ప్రశ్న: నమస్కారం సద్గురు. మా నాన్నగారు కిందటి సెప్టెంబర్ లో మరణించారు నేను ఆయన పెద్ద కొడుకుని నేను ఆయన ఖర్మకాండ చేశాను. నేను ఆయన అస్థికలను తీసుకుని త్రివేణీ సంగమానికి వాటికి వెళ్ళాను. అప్పట్లో అక్కడ ఉన్న పురోహితులు, మా చుట్టూరా ఉన్న వాళ్ళు కొంతమంది, ఆయన ఇప్పటికే మరోచోట పుట్టేసారు అని అంటున్నారు. కొంతమంది మీరు సరైన రీతిలో ఈ చేయవలసినవి చేస్తే ఆయనకి మెల్లిగా ఇంకో రూపం వస్తుంది అని అంటున్నారు, కొంతమంది సృష్టికర్త నాటకం అంటున్నారు. నా ప్రశ్న ఏమిటంటే అసలు సృష్టికర్త ఇలాంటి ఆటను ఎందుకు ఆడతారు? అసలు ఒక సృష్టి, మళ్ళీ చివరిలో ఈ ముక్తి ఇవన్నీ ఎందుకు? ఈ పరిభ్రమణం, మన చుట్టూ ఈ తెలివితేటలూ,ఇవన్నీ ఎందుకు? ఇదంతా సృష్టికర్త ఆటా? నేను మరణం అనే ఈ శక్తివంతమైన అనభూతిని క్రిందటి సంవత్సరం అనుభూతి చెందాను, అందుకునే ఈ ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, మా తండ్రి మరణానికి ఇన్ని రకాలైన వ్యాఖ్యానాలు, వివరణలు ఎందుకు?

సద్గురు: అవి వివరణలు కాదు, మీతో మరింత వ్యాపారం చేయడానికి ప్రయత్నాలు.

ప్రశ్న: అసలు ఇదంతా ఈ సృష్టికి అంతిమంగా ఉన్న అవసరం ఏమిటి? ఈ సృష్టి అంతా ఎందుకు? ఈ పరిణామ క్రమంలో అంతిమ లక్ష్యం ఏమిటి? ఈ జీవాలకు అంతిమ లక్ష్యం ఏమిటి?

సద్గురు: మీరే చెప్పారు కదా, ముక్తి అని, ఇక నేను చెప్పేది ఏముంది. ఈ సృష్టి ఎందుకు?? ఏదో మీకు బాగా బలంగా దెబ్బ తగిలినప్పుడు మాత్రమే మీకు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. లేకపోతే ఇలాంటి ప్రశ్నలు మీకు కలుగవు కదా..మీరు ఎంతో ఆనందంగా ఉన్నారనుకోండి, మీరు "ఎందుకు ఈ సృష్టి?" అన్న ప్రశ్న అడగరు కదా. ఇప్పుడు మీకు ఏదో బాధ కలిగింది కాబట్టి, " ఎందుకు ఇదంతా " అని అడుగుతారు. మరణం అనేది కొత్త విషయమేమీ కాదు. మీ నాన్నగారు చనిపోయిన మొదటి వ్యక్తి కూడా కాదు. నేను ఆయన పట్ల పూర్తి గౌరవంతో, మీకు ఆయనపట్ల ఉన్న ఎంతో గౌరవాన్ని గుర్తించే ఈ మాట చెప్తున్నాను. ఈ ప్రపంచంలో మొదట చనిపోయిన వ్యక్తి మీ నాన్నగారే కాదు కదా. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ రోజు మీ ఇంట్లో ఎవరో మరణించారు. ప్రతివారు ఎవరో ఒకరిని కోల్పోయారు అవునా!

ఒకసారి ఇలా జరిగింది. ఒక ధనికుడు పెద్ద ఇంటిని కట్టుకున్నాడు. చాలా పెద్ద ఇల్లు. ఈ దేశంలో ఒక సంప్రదాయం ఏంటంటే మీరు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఓ సాధువునో, ఓ యోగినో మీ ఇంటికి పిలుస్తారు. అలానే, వీళ్ళు కూడా ఓ యోగిని ఇంటికి పిల్చారు. ఆ యోగి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఆ యోగికి స్వాగతం చెప్పి, ఆయనని ఎంతో మర్యాదగా చూసుకున్నారు. ఆయనకి మంచి ఆహారాన్ని పెట్టారు.ఆ తరువాత వాళ్ళు ఆయనను "మాకు ఏదో ఒక ఆశీర్వచనాన్ని ఇమ్మ" ని అడిగారు. ఆ యోగి ఏమన్నారంటే, "మొదట మీ నాన్నగారు మరణించాలి, ఆ తరువాత మీరు మరణించాలి, ఆ తరువాత మీ పిల్లలు మరణించాలి" అని. ఆ ధనికుడు, "ఏమిటిది? మిమల్ని మా ఇంటికి తీసుకువచ్చి మిమల్ని రాజులాగా మేము చూసుకుని, చక్కగా భోజనం పెట్టి అన్నీ చేస్తే మీరేమో ముందర మా నాన్నగారు మరణించాలి. తరువాత నేను మరణించాలి, తరువాత నా పిల్లాడు మరణించాలి అంటారా? ఏంటిది? ఈ పిచ్చి మాటలు ఏవిటి?" అన్నాడు.

అప్పుడు ఆ యోగి ఎంతో ఆశ్చర్యంతో, "నేను తప్పుగా ఏం చెప్పాను? ఇది మంచి విషయమే కదా. ముందర మీ నాన్నగారు చనిపోయి, తరువాత మీరు చనిపోయి, తరువాత మీ పిల్లలు చనిపోయారంటే అప్పుడు జీవితం ఎలా జరగాలో అలా జరుగుతున్నట్టు కదా" అన్నారు. మీ నాన్నగారు పోయే ముందరే మీరు పోయారనుకోండి అది మంచిది కాదు కదా. మీరు మరణించే ముందరే మీ పిల్లలు మరణించడం కూడా మంచి విషయం కాదు కదా. మొదట మీ నాన్నగారు మరణించాలి, ఆ తరువాత మీరు మరణించాలి, ఆ తరువాత మీ పిల్లలు మరణించాలి. ఇది సహజమైన జీవన ప్రక్రియ కదా! అవునా..? మిమల్ని కూడా ఆశీర్వదించనా? జీవితం ఇలానే జరగాలి కదా. ఇప్పుడు మనం దీనితోనే మొదలుపెట్టాం, మొదట మీ నాన్నగారు, ఆ తరువాత పెద్ద కొడుకు, ఇంకా సమయం అవలేదు లెండి. దీర్ఘాయుషుతో మిమల్ని దీవిస్తున్నాము. కానీ తరువాత మీరే. కానీ మీ తమ్ముడు మీ కంటె ముందర మరణించకూడదు. ముందర మీరు, తరువాత మీ తమ్ముడు. ఇది ఇలానే జరగాలి. అలా జరిగితే జీవితం సజావుగా ఉన్నట్టు.

మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ సమయం టిక్టిక్ అని వెళిపోతోందని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు మూర్ఖమైన పనులేవీ చేయడానికి సమయమే ఉండదు

ఇప్పుడు ఉన్నట్టు ఉండి మీకు ఎవరో సన్నిహితంగా ఉన్నవారు వెళ్లిపోయారని మీరు దిగ్భ్రాంతి చెందారు. అది మంచిదే. మీ నాన్నగారు వెళ్లిపోవడం మంచిది అనటం లేదు. మీరు దీనికి అమరత్వం లేదని తెలుసుకోవడం మంచి విషయం. ఇది మీరు ఎంత చిన్నప్పుడు తెలుసుకుంటే అంత మంచిది. మీరు మీ పిల్లలందరిని కనీసం ఒకసారైనా స్మశానంకి తీసుకుని వెళ్ళండి. మీరు అక్కడ మీకు ఎంతో దగ్గర వాళ్ళు మరణించారనుకోండి అప్పుడు ఎలాంటి భావావేశాలతో కూర్చుంటారో అలానే ఉండండి.

అప్పుడు మీ పిల్లలు, మీరు అనుభూతి చెందాలి. ఇది మీ పిల్లలు తెలుసుకోవాలి. మీ పిల్లలు ఇది ఎప్పుడో అప్పుడు వెళ్లిపోయే శరీరమే అని తెలుసుకుంటే వాళ్లు మరికొంత ఎరుకతో జీవిస్తారు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ సమయం టిక్టిక్ అని వెళిపోతోందని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు మూర్ఖమైన పనులేవీ చేయడానికి సమయమే ఉండదు. అవునా కాదా? మీరు ఏదయితే మీకు ముఖ్యమైనది కాదో అవి చేయడానికి మీకు సమయమే ఉండదు. అవునా! ఇప్పుడు ఎన్నో మూర్ఖమైన విషయాలు చేస్తున్నారు, ఎన్నో అక్కర్లేని మాటలు, ఎన్నో అక్కర్లేని పనులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు అమరులన్న భావన మీకు ఉంది కాబట్టి. మీకు అనుభవపూర్వకంగా, మీరు మరణించవలసిందే అని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు సమయం జారిపోతుంది అన్న విషయం మీ ఎరుకలో ఉంటుంది. అప్పుడు మీకు ఎవరితోనైనా పోట్లాడడానికి కానీ, ఇంకేమైనా మూర్ఖమైన పని చేయడానికి కానీ సమయముంటుందా..? మీకు ఏదైతే ముఖ్యమో కేవలం అది మాత్రమే చేస్తారు. ప్రతివాళ్ళు కూడా వాళ్లకేది ముఖ్యమో అది మాత్రమే చేసారనుకోండి, ఈ ప్రపంచం ఎంతో ఉత్తమమైన ప్రపంచం అవుతుంది. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే " ఇది శాశ్వతం కాదు" అన్న విషయం తెలుసుకుంటే అది ఎంతో ఉత్తమం కదా...? ఎందుకంటే, మీ జీవితాన్ని మీరు ఇంకొంచెం స్పృహతో, కొంచెం ఇంగితంతో తీర్చిదిద్దుకుంటారు.

నేను కొంతకాలం ప్రతి రోజు స్మశానానికి వెళ్లేవాడిని. ఎందుకంటే ప్రతివాళ్ళు ఇప్పుడు మీరు విన్నట్టె "మీ నాన్నగారు గాలిలో ఉన్నారు, మీ నాన్నగారు ఆకాశం లో ఉన్నారు, మరి ఎక్కడో ఉన్నారు" ఇలాంటివే విన్నాను. మా నాన్నగారు నాతోనే ఉండేవారు కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకునే వాడిని. ఎవరైనా "ఇది ఓ భూతాల మేడ" అని చెప్తే, అక్కడకు వెళ్లి పడుకునేవాడిని. ఆ రోజు రాత్రే ఆ భూతం వచ్చేది కాదు. ఎవరో ఒకతను, ప్రతి అమావాస్య అతను వెళ్లి దెయ్యాలకి రక్తాన్ని ఇచ్చి వస్తానని చెప్పేవాడు. అతను, అతని వేలంతా అలా తెగిపోయి ఉండడం చూపించాడు.. ఎందుకంటే ఎప్పుడూ అలా తెంపేస్తూ ఉండేవాడు. ఈ దెయ్యాలకి రక్తాన్ని ఇవ్వడం కోసమని. నేను అతనితో వెళ్ళడం మొదలు పెట్టాను - అమావాస్య తరువాత అమావాస్య. కానీ అది రావడం లేదు. ఇలా ప్రతీచోటకి వెళ్లి చూసాను. ఇంకో అతనేమో నల్ల వస్త్రాలు ధరించి ఉండేవాడు. అతను ఓ పెద్ద ఆలయంలాంటి చోటుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎంతో ఎన్నో రకాల జాడీలు, అవి గట్టిగా ఒక నల్ల వస్త్రంతో కట్టబడి ఉండేవి. ఇతను ఏంచెప్పేవాడంటే ఈ గాజు సీసాలలో అతను ఎన్నో రకాల దెయ్యాలను పట్టి ఉంచానని చెప్పేవాడు. నేను అతన్ని ఎలాగోలా స్నేహితుడిని చేసుకున్నాను. ఎందుకంటే ఎలాగోలా ఒక జాడీని దొంగతనం చేద్దాం అనుకున్నాను, అతని దగ్గరనుంచి. కానీ అతను చాలాజాగ్రత్తగా ఉండేవాడు. నన్ను ఒక సీసా కూడా తీసుకోనివ్వలేదు. కానీ ఒక్క సీసాలోంచి ఒక్క దెయ్యం కూడా ఎప్పుడూ బయటకు రాలేదు.

మీరు, "నేను ఎల్లప్పటికీ ఇక్కడే ఉండిపోతాను" అనుకున్నారనుకోండి మీరు చేయవల్సిన ఎన్నో పనులకు ఎంతో సమయం ఉందనుకుంటారు. ఇలా ఎన్నో అక్కర్లేని పనులని చేస్తారు.

ఆ తరువాత నేను స్మశానాల్లో వెళ్లి కూర్చోవడం మొదలు పెట్టాను, అవి ఇక్కడ ఉండి ఉండచ్చు అనుకొని. నేను అప్పుడే మరణించిన వారిని చూడాలని అనుకున్నాను. వాళ్ళని దహనం చేసినప్పుడు అది బయటకు వస్తుందేమో అప్పుడు చూడాలి అని కూర్చున్నాను. ఒక చెట్టుకి మేకు కొడితే పన్నెండు గంటలకి అది వస్తుందని చెప్పేవారు. నేను ఆ చెట్టుని వెళ్లి ప్రతిరోజూ అక్కడో మేకుని కొట్టేవాడిని. మీకు ఈ విషయాలన్నీ తెలుసా? నేను ఇలా వాచ్ చూసి సరిగ్గా పన్నెండు అయ్యేసరికి టక టక అని కొట్టేవాడిని. ఏమి వచ్చేది కాదు. అక్కడ కూర్చుని ఉండేవాడిని. మనుషులు ఆలా శవాలను తీసుకుని వచ్చి ఏడ్చి, అరిచి అన్నీ చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు ఎక్కువసేపు ఉండరు. వాళ్ళు అక్కడ అరగంటో, గంటో ఉంటారు అంతే. ఓ సారి అలా దహనం అవడం మొదలు పెట్టిన తరువాత వాళ్లకి వేరే పనులు ఉంటాయి ఇంట్లో చేసుకోవడానికి. అందుకని వాళ్ళు వెళ్లిపోయేవారు. కానీ మీరు ఈ దహనం చేసేది ఏదైతే ఉందో అది చాల విశాలంగా ఏర్పాటు చేస్తే తప్పితే, ఇప్పుడు చెక్కలు కూడా చాలా ఖరీదైనవి కదా అందుకని సామాన్యంగా అలా చేయరు. దీన్ని సన్నగానే పెడతారు. ఒకసారి ఇది కాలిన తరువాత ముందర, మెడకాయి చాలా తొందరగా కాలిపోతుంది. దాంతో ఏమవుతోందంటే ఆ తల అలా విరిగి కింద పడిపోతుంది. డు డు డు అని అలా వెళ్లిపోతూ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడూ వెళ్లి దాన్ని ఒక కర్రతో తీసి మళ్ళి లోపల పడేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఒకవేళ తల్లో ఉందేమో దెయ్యం అని. దాన్ని చూడాలనుకునేవాడిని. ఏమి వచ్చేది కాదు.

నేను అంతర్ముఖుడైనప్పుడు మాత్రమే లోపల ఏదో ఉందని తెలుసుకున్నాను. నేను వేరే ఎక్కడ చూసినా సరే, నాకు ఏమీ కనిపించలేదు. కానీ ఇలా ఈ స్మశానంలో ఉండడం దాదాపుగా ప్రతిరోజూ చేసేవాడిని. దీనివల్ల నాకు ఒక విషయం నూటికి నూరు శాతం స్పష్టం అయ్యిందేమిటంటే మనం ఎప్పటికైనా మరణించవలసిందే అన్న విషయం. నాకు, ఈ దేహం కాలానికి పరిమితమైనది అన్న విషయం తెలుసు. ఒకసారి ఇది కాలానికి పరిమితమైనదే అన్న విషయం మీకు తెలిసిన తరువాత మీ జీవితాన్ని మీరు ఎంతో ప్రభావవంతంగా సరిదిద్దుకుంటారు. మీరు, "నేను ఎల్లప్పటికీ ఇక్కడే ఉండిపోతాను" అనుకున్నారనుకోండి మీరు చేయవల్సిన ఎన్నో పనులకు ఎంతో సమయం ఉందనుకుంటారు. ఇలా ఎన్నో అక్కర్లేని పనులని చేస్తారు.

అంతర్ముఖులవ్వడం ఒకటే మార్గం

అందుకని "ఇవన్నీ ఎక్కడకు వెళ్లిపోయాయి? వీళ్ళు ఎక్కడకు వెళ్లారు?" ఇలాంటి కొన్ని విషయాలు మీకు అనుభవంతో మాత్రమే బాగా తెలుస్తాయి. మీరు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ విషయం తెలుస్తుంది లేదా మీరు అంతర్ముఖులైనా సరేమీకు తెలుస్తుంది. వేరే వారు ఏం చెప్పినా సరే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే మీ అనుభూతిలో లేని దాని గురించి మాట్లాడినప్పుడు, అది ఓ పెద్ద కథ మాత్రమే అవుతుంది. మీరు దాన్ని నమ్మచ్చు లేకపోతే నమ్మకపోవచ్చు. ఇప్పుడ మీకు మూడు రకాలుగా చెప్పారనుకోండి మీకు ఏది నమ్మాలో తెలీదు. అందులో ఒకటి నిజమై ఉండచ్చు. అన్నీ నిజమై ఉండచ్చు. నేను ఏదో ఒక దాని గురించి చెప్పాననుకోండి, నిజానికి ఏం జరుగుతుంది...? మీకు ఇంకా ఏమి తెలీదు అంతే కదూ.

అందుకని తెలుసుకోవాల్సిన పద్దతి ఇది కాదు. మీరు ఏమడుగుతున్నారంటే నా జీవిత విధానం ఏమిటి అని? నా జీవిత స్వభావం ఏమిటి అని? మీరు జీవించే ఉన్నారు కదా? మీ జీవిత స్వభావం ఏమిటో తెలుసుకోవడానికి ఇదే సమయం కదూ. మీరు నన్ను అడిగితే నేను ఏదో చెబుతాను. నేను ఏది నిజమో అదే చెప్తూ ఉండి ఉండచ్చు. కానీ మీకు సంబంధించినంత వరకు అదొక కథ మాత్రమే కదూ. ఇప్పటివరకు ఏవిటంటే ఇది మాములుగా వచ్చే ఒక రకమైన ఉత్సుకత అంతే. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్న గారు మరణించారు కాబట్టి ఇది మిమల్ని బాధపెడుతోంది. ఇంకో రెండు నెలల సమయంలోమీరు బానే ఉంటారు. మీకు ఇవన్నీ తెలుసుకోవాలన్న ఉత్సుకత ఏమీ ఉండదు. మీకు నిజంగా తెలుసుకోవాలి అని ఉంటే, ప్రతిరోజూ మీరు వెళ్లి స్మశానంలో కూర్చున్నారనుకోండి అప్పుడు ఈ రకమైన ఉత్సుకత మీకు వస్తుంది, ఇది ఏమిటో తెలుసుకోవాలి అని. ఒకసారి ఇది ఏమిటో తెలుసుకోకుండా నేను ఉండలేను అన్నలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు నేను మీకు ఒక ప్రక్రియ ఇస్తే అది ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. ఇప్పుడు మీకు ఉన్నది కొంచెం కుతూహలం మాత్రమే. ఏవిటో తెలుసుకోవాలని. మీ జీవితం అనేది ఓ పక్క వ్యవహారం కాదు. ఇదే మొత్తం ఉన్న వ్యవహారమంతా కదూ...!

ప్రేమాశిస్సులతో,
సద్గురు