Sadhguru15,000 సంవత్సరాల క్రిందట హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన సమక్షం చాలా అసాధారణంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో వారంతా నెలల కొద్దీ వేచి చూసారు. అప్పడప్పుడు ఆయన కనుల నుండి వెలువడే ఆనందభాష్పాలు తప్ప, ఆయన జీవించే ఉన్నారు అన్నదానికి వేరే సంకేతాలేమి లేవు.

ఒకరు అలా నెలల తరబడి కేవలం కూర్చుని ఉన్నారంటే అతను ‘భౌతిక’ విషయాలచే ఇక ఏ మాత్రం శాసించబడటం లేదని అర్థం. అదే అద్భుతం కదా! కాని అది వారు గ్రహించలేక పోయారు. అందువల్ల ఒక ఏడుగురు తప్ప, అందరూ వెళ్ళిపోయారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్ధించారు. ఆయన వాళ్ళను పట్టించుకోలేదు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వారి పట్టుదలను చూసిన ఆయన వారికి ఒక చిన్న ప్రక్రియను భోధించారు. ఆ తర్వాత మళ్లీ కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చండి పోయారు.

ఆ ఏడుగురూ దానిని ఎంతో అభ్యాసం చేసారు. రోజులు వారలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. 84 ఏళ్ళ సాధన తరువాత ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు తేజోవంతులుగా, తన దగ్గర ఉన్నదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడాన్ని ఆయన గమనించారు. ఇక ఆయన వారిని పట్టించుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత పౌర్ణమి నాడు ఆయన దక్షిణం వైపుకు తిరిగి ఆ ఏడుగురికీ గురువుగా కూర్చున్నారు. ఆ రోజు 'ఆదిగురువు' ఆవిర్భవించారు, అంటే ఆదియోగి 'ఆదిగురువు'గా మారారు. ఇప్పటికీ ఆ రోజుని మనం 'గురు పూర్ణిమ'గా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కృషితో మనిషి క్రమంగా పరిణామం చెందగలిగే అవకాశాన్ని ఆయన కల్పించారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతన(consciousness)ను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు.

మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు

ఆది యోగి వారికి యోగ శాస్త్రాన్ని బోధించడం ఆరంభించారు, అందులోని ఏడు విధానాలను ఏడుగురికీ బోధించారు. మానవ జీవిత నిర్మణాన్నీ, అది పనిచేసే విధానాన్నీ బోధించారు. మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు. ఆ సప్త ఋషులను మధ్య ఏషియా, దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, హిమాలయ దక్షిణ ప్రాంతాలకు పంపారు. ఒకరు ఆయనతో ఉండి పోయారు, ఆఖరివారు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయనే అగస్త్య మునివర్యులు! ఆయన దక్కను పీఠభూమికి దక్షిణంగా ఉండే ప్రతి జనావాసానికీ ఆధ్యాత్మిక ప్రక్రియను - ఒక బోధన, తత్వం, మతంలా కాకుండా - ఒక జీవన విధానంలా అందించారు. ఈ రోజుకు కూడా మన సంస్కృతిలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది.