సద్గురు: మీపై మీకున్న తప్పుడు ఆలోచన ఈ కధ ఆరంభానికి కారణం. మానవుడికి జీవితం గురించి, అందులోని బాధలు, ఎగుడు దిగుడులు గురించి ఉన్న దురభిప్రాయాలకు ప్రతీక మహాభారతం. మానవుడు జీవితంతో సమతాళంతో లేనంతవరకూ ఇదిలా సాగుతూనే పోతుంది. జీవితంతో సమతాళంలో ఉన్న వారెవరైనా చెప్పదలిస్తే, మిగతావారందరూ అపార్ధం చేసుకుంటారు. వెలుగుని లిఖిత పూర్వకంగా తెలియ చెప్పలేము, కానీ మీరు కళ్ళు తెరిస్తే వెలుగుని చూడవచ్చు. అదేవిధంగా మీరైన ఈ జీవం తెరుచుకుంటే, అది జీవితాన్ని అనుభవిస్తుంది, అదే జీవితం అవుతుంది.

జీవితం చెప్పనలవి కాదు. చెప్పడం కేవలం స్ఫూర్తి కోసమే, మీరు కల్పించుకున్న మైకం నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి మాత్రమే. ప్రతి మనిషీ తన పరిమితులతో తనను తానే సమ్మోహితుడిని చేసుకుని అదే నిజమని నమ్ముతున్నాడు. మీరు ఆ సమ్మోహనాన్ని తీసివేస్తే అతను భయానికి గురవుతాడు, ఎందువల్లనంటే ఉనికి పరిమితులు లేనిది. కాబట్టి అతను ఒక వైపుకి తిరుగుతూ ఉంటే మీరు అతనిని కొద్ది కాలం మరొక వైపుకి తిప్పుతూ ఉండాలి, అప్పుడే అతను ఎక్కడికో వెళ్తున్నట్టు భావిస్తాడు.

కధలో జీవించడమంటే ఏమిటో మీకు అనుభవంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను

మొత్తం మహాభారతం జరిగినది కేవలం ఈ ప్రయత్నంలోనే. ఎవరు ఏమి చేస్తున్నా ప్రతి ఒక్కరూ మంచికే చేస్తున్నామని అనుకుంటారు. అది - నా మంచికి, నీ మంచికి, ఇంకెవరో మంచికి, లేక ప్రతి ఒక్కరి మంచికి - ఎటువంటి మంచి దైనా ప్రతి ఒక్కరూ మంచికే చేస్తున్నామని తలంచుతారు. కానీ ఎవ్వరూ మంచీ కాదు చెడూ కాదు,  తప్పూ కాదు ఒప్పూ కాదు - కధ జరుగుతూ ఉంటుంది.

కధలో జీవించడమంటే ఏమిటో మీకు అనుభవంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కధను పుస్తక రూపంలో అందివ్వక ఎనిమిది రోజులలో ఎందుకు చూపుతున్నాము? ఈ కధకు ఎన్నో పాఠాంతరాలున్నాయి, మీలో ఉన్న పండితులు మూడు వేరు వేరు పాఠాంతరాలు చదివి సంసిద్ధులై వచ్చారని తెలుసు. కానీ, మీరు కధ చదవాలని కాదు, జీవించాలని మా కోరిక.

ఈ కధ ఒక్క వ్యక్తిని గూర్చి కాదు - ఇది ఇతిహాసంగా వర్గీకరించబడింది. భారత దేశంలో మూడురకాల మూల గ్రంధాలు కలవు. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు. వేదాలు శుద్ధ ఆలోచనలు, శాస్త్రీయ సిద్ధాంతాలను, మరియూ ఖగోళ సంబంధమైన  సంఘటనలను వివరించారు. పురాణాలు మానవేతరుల కధలు. ఇతిహాసాలు మానవుల కధలు, చారిత్రిక అంశం ఉన్నా ఒట్టి చరిత్ర కాదు. ఇందులోని వాస్తవాలు చరిత్రలో నాటుకొని ఉన్నా ఇది మానవుని కధ -జీవితం యొక్క అర్ధం శోధించి వివరించే కధ. మీ కధగా మారినప్పుడే మీ ఉన్నతికి కారణమై ఆ ప్రక్రియగా మారుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు