ఎంతోమంది భారతీయులు శ్రీరాముణ్ణి కొలుస్తారు. జీవితంలో ఆయన ఎదురుకున్న పరిస్థితులనీ, జీవితం ఆయన పట్ల వ్యవహరించిన తీరుని పరికించి చూస్తే ఆయన వివత్తుల వలయంలో చిక్కుకున్నట్లు అనిస్పిస్తుంది. తనదైన రాజ్యాన్ని కోల్పోయి, అడవిపాలౌతాడు. అది చాలదనట్టు ఆయన భార్యని అపహరించిన వానితో ఆయన ఏమాత్రం ఇష్టంలేని ఘోరయుద్ధం చేస్తాడు. తీరా అర్ధాంగిని రాజ్యానికి తీసుకునివచ్చిన తరవాత ఆమెను గూర్చి ఆయన రాజ్య ప్రజలే అప్రతిష్ట పలుకులను పలకడం విని ఎంతో నొచ్చుకున్నాడు. విషాద హృదయంతో ప్రాణప్రదమైన సీతని నిండు చూలాలని కూడా చూడకుండా , అడవిలో విడిచిపెడతాడు.ఇవన్నీ చాలవనట్టు, తనకు తెలియకుండానే తన పుత్రులతో యుద్ధం చేసి , చివరికి భార్యను కోల్పోతాడు. ఇలా ఆయన జీవితమంతా ఎడతెగని అనర్ధాలే.

రాముని ఔన్నత్యం, జీవితంలో ఆయన ఎదురుకున్నపరిస్థితుల్లో లేదు, ఆయన తన జీవితాన్ని ఎంతటి సామరస్యంతో, హుందాతనంతో నిర్వహించుకున్నారన్నదానిలో ఉంది. ఎటువంటి విపత్తు వచ్చిపడినా ఆయనెప్పుడూ కూడా ఏ ఒక్కరినీ దూషించడంగానీ, పరిస్థితి విషమించిందని అందరిపై విరుచుపడటం గానీ, చేయలేదు. ఎటువంటి పరిస్థితిలోనైన హుందాగాగానే ఉండేవారు.

జీవితంలో ఎటువంటి విపరీతాన్నైనా , చెక్కుచెదరకుండా , సత్యమార్గాన్ని వీడకుండా  స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్నాడు.

ముక్తినీ, అనుగ్రహపూర్వకమైన జీవితాన్ని ఆకాంక్షించే వారెప్పుడూ రాముడినే ఆరాధించేవారు, ఎందుకంటే, బాహ్య పరిస్థితులెప్పుడూ కూడా మన చేతుల్లో లేవనీ,అవెప్పుడైనా, ఎలాగైనా తారుమారవ్వొచ్చునన్న జ్ఞానం వారికుంది గనక , వారు రాముణ్ణి కొలిచారు. మీరు బాహ్య పరిస్థితులని ఎంతో నైపుణ్యతతో నిర్వహించుకున్నప్పటికీ, ఎదో తప్పు జరిగి తీరుతుంది. ఉదాహరణకి ఏ క్షణాన్నైనా తుఫాను రాబోతున్నదని తెలిసి, మీరు ఇంట్లోకి కావలసినవన్నీ ముందుగానే అమర్చుకున్నారనుకోండి. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా అమాంతంగా తుఫానొచ్చి మీ ఇంటిని ఈడ్చుకుని వెళ్ళిపోతే..?, ఎంతో మందికి ఇలా జరగడం చూస్తూనే ఉన్నాం. మీకిప్పటి వరకూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. ‘నాకసలలాంటి దుర్ఘటనలు జరగవు' అనుకోవడం అవివేకం.

ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా నేను దాన్ని స్థైర్యంగా , సౌమ్యంగా ఎదుర్కుంటాను అని అనుకోవడం వివేకవంతుల లక్షణం. ఇటువంటి అద్భుతమైన వివేకాన్నీ, సుజ్ఞానాన్నీ రాముడిలో చూసారు గనకే ఆయననే కోరుకుని, ఆయన్నే కొలిచారు రామభక్తులు. జీవితంలో ఎటువంటి విపరీతాన్నైనా, చెక్కుచెదరకుండా , సత్యమార్గాన్ని వీడకుండా  స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్నాడు.

ఆ మాటకొస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు విపత్తులని కోరుకునే ఆనవాయతీ కూడా ఉంది. ఎంతో మంది ఆధ్యాత్మిక పిపాసకులు తమ జీవితం మరీ అంత సవ్యంగా, సజావుగా సాగకూడదని, సమస్యల్ని కోరుకుంటారు. ఇటువంటి సమస్యల ద్వారా భగవంతుడు వారికి పరీక్ష పెడితే, మరణించే ముందు వారంటే ఏమిటో వారికి పూర్తిగా తెలుసుకునే అవకాశముంటుందని నమ్ముతారు. వారి సాధనా క్రమలో పరిపక్వాన్ని పరీక్షించుకోవడానికి ఎన్ని విపత్తులనైనా  ఆనందంగా ఎదురుకుంటారు. ఐతే మరణం ఆసన్నమైనప్పుడు ఈ సమతుల్యాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఈ సమయంలో వేటినైతే నిజాలని అప్పటిదాకా నమ్ముతూ వచ్చామో, మన కళ్ళ ముందే అవన్నీ పటాపంచలౌతుంటే,నియంత్రణ పట్టుతప్పుతుంది. ఇలా జరిగిన ఉదాంతాలెన్నో ఉన్నాయి. ఇలా చేయడం వలన ఆపదల్ని కోరితెచ్చుకున్నారు ఎంతో మందున్నారు.

అలా కాకూడదని, మరణం ఆసన్నమైనప్పుడు, ఏమాత్రం తొణకకుండా దాన్ని హుందాగా అక్కున చేర్చువాలన్నదే వీరి తపన. ఇది ఆకస్మికంగా జరిగితే మిమ్మల్ని మీరు నిలదోక్కుకోలేరు. అందుకే దీనికి కొంత సాధన అవసరం. అందుకే వారు పూర్తి ఎరుకతో తమ జీవితంలో కష్టాలు కావలని కోరుకుంటారు. ఇలా సానపడితేనే చివరిక్షణంలో మరణాన్ని ఓ నిండుతనంతో స్వీకరించగలుగుతారు. మీ జీవితంలో మీరేం చేసారు, ఏంత సంపాదించారు,ఏం జరిగిందీ, ఏం జరగలేదూ..ఇటువంటి వాటికి ఏ విలువా లేదు. సంకటకాలాల్లో మిమ్మల్ని మీరు ఎలా నిలదొక్కుకున్నారు, శ్రీరాముడిలా హుందాగా ఈ జీవితాన్ని సాధ్యమైనంత అవలీలగా ఎలా దాటారో... అదే అన్నిటికంటే ముఖ్యమైనది!

ఇదెలాంటిదంటే ఉరికంబం వైపు కూడా ఓ హుందాతనంతో నడిపిస్తుంది. ఇది మనిషిలోని మహత్తర లక్షణం, ఇక మిగితాది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.    

తమకు అవసరంలేని వాటన్నిటినీ పొందినందుకు ఆనందపడిపోయి కృతఙ్ఞతలు చెపుతూ ఉంటారు మనుషులు. ఇటువంటివి మీ జీవితాకిని ఎక్కువ విలువనేమీ ఆపాదించవు. భారతదేశంలో సర్వ సాధారణ దృశ్యం ఏమిటంటే - ఇంద్రభవనం లాంటి ఓ ఇంటిని ఆనుకుని, ఓ పూరి గుడిసె కూడా ఉంటుంది-ఐతే విషయమేమిటంటే ఈ పూరి గుడిసెలో ఉన్నవాడు ఎంతో సంతృప్తిగా , ఉన్నంతలో ఆనందంగా , తన పొరిగింటివాడంత ఐశ్వర్యం లేకపోయినా అంతే గర్వంగా ఉంటాడు! అది స్వాభిమానం నుండి వచ్చిన గర్వం, ఈ స్వాభిమానానికి పక్కింటివాడి సిరిసంపదలతో సంబంధంలేదు. ఇదెలాంటిదంటే ఉరికంబం వైపు కూడా ఓ హుందాతనంతో నడిపిస్తుంది. ఇది మనిషిలోని మహత్తర లక్షణం, ఇక మిగితాది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

అంటే దీనర్ధం మన జీవితాన్ని చక్కగా నిర్వహించుకోకూడదనా? కాదు, కాదు, బాహ్య పరిస్థితులని తప్పకుండా చక్కదిద్దుకోవాలి, ఎందుకంటే ఇందులోనే మన చుట్టుపక్కల వారి శ్రేయస్సుంది కాబట్టి. పరిస్థితులని బాగా నిర్వంహించినంత మాత్రాన మీరు తబ్బిబైపోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని మీరు సరిగ్గా నిర్వహించుకుంటేనే మీరు మహదానందాన్ని పొందగలరు, మీరిలా చేసేది కేవలం మీ చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కొరకే కదా!

తన బాహ్య పరిస్థితులని చక్కగా నిర్వహించుకోడానికి ఎంతో ప్రయత్నించాడు శ్రీరాముడు, కొన్ని సార్లు ఆయన విఫలమయ్యాడు కూడా. ఆపత్కాలంలో పరిస్థితులు చేయిదాటిపోతూ ఉన్నప్పుడు కూడా ఆయన తన శాంతాన్ని కోల్పోలేదు. ఇదే ఆధ్యాత్మికతలోని సారం, అందులోకి అడుగిడిన వారికెంతో ముఖ్యం కూడా. మీ ఆంతర్యం పరిమళాలు వెదజల్లే పుష్పంలా వికసించాలంటే, నిరంతరం అనుగ్రహ పూర్వకమైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోవాలి!

ప్రేమాశీస్సులతో,
సద్గురు