తన హృదయంలోనే శివాలయాన్ని నిర్మించిన భక్తుడు పూసలార్
భక్తితో తన హృదయంలోనే శివాలయాన్ని నిర్మించిన గొప్ప శివ భక్తుడు పూసలార్. ఈ అరుదైన ఇంకా అద్భుతమైన కథని సద్గురు మనకు వివరిస్తున్నారు.
పూసలార్ ఒక మార్మికుడు, గొప్ప భక్తుడు… కానీ చాలా పేదవాడు. భోజనానికి భిక్షాటన చేస్తాడు. ఇలాంటివారు, ఇష్టపూర్వకంగా పేదరికంలో ఉంటారు. ఆ రాజ్యాధిపతి, ఒక గొప్ప మహారాజు. ఎన్నో వేల మంది పనివాళ్లను పెట్టి, ఎంతో ద్రవ్యం ఉపయోగించి, ఎంతో శ్రమించి, ఈ రాజు ఒక పెద్ద శివాలయం నిర్మించాడు. ఆలయ ప్రారంభోత్సవానికీ, ప్రాణప్రతిష్ఠకూ ఒక తేదీని నిర్ణయించాడు. ఆ ముందురోజు; అతను నిద్రపోతున్నప్పుడు, అతని కలలో శివుడు కనిపించి - “నేను నీ ఆలయ ప్రారంభోత్సవానికి రాలేను. ఎందుకంటే, నేను పూసలార్ కట్టిన ఆలయానికి వెళ్ళాలి” - అన్నాడు. ఆ రాజు ఉలిక్కిపడి లేచాడు. శివుడు వచ్చి, తన ఆలయానికి రాలేను అని చెప్పడాన్ని.. నమ్మలేకపోయాడు. ఎందుకంటే; అతను ఎంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. శివుడు “అతని ఆలయంకంటే ఉత్తమమైన పూసలార్ ఆలయానికి వెళ్తున్నాను” - అని చెప్పాడు.
అందుకని ఆ రాజు వెళ్ళి, దానిని చూడాలని అనుకున్నాడు. ఈయన పూసలార్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఊరి బయట ఒక చిన్న గుడిసెలో పూసలార్ కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. ఆ రాజు అక్కడికి వచ్చి పూసలార్ ని, “నీ ఆలయం ఎక్కడ ఉంది..? శివుడే ప్రత్యక్షమై నీ ఆలయం, నా ఆలయం కంటే గొప్పది అని చెప్పాడు. నీ ఆలయానికి వస్తున్నాను, నా ఆలయానికి కాదు అని చెప్పాడు. శివుడు అక్కడికే వచ్చేటట్లైతే నేను కూడా అక్కడికి రాదలచుకున్నాను. నీ ఆలయం ఎక్కడ ఉంది..?” - అని అడిగాడు. పూసలార్ కొంత సంకోచించి, “నా ఆలయమా..?? అది రాతితో ఇటుకలతో కట్టినది కాదు. నేను ఈ ఆలయాన్ని నా హృదయంలో కడుతున్నాను. అవును శివుడు నా ఆలయానికి రేపు వస్తానని చెప్పాడు. కానీ ఈ విషయం నీకు ఎలా తెలిసింది..?” - అన్నాడు. ఈ ఘటన దేనిగురించి అంటే, మీరు మీ మనసులో ఒక రూపాన్ని నిర్మించి, దానిని మీ శక్తితో శక్తివంతం చేస్తే.. లేదా ఇంకా ఉత్తమమైన విధానం ఏమిటంటే.. మీ చైతన్యంతో శక్తివంతం చేయగలిగితే.. అవి రాతి ఆలయాలకంటే ఎంతో నిజమైనవిగా మారతాయి. మీ చుట్టూరా భౌతికతలో, మీరు రాయి ఇటుకలతో కట్టుకుంటున్న ఆలయాల కంటే ఎంతో నిజమైనవి.