యోగ సంస్కృతిలో దేవి అంశం కీలక పాత్ర పోషిస్తుంది. దేవి యొక్క వివిధ కోణాలు సంవత్సరంలోని కొన్ని సమయాల్లో, ముఖ్యంగా నవరాత్రుల తొమ్మిది రోజులలో పూజించబడతాయి. నవరాత్రులలో దేవిలోని మూడు ప్రాథమిక అంశాలను జరుపుకున్నప్పటికీ, ఆమెకు ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. దేవి అటువంటి ఒక అభివ్యక్త రూపం మహిషాసుర మర్ధిని - "మహిషాసుర సంహారిణి". సద్గురు ఈ అపూర్వమైన ప్రతీకను, మన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.

సద్గురు: తరతరాలుగా సగం మనిషీ, సగం దున్నపోతుగా చిత్రీకరించబడిన మహిషాసురుడు మనిషిలోని మృగ స్వభావాన్ని సూచిస్తాడు. పరిణామ ప్రక్రియ కారణంగా, ఆ క్రమంలో అభివృద్ధి చెందిన అమీబా, వానపాము, గొల్లభామ, గేదె ఇంకా ప్రతీ మృగం జాతి గుణాల అంశాలు ఇప్పటికీ మీలో ఉన్నాయి. ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే ప్రతిస్పందించే ధోరణులు. ఆధునిక నాడీ శాస్త్రం కూడా మీ మెదడులోని ఒక భాగం సరీసృపాలకి చెందినదిగా గుర్తిస్తుంది. పరిణామ క్రమంలో ఈ సరీసృపపు మెదడు, పశుబుద్ధి అధికంగా ఉండే అభివృద్ధి దశను సూచిస్తుంది.

మానవులు నిటారుగా నడవడం ప్రారంభించి, మానవ వెన్నెముక నిటారుగా మారిన తర్వాత సెరిబ్రల్ కార్టెక్స్ యొక్క పుష్పం సరీసృపాల మెదడును దాటి వికసించింది. మనల్ని మనుషులుగా చేసేది అదే. విశ్వమంతా నిండిన అస్తిత్వం గురించి మిమ్మల్ని అలోచింపజేసి, అన్ని ఒకటే అన్న విషయాన్ని మీరు గుర్తించేలా చేసేదీ ఇదే. అదే మిమ్మల్ని ఒక శాస్త్రవేత్తగానో లేదా ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడిగానో మారేలా చేస్తుంది. కానీ మీరు ఈ సరీసృపపు మెదడుకు తిరిగి వెళితే మీకు ఉండేదల్లా మనుగడకి కావాల్సిన ప్రవృత్తులు మాత్రమే. సరీసృపపు మెదడు నుండి సెరెబిరల్ కొర్తెక్స్ కు ఎదగడానికి చేసే మానవ ప్రయత్నాలే విద్య, ఆధ్యాత్మిక ప్రక్రియ మరియు ధ్యానం. ఇది మీ జీవితంలో అన్నిటినీ కలుపుకుని పోయే తత్వాన్ని ప్రసాదిస్తుంది. మీరు మీ సరీసృపాల మెదడు పరిధి నుండే పని చేస్తే గనుక, మీకు తెలిసేదల్లా సరిహద్దులను గీసుకోవడమే.

స్త్రీతత్వం లోపలికి ప్రవేశించినప్పుడు అది తెరుచుకుంటుంది. అది తెరుచుకున్నప్పుడు పుంసత్వ స్వభావం లేదా పశు స్వభావం ఆమె పాదాల వద్ద దాసోహం అవుతుంది.

మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకు సమస్యలు ఎదురైనప్పుడల్లా ప్రాథమికంగా అది మీకు వారికి మధ్య, లేదా మీది అనుకునే దానికి, వారి దానికి మధ్య ఉన్న సరిహద్దుల గురించే ఉంటుంది. మీరు మీ మెదడులోని ఒక అంశం నుండి మాత్రమే పని చేస్తే మీరు ఒక దానిని పొందవచ్చు. కానీ మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేరు. సరీసృపపు మెదడును ఒక క్రమంలో తెరిచేందుకు యోగ వ్యవస్థలో విధానాలున్నాయి. తద్వారా అది Cerebral Cortex తో అనుసంధానించబడి, క్రమంగా అవి రెండూ ఒకే మెదడుగా పనిచేస్తాయి. కొన్ని ధ్యాన పద్ధతులతో దీనిని సాధించవచ్చని అధ్యయనాలు ఉన్నాయి. అందుకే యోగ సంస్కృతిలో మానవ వ్యవస్థలోని చక్రాలకు ప్రతీకగా తామర పువ్వుల చిత్రీకరణ ఉంది. అతిపెద్ద తామరపువ్వు, తల పైభాగంలో సహస్రారాన్ని సూచిస్తుంది. ఆ పువ్వు తెరుచుకోవాలి.

మస్తిష్క పుష్పం తెరుచుకుంటే మానవ మేధస్సు ఏకీకృతంగా, కలుపుకొని పని చేయడం ప్రారంభిస్తుంది. కలుపుకుని పోవడం అనేది ఒక వేదాంత శాస్త్రం కాదు. కలుపుకోవడం అనేది ఉనికి స్వభావం. మరే ఇతర ప్రాణి కూడా దీనిని గ్రహించలేదు. అవన్నీ సరిహద్దులు గీసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఒక కుక్క ఊరంతా మూత్ర విసర్జన చేస్తోందంటే, అది మూత్ర విసర్జన సమస్యల వల్ల కాదు. తన రాజ్యాన్ని స్థాపించడం కోసం అలా చేస్తుంది. మనుషులు కూడా ఇదే పనిని రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు కూడా తమ హద్దులు గీసేసుకుని వీలైతే వాటిని కొంచెం ముందుకు జరుపుతున్నారు. దేవి మహిషాసురుని సంహరించడం వెనుక ఉన్న ప్రతీక ఏమిటంటే మనిషిలోని మృగాన్ని చంపడం. మీరు పుష్పంలా వికసించాలని దీని అర్థం. మీ సరీసృపపు మెదడును తెరవడమా లేదా దేవి మిమ్మల్ని అణచివేయడమా అనేది మీకున్న ఎంపిక.

ఈ ప్రతీక యొక్క మరొక కోణం ఏమిటంటే పుంసత్వం దాని స్వభావ సిద్ధంగా, ప్రవృత్తిని అనుసరించి జీవిస్తుంది. అంటే సరీసృపాల మెదడు గట్టి పిడికిలిలా ఉంటుంది. లోపలికి స్త్రీతత్వం ప్రవేశించినప్పుడు అది తెరుచుకుంటుంది. అది తెరుచుకున్నప్పుడు పుంసత్వ స్వభావం లేదా పశు స్వభావం ఆమె పాదాల వద్ద దాసోహం అవుతుంది. దేవి మరియు మహిషాసురుల ప్రతీక దానినే చూపిస్తుంది - ఆమె పూర్తి శక్తిగా ఎదిగినందున, మృగత్వం అణచబడింది.