యోగ సూత్రాలను సంకలనం చేసిన పతంజలి మహర్షిని 'ఆధునిక యోగా పితామహుడి'గా భావిస్తారు. మొదట ఆదియోగి 'శివుడు' యోగాలోని వివిధ అంశాలను సప్తఋషులకు అందించారు, ఇవే ఏడు ప్రాధమిక వ్యవస్థలుగా మారాయి. కానీ ఆయన ఎప్పుడూ ఏది లిఖితరూపంలో ఉంచలేదు. కాలక్రమేణా అవి కొన్ని వందల వ్యవస్థలుగా ఆవిర్భవించాయి. భారతదేశంలో ఒక్కప్పుడు 1700 విభిన్న యోగా విధానాలు ఉండేవి. అందువల్ల పతంజలి వాటిన్నిటినీ 200 సూత్రాలలో క్రోడీకరించి “మానవ అంతర్గత వ్యవస్థ గురించి చెప్పగలిగేదంతా ఇందులో ఉంది” అని అన్నారు.

వాస్తవానికి, పతంజలి జీవితం గురించి చెప్పగలిగినదంతా చెప్పేశారు.

పతంజలి యోగసూత్రాలు కేవలం ఒక నిర్దిష్ట స్థాయి అనుభవం కలిగిన వారికి మాత్రమే అర్ధం అయ్యేలా రూపొందించబడ్డాయి. సాధారణ పాఠకునికి అవి అర్థరహితమైన మాటలుగా అనిపిస్తాయి. పతంజలి జీవితం గురించి వ్రాసిన ఈ మహత్తర గ్రంధాన్ని ఒక వింత పద్ధతిలో మొదలుపెట్టారు. మొదటి అధ్యాయం, ‘ఇక ఇప్పుడు, యోగా’ అనే అర్థ వాక్యం మాత్రమే. ఆయన చెప్పదలచుకున్నదేమిటంటే – కోరుకున్న ఉద్యోగం, అవసరమైన డబ్బు, నచ్చిన జీవిత భాగస్వామి ఉన్నా కూడా, మీలో ఇంకా ఏదో వెలతి ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటే, అప్పుడు మీ జీవితంలో 'యోగా'కి సమయం ఆసన్నమైనట్లు. కొత్త ఇల్లు కట్టుకుంటే, లేక మరొక ఉద్యోగంలో చేరితే అంతా బాగుంటుంది అని మీరు ఇంకా విశ్వసిస్తున్నట్లైతే, మీ జీవితంలో 'యోగా'కి సమయం ఇంకా రానట్లే. ఇలాంటివేవి మీకు నిజమైన సంపూర్ణతను కలిగించవని మీకు అవగతమైనప్పుడే, మీకు యోగా చేయవలిసిన సమయం ఆసన్నమైనట్లు. అందుకే పతంజలి యోగసూత్రాలలోని మొదటి అధ్యాయంలో ‘ఇక ఇప్పుడు, యోగా’ అనే ఒకే ఒక అర్థ వాక్యం ఉంటుంది.

వాస్తవానికి, పతంజలి జీవితం గురించి చెప్పగలిగినదంతా చెప్పేశారు. మేధస్సు పరంగా, అలాగే గణితశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, విశ్వనిర్మాణశాస్త్రం, సంగీతం.. వంటి వాటిలో ఆయనకున్న నైపుణ్యం పరంగా చూస్తే, మనిషిగా కేవలం ఒకే ఒక వ్యక్తికి జీవితం పట్ల ఇంత విస్తారమైన అవగాహన ఉండటం అసాధ్యం. మేధస్సు పరంగా నేటి శాస్త్రవేత్తలు పతంజలి ముందు పిల్లకాయల్లాగా కనిపిస్తారు ఎందుకంటే జీవితం గురించి చెప్పగలిగేదంతా ఆయన చెప్పేశారు. మీరు ఏది చెప్పాలని ప్రయత్నించినా, అది అయన ఇదివరకే చెప్పేశారు. ఆయన ఎవరికీ ఏదీ చెప్పటానికి మిగిల్చలేదు. ఇది అన్యాయం!

ప్రేమాశీస్సులతో,
సద్గురు