం ఒక శక్తి భాండాగారం!

అగస్త్య ముని వారి శక్తులను మరియు సూక్ష్మ శరీరాన్ని ఈ ప్రదేశంలో విడిచి పెట్టినట్లు నమ్ముతారు. ఆయన మనో శరీరాన్ని లేదా మనోమయ కోశాన్ని మధురై దగ్గరలోని చతురగిరి కొండలలో వదిలినట్టు చెబుతారు. కార్తికేయుని సహకారంతో తన భౌతిక శరీరాన్ని శివుడు ఉండే కైలాస పర్వతం మీదకి తీసుకెళ్లి, అక్కడ వదిలిపెట్టారు. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ.

ఒక విధంగా ఆలోచిస్తే, అగస్త్యులు కావేరి నదిని భౌతిక శరీర రూపేణా చూస్తున్నారు, మరియు ఆయన నత్తత్రీశ్వరర్‌లో ఒక నాభీ స్థానం నెలకొల్పి, శక్తి యొక్క ఊర్ధ్వ గమనం ఇంకా అధోగమనం ఒక సరి అయిన పద్దతిలో జరిగేటట్లు చర్య తీసుకున్నారు. ఈ భారత నేలలోని గొప్ప విశిష్టత ఏంటంటే, ఇక్కడ మానవ మనుగడ ఇంకా శ్రేయస్సు కేవలం ఒక పర్యవసానం మాత్రమే కానీ అవి జీవన ధ్యేయం కాదు. మానవ వికాసమే ఎల్లప్పుడూ జీవన ధ్యేయం. ఎందరో మహాత్ములు, మానవ వృద్ధి ఇంకా ప్రతి మానవుని వికాసం కోసమే వారి శక్తులని కొన్ని పద్దతులలో వెచ్చించారు. వారు కొన్ని శక్తి వ్యవస్థలని సృష్టించి, ప్రతి దానినీ ఆ వికాసానికి ఒక అవకాశంగా మలిచారు – చివరికి ఒక నదిని కూడా!

#6 అగస్త్య ముని ప్రతిష్టించిన ఒక రహస్య దేవాలయం

కాశి అనేది పవిత్ర పట్టణాలన్నిటిలోకి పవిత్రమైన పట్టణం మరియు జ్ఞానార్జన అందించే పురాతనమైన పట్టణాలలో ఒకటి. కొన్ని వందల మంది జ్ఞానులు ఒకేసారి నివసించిన ప్రదేశం. మీరు నడిచే ప్రతి వీధిలోనూ మీకు ఒక జ్ఞాని ఎదురవుతారు. "గుప్త్" అంటే రహస్యం అని అర్థం.

కనుక "గుప్తకాశి" అంటే రహస్య కాశి. ఎవ్వరికీ ఈ ప్రదేశం తెలియకూడదు. గుప్తకాశి మనకి ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రదేశం, ఎందుకంటే 75 సంవత్సరాల క్రితం ధ్యానలింగానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు ఇక్కడే జరిగాయి. ఇది ఒక ఆశ్చర్యకరమైన దేవాలయం, ఒక అందమైన చోటు.

ఈ దేవాలయం అగస్త్య ముని నడిచిన స్థలము. అగస్త్య ముని కానీ, ఆయన వంటి వ్యక్తి కానీ ఈ లింగాన్ని ప్రతిష్టించారు. ఈ లింగం తత్త్వం అగస్త్య ముని విషయాలని నిర్వహించే విధానానికి సారూప్యంగా ఉంది, అదే అచ్చమైన క్రియ. మంత్రాలులేని, తంత్రాలులేని, ఇంకా ఎటువంటి ప్రక్రియలులేనిది – వంద శాతం శక్తి క్రియ. నేను అదే విధంగా ఉంటాను. అదొక్కటే నాకు తెలిసిన విషయం. కేవలం శక్తి ఆధారంగానే నేను జీవాన్ని ఒక స్థాయి నుంచి వేరొక స్థాయికి మార్చగలను.

సంపాదకుని గమనిక: అగస్త్య మునికి సంబంధించిన అయిదు మార్మిక అంశాలని సద్గురు అందించిన ఈ 20 నిమిషాల సమగ్రమైన వీడీయోలో మీకు అందిస్తున్నాము.