అనాది నుంచీ తీర్థయాత్రలు ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. ఎన్నో కష్టాలనీ, అసౌకర్యాలనీ ఓర్చుకొని భక్తులు తీర్థయాత్రలకి  వెళతారు. ఈ వ్యాసంలో సద్గురు తీర్థయాత్రల ప్రాముఖ్యతనీ, ఉద్దేశాన్నీ విశదీకరిస్తున్నారు.


యాత్ర, ప్రయాణం, తీర్థయాత్ర - వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? అనేకరకాల కారణాలతో మనుషులు ఒకచోట నుండీ మరోచోటకి వెళుతుంటారు. కొందరు అన్వేషకులుంటారు, వారు ఇంతవరకూ ఎవరూ కాలుమోపని ప్రాంతంపై తాము మొదటగా అడుగు వేయాలనుకుంటారు. వారు ఏదో నిరూపించాలనుకుంటారు. ఇక పర్యాటకులు ఉంటారు. వారు ప్రతీదాన్ని చూడాలన్న కుతూహలంతో ఉంటారు, అందుకోసమే వాళ్ళు ప్రయాణిస్తుంటారు. కొంతమంది యాత్రికులు కేవలం సేదతీరడం కోసం వెళుతారు.

ఇంకొంతమంది యాత్రికులుతమ పని నుండీ లేదా కుటుంబం నుండీ తప్పించుకోడానికి వెళతారు. కానీ తీర్థయాత్రకు వెళ్ళే మనిషి వీటిలోని ఏ ఉద్దేశంతో వెళ్ళడు. తీర్థయాత్ర ఒక జైత్రయాత్ర కాదు. అదొక సమర్పణ. మీ ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంకిగా ఉన్న మిమ్మల్ని మీరే తొలగించుకునే మార్గమది. మీకై మీరు పక్కకు తొలగలేకపోతే, మిమ్మల్ని మీరు కరిగించుకునే మార్గమది. అన్ని పరిమితులనూ, నిర్భంధతలనూ తొలిగించేసి, హద్దులు లేని చేతనా స్థితికి చేర్చగలిగే ప్రక్రియ అది

‘నేను’ అనే భావన తగ్గించుకోవడం

‘నేను’ అనే భావనని తగ్గించడమే తీర్థయాత్ర యొక్క మౌలిక ఉద్దేశ్యం. నడుస్తూ, అధిరోహిస్తూ, ప్రకృతి యొక్క కఠినమైన ప్రక్రియలకు మిమ్మల్ని మీరు గురిచేసుకుంటూ శూన్యంగా మారే ప్రక్రియే తీర్థయాత్ర. పూర్వం  అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఎన్నో భౌతిక, మానసిక, ఇంకా అనేక ఇతర కష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చేది. ‘నేను’ అనే భావన తగ్గాలనేదే వీటి వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ రోజుల్లో ఈ యాత్రలు చాలా సౌకర్యవంతంగా మారాయి. మనం విమానాల్లో, కార్లలో వెళుతున్నాం.చాలా తక్కువగా నడుస్తున్నాం.

భౌతికంగా, వేయి సంవత్సరాల క్రితం ఉన్నవారి కంటే మనం ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాం, ఎందుకంటే ఉన్న సౌకర్యాలను మన సంక్షేమం కోసం ఎలా ఉపయోగించుకోవాలన్నది మనకు తెలవడం లేదు. మనల్ని బలహీనపరుచుకోవడానికి, అలాగే మనం మనతోనూ, మనం నివసిస్తున్నపరిసరాలతోనూ ఉండడాన్ని కష్టతరం చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి తీర్థయాత్ర అనే ఈ మౌలిక భావన పూరాతన సమాజాలకంటే ఆధునిక సమాజాలకి చాలా అవసరం.

మనకంటే ఉన్నతమైన దాన్ని అనుభూతి చెంది, మన ఇంద్రియాలకు అందని ప్రమాణాలను చేరుకోవాలంటే, మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘నేను’ అనే భావన తగ్గిపోవాలి.

కరిగిపోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది మామూలు పరిస్థితులలో దానికి సుముఖంగా ఉండడంలేదు కాబట్టి, మనం వారిని శ్రమింప చేయాలి. సౌకర్యంగా ఉన్నప్పుడు చాలా మంది ఎదగలేరు. ఇది చాలా దురదృష్టకర విషయం. సౌకర్యంగా ఉన్నప్పుడే ఎదగగలగడం చాలా అద్భుతమైన విషయం, కానీ దురదృష్టవశాత్తూ, చాలా మంది మనుషులు సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతారు. కష్టం ఉన్నప్పుడే వాళ్ళు జీవితాన్ని కొంతైనా లోతుగా చూస్తారు. కానీ పరిసత్థి ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. మనల్ని ఇంకేదో అలిసిపోయి, వంగిపోయేలా చేయాల్సిన అవసరం లేదు. మనకంటే ఉన్నతమైన దాన్ని అనుభూతి చెంది, మన ఇంద్రియాలకు అందని ప్రమాణాలను చేరుకోవాలంటే, మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘నేను’ అనే భావన తగ్గిపోవాలి.

మీ జీవితాన్నే తీర్థయాత్రగా మలచుకోండి!

మీకు కనుక ఓ పనిచేసే బుర్ర ఉంటే, మీరు మీ జీవితాన్ని ఓ తీర్థయాత్రలా మలచుకుంటారు. మీ జీవితం మీరిప్పుడు ఉన్నదానికంటే ఉన్నతమైనదాన్ని అందుకునే ఒక నిరంతర ప్రక్రియ కాకపొతే, అసలది జీవితమేనా? నిరంతరం ఉన్నతమైనదాని కోసం ఆశించకపొతే, జీవితం అసలు జీవితమే కాదు. మీరు ఉన్నతనమైనదాన్ని ఆశిస్తూ, దానికై కృషిచేస్తూ ఉంటే, అప్పుడు మీ జీవితమే ఒక తీర్థయాత్ర అవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు