సంప్రదాయంగా ఈ దేశంలో మీరు వెళ్లి కరిగిపోయే ఒక ప్రదేశంగా దేవాలయాన్ని పరిగణించేవారు. ఆ తరువాత జనాలు ఎప్పుడైతే తమ తక్షణ శ్రేయస్సు మీద ధ్యాస పెట్టారో అప్పుడే ఇతర దేవాలయాలు పుట్టుకువచ్చాయి.

చాలా వరకు పురాతన దేవాలయాలు శివుడి కోసం, అంటే ‘ఏది లేదో’ దాని కోసం కట్టినవే. ఈ దేశంలో వేల కొద్ది శివాలయాలు ఉన్నాయి. అందులో చాలా వరకు ఒక విగ్రహం అంటూ లేదు; సాధారణంగా ఒక సూచికగా ఒక లింగ రూపం ఉండేది.

 ఒక దేవాలయం ఈ భౌతికత అనే వస్త్రంలోని రంధ్రం లాంటిది. దీని నుంచి తేలికగా జారి మీరు ఆవలికి వెళ్ళవచ్చు. .

‘లింగ’ అనే పదానికి ‘ఒక రూపం’ అని అర్ధం. అవ్యక్తమైనది వ్యక్తమవ్వటం మొదలు పెట్టగానే లేక వేరే విధంగా చెప్పాలంటే సృష్టి మొదలైన తరువాత, అది తీసుకున్న మొదటి రూపం ఒక దీర్ఘవృత్తభాకారం, దీన్నే మనం లింగాకారం అని అంటాము. అది ఎప్పుడూ లింగంగానే మొదలయ్యి, ఆ తరువాత ఇతర రూపాలుగా మారుతుంది. మీరు లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్తే, మీరు పూర్తిగా కరిగిపోయే సమయానికి ముందు మరొక్క సారి మీ శక్తి లింగాకారం తీసుకుంటుంది. ఆధునిక విశ్వశాస్త్రజ్ఞులు (cosmologists) ప్రతీ పాలపుంతలోని అంతర్భాగం ఎప్పుడూ దీర్ఘవృత్తంలో, త్రీ-డైమెన్షన్స్ గల దీర్ఘవృత్తంగా గుర్తించారు. మీలో మీరు చూసుకుంటే మీ అంతర్భాగం కూడా లింగమే. సాధారణంగా యోగాలో లింగాన్ని పరిపూర్ణ రూపంగా, అస్థిత్వానికి ప్రాధమిక రూపంగా పరిగణిస్తారు.

ఆద్యంత రూపం లింగమే. ఈ మధ్యలో జరిగేదే సృష్టి ; దానిని మించినది శివ. కనుక లింగాకారం ఈ భౌతికత అనే వస్త్రంలో ఒక రంధ్రం లాంటిది. భౌతిక సృష్టికి ముఖద్వారం లింగమే, దొడ్డిదారి లింగమే. అందువల్లనే ఒక దేవాలయం ఈ భౌతికత అనే వస్త్రంలోని రంధ్రం లాంటిది. దీని నుంచి తేలికగా జారి మీరు ఆవలికి వెళ్ళవచ్చు.

లింగాన్ని చేసే శాస్త్రం అత్యంత ఆధునాతమైనది. లింగాన్ని సరైన పదార్ధంతో తాయారు చేసి, శక్తివంతం చేస్తే అది శాశ్వత శక్తి రూపంగా మారుతుంది. భారతదేశంలో లింగాలను ఎందరో యోగులు, సిద్ధులు వివిధ అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన లక్షణాలతో సృష్టించారు.

 ధ్యానలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఏడు చక్రాలు వాటి గరిష్ట స్థితికి శక్తివంతం చేయబడ్డాయి  .

చాలా వరకు ఆలయాలకు రాజులు నిధులను ఇచ్చేవారు కనుక లింగాలు చాలా వరకు మణిపూరక స్వభావంతో ఉన్నాయి. కానీ ఆ జీవిత అంశాన్ని దాటి చూసిన రాజులు అనహత లింగాలను లేక ఆత్మలింగాలను ప్రేమ, భక్తి, ముక్తి కోసం కోరుకున్నారు. అనహత అనేది ఒక సుతిమెత్తని, మలచగలిగేటటువంటి స్థితి. ఇది చాలా మందికి అందుబాటులో ఉంది. మూలాధార ప్రాధమిక రూపంగా ఉన్న లింగాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రాధమికమైనవి,స్థూలమైనవి మరియు శక్తివంతమైనవి. వీటిని క్షుద్ర అవసరాలకు ఉపయోగించేవాళ్ళు. ధ్యానలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఏడు చక్రాలు వాటి గరిష్ట స్థితికి శక్తివంతం చేయబడ్డాయి. ఈ ఏడు చక్రాలకు ఏడు వేర్వేరు లింగాలను చేయటం ఎంతో తేలికగా ఉండేది, కానీ దాని ప్రభావం ఒకేలా ఉండదు. ధ్యానలింగం ఒక అత్యున్నతంగా పరిణామం చెందిన జీవి(సంప్రదాయంగా శివ అని పిలుస్తారు) యొక్క శక్తి శరీరంలాంటిది. ఇది అత్యున్నత స్థాయి వ్యక్తీకరణ. మీరు శక్తిని అత్యంత తీవ్ర స్థాయికి పెంచితే అది ఒక స్థాయి వరకే రూపాన్ని నిగ్రహించుకోగలదు. దానిని మించిన తరువాత ఒక రూపం ఉండదు, దాని వల్ల జనాలు దాన్ని అనుభూతి చెందలేరు. శక్తిని రూపంలో నిలువలేని అత్యున్నత స్థితికి తీసుకువచ్చి దానితో ధ్యానలింగం యొక్క ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది. ఒక సాధకుడు సజీవ గురువు సమక్షంలో కూర్చునట్లు ఉండటానికి సృష్టించింది. ఇది ఒక అరుదైన అవకాశం.

ధ్యానలింగానికి మూడున్నర సంవత్సరాలు అత్యంత తీవ్రమైన ప్రాణప్రతిష్ట ప్రక్రియ చేయవలిసి వచ్చింది. ఎందరో యోగులు, సిద్ధులు ఇటువంటి రూపాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేసారు,స కానీ అనేక కారణాల వల్ల దానికి అవసరమైనవన్నీ ఎప్పుడూ సమకూరలేదు. దీన్ని పరిపూర్ణం చేయటానికి మూడు జన్మల కాలం కావలిసి వచ్చింది. నా గురువు కృపతో, ఇతరుల సహకారంతో నేడు మూడు జన్మల ప్రయాణం తరువాత ధ్యానలింగం సంపూర్ణమై, కీర్తితో భాసిల్లుతుంది.

జీవితాన్ని తెలుసుకోవటానికి, దాన్ని లోతుగా, సంపూర్ణంగా అర్ధం చేసుకోవటానికి ధ్యానలింగం ఒక అవకాశం. దాని పరిధిలోకి వచ్చినవారు ఛాయాదేహం లేక విజ్ఞానమయ కోశం స్థాయిలో ప్రభావితం చెందుతారు. మీరు భౌతిక, మానసిక లేక శక్తి శరీరంలో కొంత రూపంతరాన్ని, అంటే పరిణామాన్ని తీసుకురాగలిగితే దీన్ని మీరు జీవిత పురోగమనంలో పోగొట్టుకుంటారు. కానీ మిమల్ని ఛాయాశరీర స్థాయిలో తాకితే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వాళ్ళు కొన్ని జన్మలు గడిచిన తరువాత కూడా ఈ ముక్తి బీజం సరైన అవకాశం కోసం ఎదురు చూసి మొలకెత్తి, వికసిస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు