నదుల రక్షణ ఉద్యమం - 21వ రోజు: భోపాల్
ఇండోర్ లో విజయవంతంగా కార్యక్రమం ముగిశాక, భోపాల్ కు పయనం అయ్యింది. సద్గురు, వాలంటీర్లు సాయంత్రం భోపాల్ కార్యక్రమానికి వెళ్లారు. ర్యాలీలో వచ్చిన వారు ముందే ప్రయాణం అయి, పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని దర్శించడానికి వెళ్లారు.
ర్యాలీ మొదటి నుంచీ భోపాల్ పాలుపంచుకుంటూనే ఉంది. నదుల రక్షణ గురించి సద్గురు పిలుపునివ్వగానే గౌ. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. నదులను రక్షించడానికి కార్యక్రమంలోనికి దూకింది మొదట ఆయనే. దాదాపు రెండు నెలల నుంచి ర్యాలీకి సంబంధించిన అవగాహన తీసుకురావడానికి ఉత్సాహవంతులైన ఇక్కడి వాలంటీర్లు రంగంలోకి దూకారు. నిజంగానే మేము భోపాల్ లోకి ప్రవేశించగానే ఎక్కడ చూసినా ర్యాలీకి సంబంధించిన పోస్టర్లు, బానర్లు దర్శనమిచ్చాయి. ఏ వీధిలో ఏ ఎలక్ట్రిక్ పోల్ గానీ, ట్రాపిక్ స్తంభంగానీ పోస్టరు లేకుండా లేదు.
ఐదు వేల మందికి పైగా భోపాల్ లోని 15వ కార్యక్రమానికి వచ్చారు. ఇది 23వ తేదీ ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది. మరో పదహారు వందల మంది పాస్ లు తేకుండానే వచ్చినా ప్రక్కన మరో కార్యక్రమానికై తెచ్చిన కుర్చీలలో కూర్చున్నారు. అనుకున్నదానికన్నా VIP లు కూడా ఎక్కువమందే వచ్చారు. వాలంటీర్లు వారిని అందుబాటులో ఉన్న చోట్ల కూర్చో బెట్టారు.
సాంస్కృతిక కార్యక్రమాలు వీలైనంత తక్కువగా ఏర్పాటు చేసి అందరి దృష్టీ అసలు కార్యక్రమం ‘ర్యాలీ’ మీద ఉండేట్లు ఏర్పాటు చేశారు. కబీరు భజన్లు పాడే అక్కడి ‘ప్రహ్లాద్ తనయ్యా’ ప్రజలను తమ సంగీతంతో అందరినీ ఆకట్టుకున్నారు. నదుల ప్రాముఖ్యత గురంచి ఆయన పాడిన రెండవపాట సద్గురు లేచి లయబద్దంగా చప్పట్లు కొట్టేలా చేసింది. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ గంతులేశారు.
కార్యక్రమం అయిన వెంటనే ప్రముఖులు తమ ఆసనాలు స్వీకరించారు. వేదిక మీద సద్గురుకాక మరొక్కరే ఆసీనులయ్యారు, అది ఈ ర్యాలీలో అతి ముఖ్య భూమిక పోషిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ చౌహాన్ గారే. తమ పిలుపుని స్వీకరించి వెంటనే నర్మదా నది తీరంపై చెట్లు నాటించినందుకు ముఖ్యమంత్రిని సద్గురు అభినందించారు. ఒక్క రోజునే ఆరు కోట్ల మొక్కలను నాటారు. ఈశా వాలంటీర్లతో పాటు అక్కడి జన అభ్యాన్ అనే వాలంటీర్ల బృందం, గ్రామ, గ్రామానికీ వెళ్లి మిస్ కాల్ గురించి ప్రచారంచేసిందని తెలియజేశారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఏడున్నర కోట్లమంది ప్రజానీకం ఈ ఉద్యమానికి మద్దత్తుగా నిలబడుతుందని ముఖ్యమంత్రిగారే బహిరంగంగా ప్రకటించారు.
ఈ ర్యాలీకి సెప్టెంబరు 23వ తేదీ కూడా ఎంతో ప్రముఖమైనది, ఇది సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు. ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన ఆ సంఘటన గురించి సద్గరు వివరించడం అందరినీ ముంచెత్తివేసింది.
కార్యక్రమం చివరలో ఒకామె నదుల రక్షణ ఉద్యమాన్ని స్వాతంత్ర సంగ్రామంతో పోలుస్తూ, నదులకై అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అవసరమా అని అడిగింది. సద్గురు దానికి సమాధానంగా స్వాతంత్ర్య ఉద్యమం బయటివారి మీద, కాని ఈ ఉద్యమంలో శత్రువు మనలోనే ఉన్నాడు అన్నారు. మనం పోరాడవలసింది బయటి శత్రువుతో కాదు, అందువల్లనే మరింత పెద్ద కార్యక్రమం నిర్వహించవలసి ఉంది అన్నారు. అందుకే మొత్తం 130 కోట్ల మందీ ఇందులో పాల్గోనాలి అన్నారు.
చివరకు సద్గురు నదీ స్తుతి పాడడంతో కార్యక్రమం ముగిసింది, ప్రజలు తరలిపోయారు. ఆ తరువాత పత్రికా విలేఖర్లతో సద్గురు సంభాషించారు. ఈ కార్యక్రమం ఎంతో అద్వితీయంగా ముందుకు సాగుతన్నదన్న భావనతో మరొక కార్యక్రమానికి మేమంతా ఉద్యుక్తులమౌతున్నాము.