తల్లి, తండ్రి, గురువు, దైవం అని మన సంస్కృతి ఎందుకంటుంది. ఒక్కొక్కరు దీని అర్ధాన్ని ఒక్కో విధంగా చెబుతుంటారు. అసలు నిజంగా ఈ వాక్యంలోని దీని అంతరార్ధం ఏమిటి అన్న ప్రశ్నకి సద్గురు సమాధానం ఇస్తున్నారు.

ప్రశ్న: మన సంస్కృతిలో మనకి “మాతా, పితా, గురు, దైవం” అని చెబుతుంది. నిజంగా దీని అర్ధం ఏమిటో తెలియజేస్తారా?

సద్గురు: “మాతా, పితా, గురు, దైవం” అని అన్నప్పుడు, “తల్లి, తండ్రి, గురువు, దైవం” అని అర్ధం. ఈ మాటని సరైన విధానంలో తెలుసుకోవడం ముఖ్యం. మీరు పసిబిడ్డగా ఉన్నప్పుడు మీ జీవితంలో అత్యంత ప్రధానం కలిగిన వ్యక్తి ఎవరు? దేవుడైతే కాదు, గురువు కూడా కాదు, తండ్రీ కాదు. ఆ సమయంలో తల్లి ముఖ్యం. మీకు పాలు ఇవ్వడానికి, దగ్గరకు తీసుకొవడానికి, ముద్దాడడానికి ఇంకా పోషణ అందించడానికి కావలసింది అమ్మ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పుట్టిన పసికందుకి అందరికన్నా కన్నతల్లి ఎంతో అవసరమని జీవితమే గుర్తుచేస్తుంది.

ఎప్పుడైతే పిల్లవాడు నడక మొదలుపెడతాడో, తండ్రి ముఖ్యం అవుతాడు. ఎందుకంటే, లౌకిక విషయాలు ఆయనకి బాగా తెలుసు కాబట్టి. దీన్ని ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి చూడకండి. ఆరోజుల్లో పిల్లవాడు ప్రపంచం గురించి, జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి లేక సమాజంలో ఏ విధంగా నడచుకోవాలో తెలలుసుకోవాలంటే అది తండ్రి ద్వారానే సాధ్యం అయ్యేది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ జరుగుతాయో, ఉన్నతమైన అవకాశాలని తెలుసుకోవడానికి ఒక గురువు తప్పనిసరి. మీరు ఈ ఉన్నతమైన అవకాశాన్ని అన్వేషించినట్లయితే, దైవం సహజంగా ఆవిష్కారం అవుతుంది.

ఒకవేళ తల్లిదండ్రులు ఇంకా పరిపక్వత చెందకపోతే, వారికి దారి చూపించే పిల్లలు ఉంటే గనక అది ఎంతో అదృష్టమే.

“మాతా, పితా, గురు, దైవం” అని వారు అన్నప్పుడు, సహజమైన జీవన ప్రక్రియను గురించి ఒక్క మాటలో చెబుతున్నారు. సంస్కృతం గురించి మిడి మిడి జ్ఞానంతో ఉన్నవారు ఈ వాక్యాన్ని వారికి తోచిన రీతిలో అనువాదిస్తున్నారు “ముందు మాతా అన్నారు కాబట్టి. నీ జీవితం నాకే అంకితం అవ్వాలి.” అని తల్లి అంటుంది. తండ్రి ఏమంటాడంటే “నేను రెండో స్థానంలో ఉన్నాను కాబట్టి నీ జీవితం నాకు అంకితం. గురువు, దైవం వైపుకు వెళ్ళవలసిన అవసరం లేదు” అని. ఒకవేళ ప్రజలు ఈ విధంగా చెబుతున్నారంటే అది దురదృష్టకరం. ఎందుకంటే మీ తల్లి దండ్రులు కూడా ఇంకా మీలాంటివారే. వారు కూడా ఎదగాలి. వారు మీకన్నా ముందే పరిణామం చెంది ఉండాల్సింది. ఒకవేళ తల్లిదండ్రులు ఇంకా పరిపక్వత చెందకపోతే, వారికి దారి చూపించే పిల్లలు ఉంటే గనక అది ఎంతో అదృష్టమే. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

ప్రయాణం చేసేది స్వస్థలానికి చేరుకోవడానికే

ఒకవేళ మీ ప్రయాణం స్పృహతో కూడుకున్నట్లయితే మీ జీవన విధానం ఈ ప్రకారంగానే ఉంటుంది అని ఆ వాక్యంలో చెబుతున్నారు

మీరు కేవలం లౌకిక జీవితాన్ని గడిపినట్లయితే, మీ ప్రయాణం తల్లి గర్భం నుండి మరణ శయ్య వద్ద ముగిసిపోతుంది. మీరు సత్యాన్వేషకులుగా ఎరుకతో జీవిస్తే, జననం నుండి దివ్యత్వం వైపు సాగే ఈ ప్రయాణం స్వస్థలానికి చేరుకోవడం వంటిది అవుతుంది. ఆ మాట ఈ ప్రయాణం గురించే చెబుతోంది. ఒకవేళ మీ ప్రయాణం స్పృహతో కూడుకున్నట్లయితే మీ జీవన విధానం ఈ ప్రకారంగానే ఉంటుంది అని ఆ వాక్యంలో చెబుతున్నారు.. అంటే ముందు తల్లి, తరువాత తండ్రి పాత్ర, ఆ తరువాత గురువు పాత్ర, చివరికి దైవం.

తల్లి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తుంది. తండ్రి మనుగడకు దారి చూపిస్తాడు. గురువు మిమ్మల్ని మర్దించి, సిద్ధం చేస్తాడు. ఎందుకంటే, పిండిని మనం సరిగ్గా కలిపి మర్ధిస్తేనే, రొట్టె ముక్క తినడానికి వీలుగామృదువుగా ఉంటుంది. దైవం స్వీకరించ గల రీతిలో మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి గురువు అవసరం.

గురువు అంటే ఒక సాధనం, పరానికి చేరుకోవడానికి ఒక ద్వారం. ఎప్పుడైతే ద్వారం గుండా మీరు ఆవల ఉన్నదాన్ని చూస్తారో, అప్పుడు ఆ ద్వారం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే మీరు ఆవల ఉన్నదాన్ని చూడడానికి ఆ ద్వారం సహాయపడింది కదా. తన అవతల ఉన్నటువంటి సంభావ్యతలను అందించగల  కారణం చేతనే గురువుకు అంత ప్రాముఖ్యత. ద్వారం అనేది బయటకి వెళ్లేందుకు దారిని కల్పిస్తుంది కాబట్టి మీకు అది ముఖ్యం. ఒకవేళ మీరు గదిలోనే బంధీలుగా ఉన్నట్లయితే, ఆ ద్వారం పరాన్ని చేరుకోవడానికి ఒక గొప్ప అవకాశం కదా..!

ప్రేమాశీస్సులతో,
సద్గురు