ప్రశ్న: ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో స్త్రీ శక్తి ప్రాముఖ్యత ఏమిటి/ ఎంత ఉంది?

సద్గురు: ఒకానొక సమయంలో స్త్రీ దేవతల ఆరాధన ప్రపంచమంతా చాలా ఎక్కువగా జరిగేది. కానీ దురదృష్టవశాత్తూ, మతం పట్ల పెరిగిన మహత్వ కాంక్ష, ఒక పద్ధతిగా మారింది. ఎప్పుడైతే గెలుపే ముఖ్యంగా మారిందో, అప్పుడు ప్రజలు ఈ భూమి మీదనుంచి స్త్రీత్వాన్ని కాల్చివేశారు. ఇక ఇవాళ, విజయానికి మార్గం కేవలం పురుషత్వమే; మనం స్త్రీలను కూడా తమ వ్యక్తిత్వంలో, పద్ధతుల్లో ఇంకా భావోద్వేగాల్లో పురుషుల తీరుగా వ్యవహరించేట్లుగా బలవంతంగా మార్చేశాం. ప్రతి ఒక్కరినీ సాఫల్యం అంటే గెలవడమే అని నమ్మేట్టుగా చేశాం.

కానీ నిజానికి గెలవడం కాదు పద్ధతి. దగ్గరికి తీసుకోవడం అసలైన పద్ధతి. ప్రపంచాన్నంతటినీ జయించాలన్న మహత్వ కాంక్షయే ఇవాళ మనం చూస్తున్న ఇన్ని రకాల పర్యావరణ విపత్తులకు కారణభూతమైనది. ఒకవేళ స్త్రీతత్వము అధిక అధిపత్యంలో గనక ఉండి ఉంటే, లేక స్త్రీ పురుష తత్వాలు రెండూ సమతూకంలో ఉండి ఉంటే, మనకి ఈ రకమైన పర్యావరణ విపత్తులు వచ్చి ఉండేవి కాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే, స్త్రీ దేవతారాధన ఇంకా భూమి ఆరాధన - రెండూ ఎప్పుడూ కలిసి జరిగేవి. భూమిని తల్లిగా భావించిన సంస్కృతులు ఎప్పుడు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణానికి అంతగా హాని కలిగించలేదు. కేవలం గెలుపే జీవన విధానం అని అనుకున్నప్పుడు మాత్రమే విధ్వంసం జరిగింది .

ప్రస్తుతం, ఈ భూమికి ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా, కావలసినంత ఆహారం లభ్యమౌతున్నప్పటికీ, ప్రపంచంలో సగం మందికి పైగా రెండు పూటలా, అన్నం తినలేక పోతున్నారు. అదే ఒకవేళ స్త్రీ తత్వం ఆధిపత్యంలో ఉంటే తప్పకుండా అందరూ కడుపునిండా తినగలిగే వారు, ఇంకా కరుణ, ప్రేమ ఇంకా సౌందర్యం ఎక్కువగా భాసిల్లేవి. మనం జీవితాన్ని ప్రేమించడానికి బదులు, జయించాలని అనుకున్నాము. స్త్రీ తత్వం ప్రాబల్యంలో ఉండి ఉంటే, బహుశా మనం కుజ గ్రహం మీదకో లేక చంద్రమండలం మీదకో వెళ్ళేవాళ్ళం కాదు, నిజానికి మనం అక్కడికి వెళ్లి అసలు ఏమి సాధించాము? అక్కడ ఒక జెండా పాతాం, కాలి అడుగుజాడలు వదిలి పెట్టాం, ఇక తిరిగి వచ్చాం. దాని వల్ల ఏం ఒరిగింది? చంద్రుడు తోటి ప్రేమ వ్యవహారం అంతా ఇప్పుడు ముగిసిపోయింది.

అసలు జీవితం పట్ల మన దృక్పథమే తలకిందులుగా ఉంది. నేను శాస్త్రపరమైన విజయాలకు వ్యతిరేకిని కాను, కానీ దీనిలో పడి, మనం జీవ(న) సంబంధమైన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాము. చాలా మంది జనానికి సైన్సు, సాంకేతికత అంటే అది కేవలం, ప్రపంచంలో దొరికే అన్నిటినీ స్వలాభం కోసం ఎలా వినియోగించుకోవాలి అని చెప్పేది అని మాత్రమే అర్థం. ప్రతి దాన్ని స్వప్రయోజనం కోసం వాడుకోవాలి అనే ఈ ధోరణి, గెలవాలనే కాంక్షతో నిండిన ఈ పద్ధతి, పూర్తిగా పురుష స్వభావమైనది. ఒకవేళ స్త్రీ తత్వం ఇంకా పురుషతత్వం సమతుల్యంలో ఉండి సంతులనం కలిగి ఉంటే, మనం చాలా మెరుగైన జీవితాలను గడిపి ఉండేవాళ్లం.

భారతదేశంలో దుర్గా దేవి ఆలయాలు

ఈ భూమ్మీద అన్నిటికంటే అతి ప్రాచీనమైన పూజా సాంప్రదాయం దేవి ఆరాధన. భారతదేశం, ఐరోపా, అరేబియా ఇంకా ఆఫ్రికాలో చాలా భాగాల్లో స్త్రీ దేవతల ఆరాధన జరుగుతూ ఉండేది. కానీ, ఇప్పుడు, ప్రపంచమంతటా పురుషతత్వానికి ప్రాధాన్యత విశేషంగా పెరిగిపోవటంతో, స్త్రీ దేవతల ఆరాధన కేవలం భారతదేశ సంస్కృతిలో మాత్రమే మిగిలి ఉంది.

ధ్యానలింగ ప్రతిష్టీకరణకు కొంచెం ముందుగా, దేవీ ఆలయాలను దర్శించడానికి నేను కొద్ది మందితో కలిసి పర్యటించాను. అప్పట్లో నాకు ఇంకా తమిళనాడు ప్రాంతానికి సంబంధించి భౌగోళికంగా అంతగా పరిజ్ఞానం లేదు కాబట్టి, కర్ణాటకని ఎంచుకున్నాను ఎందుకంటే అక్కడ దేవీ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఇవి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కావు, చిన్న చిన్న ఊళ్ళల్లో ఇంకా గ్రామాల్లో ఉన్న గుళ్లు. వీటి గురించి నాకు గతంలోనే తెలుసు కాబట్టి, వాటిని వెతుక్కుంటూ బయలుదేరాము. మేము కొన్ని విషయాలు పరిష్కరించుకోవాలి అనుకున్నాము, అందుకు సరైన స్థలము, శక్తి వంతమైన ప్రదేశం కోసం చూస్తూ ఉన్నాము. అది మేము ఈశా యోగా కేంద్రం లోనే చేయవచ్చు కానీ అందుకోసం ఒక మందిరాన్ని నిర్మించి, దాన్ని శక్తివంతంగా కాపాడుతూ ఉండాల్సి ఉంటుంది. మేము అప్పటికి ఇంకా ధ్యానలింగ ప్రతిష్టాపన చేయాల్సి ఉంది అందుకని, ఇవన్నీ పూర్తి చేయడానికి మరొక మందిరాన్ని నిర్మించదలుచుకోలేదు.

మేము ఇటువంటి మందిరాలను వెతుక్కుంటూ వెళ్ళాము, ఇక నేను నిజంగా అలా ఆశ్చర్యపోయాను. చిన్న ఊళ్ళలో, కొన్నిసార్లు చిన్న గ్రామాల్లో కూడా, కొన్ని వందల ఏళ్ళ క్రితం ప్రతిష్ట చేయబడిన దేవీ ఆలయాలు ఇంకా సజీవంగా ఉన్నాయి- సంపూర్ణంగా, శక్తివంతంగా ఇంకా రౌద్రంగా. వీటిలో చాలా మటుకు గుళ్లు ఆ ప్రాంతానికి సంబంధించి, ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం కట్టినవి. ఎవరు చేశారో కానీ, చాలా ప్రశంసనీయంగా చేశారు. అక్కడి సాంకేతికత చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు అలా ఎన్నోచోట్ల గుళ్లు కట్టి ప్రతిష్ట చేశారు అంటే, తప్పకుండా ఆ పరిజ్ఞానం బాగా విస్తరించి ఉండి ఉంటుంది; అంతేకాదు అక్కడి ప్రజలకు దాని గురించి బాగా తెలిసి ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో, అద్భుతమైన అధునాతనమైన సాంకేతికతతో చేసిన ప్రాణ ప్రతిష్ఠలను దర్శించడం (నాలో) చాలా వినమ్రతను కలిగించింది. వీళ్లు పేర్లు తెలియని యోగులు. వాళ్ళు ఎవరన్నది ఎవరికీ తెలీదు. వాళ్లు ఆ ఆలయాల్లో తమ పేర్లు రాసి పెట్టుకో లేదు- అందులోని అందం అదే- వాళ్లు తమ పేరు రాసిపెట్టి ఉంచాల్సిన అవసరం ఉందని కనీసం భావించలేదు. వాళ్లు నిక్షిప్తం చేసిన శక్తి మాత్రమే అక్కడ నిలిచి ఉంది. 

భారతదేశం ఎంతోమంది స్త్రీ దేవతలకు నిలయం - అద్భుతమైన, జ్ఞానమూర్తులైన ఇంకా ఉగ్రమైన దేవతలు. ప్రపంచంలో స్త్రీ దేవత ఆరాధన, కొన్ని అనూహ్యమైన ప్రదేశాల్లో ఇంకా సజీవంగా ఎలా నిలిచి ఉందో, భైరవి, కాళీ, ఛిన్నమస్త వంటి దేవతలతో కలిసి నడవాలి అంటే ఎంత సాధన చేయాలో తెలుసుకోండి... సద్గురు ఎక్స్క్లూజివ్ లో మాత్రమే.. ఇప్పుడే చూడండి.

భారతదేశం ఎంతోమంది స్త్రీ దేవతలకు నిలయం - అద్భుతమైన, జ్ఞానమూర్తులైన ఇంకా ఉగ్రమైన దేవతలు. ప్రపంచంలో స్త్రీ దేవత ఆరాధన, కొన్ని అనూహ్యమైన ప్రదేశాల్లో ఇంకా సజీవంగా ఎలా నిలిచి ఉందో, భైరవి, కాళీ, ఛిన్నమస్త వంటి దేవతలతో కలిసి నడవాలి అంటే ఎంత సాధన చేయాలో తెలుసుకోండి... సద్గురు ఎక్స్క్లూజివ్ లో మాత్రమే.. ఇప్పుడే చూడండి. Watch now.