భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా  'గురు-శిష్య పరంపర' వర్దిల్లుతూ వచ్చింది. ఈ దేశ సంస్కృతిలో, ఎప్పుడైనా గురువు తన శిష్యులకు అతి నిగూఢమైన, శక్తివంతమైన జ్ఞానాన్ని అందించదలుచుకుంటే, అది వారివురి మద్య అంకితభావం, అచెంచలమైన నమ్మకం, సాన్నిహిత్యం ఉన్నప్పుడే అందిస్తారు. 'పరంపర' అనేది ఎడతెగని సంప్రదాయం. ఇంకో విధంగా చెప్పాలంటే,  ‘తరతరాలుగా జ్ఞానాన్ని ప్రసరింపజేసే’ సంప్రదాయంగా చెప్పవచ్చు.

ఎప్పుడైతే ఇది పండితుల చేతుల్లో పడుతుందో, అప్పుడు వాటిలోని 'సత్యం' పని ముగిసిపోయినట్లే.

ఒక్క 'భారతదేశం' లోనే ఇటువంటి సంప్రదాయం ఉన్నది. ఏదైనా సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి, ఆ సత్యాన్ని తెలుసుకోవడాన్ని తన జీవితం కంటే మిన్నగా భావించి, దానిపట్ల నిజమైన అంకితభావం ఉన్న వ్యక్తికే ఆ సత్యాన్ని తెలియపరుస్తాడు. అది తెలుసుకున్న వ్యక్తి మళ్ళీ తనలాంటి తృష్ణ ఉన్న వ్యక్తికే ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. వేలాది సంవత్సరాలుగా ఎడతెగకుండా ఈ 'పరంపర' కొనసాగుతూ ఉంది. జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక సత్యాలను ఎక్కడా వ్రాసేవారు కాదు. ఎందుకంటే అన్ని రకాల ప్రజలూ వాటిని చదివి తమకు తోచిన విధంగా అన్వయించుకుని ఆపార్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థాయి అనుభవం ఉన్న వ్యక్తులే దాన్ని తెలుసుకోవాలి, ఇతరులు తెలుసుకోకూడదు. ఓ సందర్భంలో గురు-శిష్య పరంపర చెదిరి పోతున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక సత్యాలను గ్రంధస్థం చేయడం ఆరంభించారు. ఒకసారి మీరు దేనినై గ్రంధస్థం చేస్తే, ఈ గ్రంధాలను మొదట చదివేవారు పండితులే. ఎప్పుడైతే ఇది పండితుల చేతుల్లో పడుతుందో, అప్పుడు వాటిలోని 'సత్యం' పని ముగిసిపోయినట్లే.

మీ అనుభూతిలో లేనిదాన్ని మీకు మేధాపరంగా బోధించలేము. మిమ్మల్ని వేరేస్థాయి అనుభూతిలోకి తీసుకువెళ్ళి మాత్రమే అది మీకు బోధించగలం. ఒక వ్యక్తి అనుభవాన్ని ఒక దశ నుండి వేరొక దశకు తీసుకు పోవాలంటే అతని కంటే తీవ్రం, శక్తివంతం అయిన స్థాయిలో ఉన్న పరికరం లేక సాధనం అవసరం అవుతుంది. ఆ సాధనం లేదా  పరికరాన్నే 'గురువు' అని  పిలుస్తున్నాం.

సాధకుడికి తన ఆధ్యాత్మిక మార్గంలో ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, దానిని అధిగమించడానికి అతనిని శక్తిస్థాయిలో కొంచెం ముందుకు నెట్టవలిసిన అవసరం ఉంటుంది.

గురువు అంటే బోధకుడు కాదు. గురు-శిష్యుల మధ్య  అనుబంధం శక్తి పరంగా ఉంటుంది. వేరే ఎవరూ స్పృశించని కోణంలో అతను మిమ్మల్ని స్పృశిస్తాడు.  మీ జీవితంలో మీ భార్య, భర్త, పిల్లలు ఎవరూ స్పృశించని చోటు ఒకటి ఉంది. వారందరూ మీ భావోద్వేగాల్ని, మనసున్ని, శరీరాన్ని మాత్రమే స్పృశించగలరు. మీరు మీ చైతన్యపు పరమోన్నత స్థాయిని చేరాలంటే, మీకు ఎంతో శక్తి అవసరమౌతుంది. మీకు ఉన్న శక్తే గాక ఇంకా చాలా శక్తి అవసరమౌతుంది. సాధకుడికి తన ఆధ్యాత్మిక మార్గంలో ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, దానిని అధిగమించడానికి అతనిని శక్తిస్థాయిలో కొంచెం ముందుకు నెట్టవలిసిన అవసరం ఉంటుంది. అలా ముందుకు నెట్టేవారు లేకపోతే అతను లక్ష్యం చేరుకోలేడు. దీనివల్లే గురుశిష్య సంబంధం అతిముఖ్యమైనదిగా, పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఎవరైతే శక్తి పరంగా మీకంటే ఉన్నత స్థాయిలో ఉంటారో, వారే అలా మిమ్మల్ని ముందుకు నెట్టగలరు. వేరెవ్వరికీ అది సాధ్యం కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు