ప్రశ్న: మేము తినే ఆహారం మా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని చెప్పారు. మెడికల్ సైన్సు కూడా ఫలాహారం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది అని చెబుతోంది. దీనికేమన్నా ప్రామఖ్యత ఉందా? మామూలు జీవనస్థితిలో ఉండే పనులు, కుటుంబం, ఎంతో శారీరక శ్రమ చేసేవారికి అధిక ఫలాహారం సరిపోతుందా?

సద్గురు: ఒక యంత్రంలో ఏ ఇంధనం వాడినా, ఆ ఇంధనం నాణ్యత - అది ఎంత బాగా మండుతుందన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మనం కార్లలో వాడే పెట్రోలుకీ రేసు కార్లలో, విమానాల్లో వాడే ఇంధనానికి తేడా ఉంటుంది, ఎందుకంటే అది ఎంత తేలిగ్గా మండుతుందన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్రోలు బంకుల్లో ఆక్టేన్ లెవల్సు (Octane levels) వ్రాసి ఉండడం చూసి ఉంటారు - ఎనభై ఏడు, ఎనభై తొమ్మిది, తొంభై, తొంభై ఒకటి, తొంభై మూడు, ఇలా ఉంటుంది. మేము మోటారు సైకిళ్ళు నడిపే రోజుల్లో వంద ఆక్టేన్ ఉన్న పెట్రోలుకు మూడురెట్లు డబ్బు ఇచ్చి కొనేవారం ఎందువల్లనంటే దానితో మా మోటారు సైకిళ్ళు మిగతా మోటారు సైకిళ్ల కన్నా ఎంతో బాగా పనిచేసేవి.

పండ్ల ఆహారం తేలిగ్గా జీర్ణమౌతుంది

అదే విధంగా అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పండ్లు. జీర్ణమవ్వడం అంటే - జఠరాగ్ని బాగా ఉండడం. ఈ మంటలు బాగా మండాడానికి పండ్లు సహకరిస్తాయి. దురదృష్టవశాత్తూ చాలా మంది బద్దకాన్ని ఆస్వాదిస్తారు. జీవితం వారిని తాకలేదు గనకే వారు తమలో కొంత భాగం నిస్సత్తువగా ఉంచడాన్ని ఆస్వాదిస్తారు. వారికి ఉత్సాహంగా ఉండడం, చైతన్యవంతంగా జీవించడం కన్నా నిద్ర, మత్తులో ఉండడం, ఊరకే పడుకుని ఉండడం లాంటివి బాగుంటుంది. మరి పండ్లు వారికి నచ్చవేమో ఎందుకంటే అవి వారిని ఉత్సాహంగా, మెలకువగా ఉంచుతాయి. అవి పులిస్తే తప్ప మిమ్మల్ని మత్తుగా ఉంచవు. కాని ఎరుక అత్యన్నత స్థాయిలో ఉన్నప్పుడు పరమానందం, మత్తు, ఘాటైన సుఖాలను మనం అనుభవించవచ్చు. ప్రస్తుతం మీ ప్రశ్న ఏమిటంటే, నేను పండ్లుతిని కూడా మామూలుగా ఉండవచ్చా అని.

ప్రకృతి సలహా కూడా ఫలాహారమే

ఒకవేళ మీరు హాస్పటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వచ్చేవారెవరూ మీకు చికెన్ బిర్యానీ తీసుకురారు. వాళ్ళు పళ్ళు తీసుకొస్తారు “ఎందుకంటే పనికిరానివి తిన్నందుకే మీకు ఆరోగ్యం చెడింది, ఇప్పుడైనా సజావుగా ఆహారం తీసుకో”మని. ప్రకృతి కూడా ఆహారంగా పండ్లనే అందించింది. మామిడి పండ్లలో టెంకే మఖ్యం కాని జంతువులనూ, పక్షులనూ ఆకర్షించి తమ విత్తనాలను దూరంగా తీసుకువెళ్లటానికి గుజ్జు ఒక ఆకర్షణ. ఋతువులను బట్టి ఎన్నోరకాల పళ్ళు లభిస్తాయి. ఆయా సమయాల్లో, ఆ ప్రాంతాల్లో లభించే పళ్ళు శరీరానికి ఎంతో మేలైనవి. దీనిగురించి చాలా పరిశోధనలు జరిగాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేక ఎండగా ఉన్నప్పుడు, తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాతావరణానికి అనుకూలమైన పళ్ళు మీరు తినడానికి అక్కడ భూమి ఉత్పత్తి చేస్తుంది. కాని మీరిప్పుడు ఎక్కడో న్యూజిలాండు నుంచి వచ్చే పళ్లు తింటున్నారు. మీరు మీ చుట్టూ పండే పండ్లు తినాలనుంటే, సరైన సమయానికి సరైన రకం పళ్ళు రావడం మీరు గమనిస్తారు. వాటిని ఆయా సమయాల్లో తినడం ఉత్తమం.

ఫలాహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పళ్ళు మీ శరీరానికి అద్భుతమైనవి. మీ జీవనరీతి ఏదైనా మీరు ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చు. కాని మీ జీవితం శారీరకంగా శ్రమతో కూడుకున్నదైతే ఉదాహరణకు మీరు ఏదో తవ్వకాలు లాంటి కఠినమైనపని చేస్తున్నట్టయితే అప్పుడు మీకు ప్రతి రెండు గంటలకూ ఆకలి వేయవచ్చు. మీరు తినేదానికి పరిమితి ఉంటుంది, మీరు ఇన్ని పళ్ళే తినగలరు, కాని అవి త్వరగా అరిగిపోతాయి, అందువల్ల మీ కడుపు త్వరగా ఖాళీ అయిపోతుంది. మీరు ఫలాహారానికి బద్ధులైతే మీరు భోజనానికి ఎక్కువ సమయం వెచ్చించాలి, ఎందుకంటే కావలసినన్ని పళ్ళు తినడానికి మీకు మరి కాస్త ఎక్కువ సమయం కావాలి. అవి తియ్యగా ఉండడం వల్ల మీరు త్వరగా తృప్తి చెందుతారు, అందువల్ల మీరు మెల్లగా తినాలి. మనలో ఒక బయో క్లాక్ ఉంటుంది. ఉదాహరణకు మనం మామూలు భోజనం చేయడానికి పది పన్నెండు నిముషాలు తీసుకుంటామనుకుంటే, ఫలాహారంతో కూడా పది పన్నెండు నిముషాలు తరువాత మీ శరీరం ఇకచాలు లే లే అంటుంది. అందుకే మీరు స్పృహతో ఎక్కువ తినాలి. ఎందువల్లనంటే శరీరం కడుపు నిండిందా అని కాకుండా, టైం అవ్వడం వలన మిమ్మల్ని తినడం చాలించమంటుంది.

మీరు మీ మానసిక శక్తిని ఉపయోగించే వారైనా, శారీరక శ్రమ చేసేవారైనా, పండ్లు మంచిదే.
మీ పని శారీరిక శ్రమతో కూడుకున్నదైతే మీరు మూడు సార్లు భోజనం చేయాలి. మీరు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయినా మీరు తినేది ఫలాహారమైనా మూడుసార్లు చాలు. కాని రెండు గంటల్లో కడుపు ఖాళీ అవుతుంది, మీరు ఖాళీ కడుపుతో, సత్తువగా ఉండడానికి అలవాటు పడాలి. అటువంటి సమయంలోనే మీ బుర్ర అత్యుత్తమంగా పనిచేస్తుంది, మనిషి అత్యుత్తమంగా పనిచేస్తాడు. మీరు మీ మానసిక శక్తిని ఉపయోగించే వారైనా, శారీరక శ్రమ చేసేవారైనా, పండ్లు మంచిదే. కాని ఈనాడు మార్కెట్ లో లభించే పళ్ళనిండా ఏమున్నదో తెలియదు. అది సమస్యే. మా చిన్నప్పుడు తిన్న దేశవాళీ పళ్ళరకాలు ఇప్పుడు లభించటం లేదు, పళ్ళతోటల్లో పండించే పళ్ళు ఆ రకంగా ఉండవు. అవి మరింత పెద్దవిగా, గుండ్రంగా, చూడ్డానికి అందంగా ఉంటాయి, అంతే. వాటిలో ఆ రుచి, బలం ఉండవు అది నేను గమనించాను. ఈ పళ్ళు మార్కెట్ కోసం పండించినవి, మనిషి కోసం కాదు. అవి పూర్తిగా వ్యర్ధం అనట్లేదు కాని వాటిలో అంత బలం ఉండదు, అందువల్ల మనం మరో ఆహారంతో మన ఆహారాన్ని పుష్ఠి చేసుకోవాలి.

ఫలాహారం మన భూమికి కూడా మంచిది

అన్నింటికీ మించి పర్యావరణ పరంగా అది చాలా మంచిది. అందరూ తమ భోజనంలో30 శాతం అయినా ఫలాహారం తీసుకోవాలి, అంటే మీ ఆహారంలో 30 శాతం పళ్ళు ఉండాలి. 30 శాతం ఆహారం దున్నిన భూమి నుంచి కాక చెట్లనుంచి వస్తే, పర్యావరణ పరంగా అది ఎంతో మేలైంది. అది ప్రపంచానికి ఎంతో మేలుచేస్తుంది. మీరు మాంసాహారం లాంటి వాటినుంచి ఫలాహారానికి మారితే మీకు తిన్నట్లే అనిపించదు. పైకి ఎగరే పక్షి కూడా భూమిమీద పుట్టిందే, కాని అంత ఎత్తుగా ఎగరడం వల్ల అది ఈ భూమికి సంబంధించిందే అని అనిపించదు. అందువల్ల మీరు చురుగ్గా ఎగరాలంటే మీరు తీసుకునే ఇంధనం త్వరగా మండేదై ఉండాలి. అదే ఉత్తమమైన ఆహారం. మన పొట్టలో పండు త్వరగా కరిగిపోతుంది. అంటే దాని మూలంగా అతి తక్కువ వ్యర్ధం వస్తుంది, శరీరం అతి తక్కువ ఒత్తిడికి లోనవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay