కృష్ణుడి జననం గురించీ, దాని చుట్టూ జరిగిన అద్భుతమైన సంఘటనల గురించీ ఈ కథలో సద్గురు మనకు చెబుతారు.


 కృష్ణుడు ఒక వ్యక్తిగా, తన జీవితంలో అతను ఎంచుకున్న లక్ష్యం, అదే సమయంలో ఒక మనిషిగా అంత చురుకైన జీవితాన్ని జీవించటంలోని అవసరం, ఒక దైవిక అంశం – ఇవన్నీ కూడా ఒక సంక్లిష్ట అల్లిక. ఆయనను ఇలానే, అలానే అని ఒకేరకంగా చూడటం సరైన పద్ధతి కాదు. ఆయన జీవితంలోని ఒక్క పార్శ్వాన్ని మాత్రమే గమనిస్తే ఆయనను పూర్తిగా వక్రబుద్ధిగల వ్యక్తిగా అర్ధం చేసుకుంటాము. ఆయనలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయంటే కనీసం మీరు వాటినన్నిటినీ కొంత అయినా రుచి చూడకపోతే, అది ఆయనకు మనం పూర్తిగా అన్యాయం చేయటమే అవుతుంది.
భౌగోళికపరంగా ఆయన ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని మధురలో జన్మించారు. అక్కడ ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ సంఘ నాయకుడు. ఉగ్రసేన వృద్ధుడు కావడం వలన అత్యాశపరుడైన అతని కొడుకు, కంసుడు అధికారం చేజిక్కించు కోవాలి అనే విషయంలో సంకోచం లేనివాడు. అతను తన తండ్రి మరణించే వరకూ ఆగలేక, తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. జరాసంధుడు అనే ఒక నిర్దాక్షిణ్యమైన తూర్పుదేశ చక్రవర్తితో ఆయన పొత్తు కుదుర్చుకున్నాడు. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని జయించటమే జరాసంధుడి ఆకాంక్ష. కౄరమైన బలంతో అతని సార్వభౌమత్వం ఎంతో త్వరగా పెరుగుతూ వచ్చింది. శక్తిమంతుడు కావాలంటే అతనితో పొత్తు కుదుర్చుకోవడం కంసుడికి ఉన్న ఒక్కటే మార్గం.

కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ నాయకుడైన వసుదేవుడిని వివాహం చేసుకుంది. పెళ్లి అయిన తరువాత కొత్త దంపతులను కంసుడే తన రధంలో తీసుకువెళ్తునప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలికింది. ఈ ఆకాశవాణి “ఓ కంసా! నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదొవ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం” అని చెప్పింది.

కంసుడు ఒక్కసారిగా ఉగృడయ్యాడు. “ఓహో, ఆమె ఎనిమిదొవ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన ఎనిమిదొవ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తాను” అని హూంకరించాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోయాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్ధించాడు, “దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆ పని నువ్వు ఎలా చేయగలవు? ఆమె నీ చెల్లెలు. ఇప్పుడే మాకు పెళ్లి అయ్యింది. ఈ సమయంలో ఆమెను ఎలా నరకగలవు?” “ఆమె ఎనిమిదొవ సంతానమే కదా నిన్ను చంపేది. నేను అలాంటిదేదీ జరగనివ్వను” అంటూ, “నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు. కాని దయచేసి నా భార్యను వదిలిపెట్టు” అని వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కాని కంసుడు తన ప్రాణం భద్రత గురించి ఉన్న ఆదుర్దాతో తన చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలావాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేశారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు “ఎనిమిదొవ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని” ఏడ్చి ప్రాధేయపడ్డారు. “నేను ఎంటువంటి అవకాశం తీసుకోదలచుకోలేదు” అని కంసుడన్నాడు, అతను బిడ్డను తీసుకుని, కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా, ఆయన ఎవరినీ ప్రాణాలతో వదిలేయకపోవటం.అది ఇలా జరుగుతూనే వచ్చింది. ఆయన ఆరుగురు బిడ్డలను పుట్టగానే ఇలానే చంపేశాడు.

వసుదేవుడు కృష్ణుడ్ని యమున దాటించడం 

కంసుడితో దేవకీ వసుదేవులు ఎంతో విసిగిపోయారు. కంసుడి పాలనలో ప్రజలు ఎంతో భయంతో బ్రతుకుతున్నారు. ఎప్పుడూ యుద్ధాలు చేయటం, ఇలా పిల్లలను చంపటంలాంటి కౄరమైన చర్యలతో, సమయం గడిచే కొద్దీ కంసునితో వారు కూడా విసిగిపోయారు. మెల్లిగా రాజభవనంలోనే అసహనం పెరుగుతూ వచ్చింది. అయితే ఏడో బిడ్డ పుట్టగానే వసుదేవుడు దాన్ని బయటకు తెచ్చి, ఎక్కడో దొరికిన ఒక చనిపోయిన శిశివుతో మార్చాడు. ఈ బిడ్డను యమునా నది దాటి వసుదేవుడి మరొక భార్య అయిన రోహిణీకి చేరవేశాడు.
ఈ బిడ్డ పేరు బలరాముడు. అతను పెరిగి పెద్దవాడై భారీకాయుడయ్యాడు. అతని బలపరాక్రమాల గురించి, చేసిన పనుల గురించి ఎన్నో కధలు ఉన్నాయి.

ఎనిమిదొవ బిడ్డ పుట్టబోయే సమయంలో కంసుడు ఎంతో కలతపడ్డాడు. ఇన్ని రోజులూ వాళ్ళను ఇంట్లోనే నిర్భందించి ఉంచాడు కాని ఇప్పుడు దేవకీ వసుదేవులకు సంకెళ్ళు వేసి ఒక కారాగారంల్లో ఉంచాడు. ఈ బిడ్డ ఒక నెల బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మించింది. కంసుడు ఏదైనా జరుగుతుందేమో అని ఎవరినీ ఈ కారాగారంల్లోకి రానివ్వలేదు. ఆయనకు నమ్మకస్తురాలైన, బంధువు పూతన అనే మంత్రసానిని అక్కడ ఉంచాడు. ఆమె కాపలా, వారి ప్రణాళిక ఏమిటంటే బిడ్డ పుట్టగానే ఆమె ఆ బిడ్డను కంసుడికి ఇస్తే అతను చంపేస్తాడు.

పురిటి నొప్పులు వస్తూ, పోతూ ఉన్నాయి. పూతన ఎదురుచూస్తూనే ఉంది. కాని ఇంకా ప్రసవం జరగలేదు. ఎప్పుడో రాత్రి వేళ కొద్ది నిముషాలు ఆమె తన ఇంటికి వెళ్ళింది. కాని ఆమె తన ఇంటికి చేరగానే హఠాత్తుగా పెద్ద వర్షం మొదలై వీధులన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఈ పరిస్థితిలో పూతన తిరిగి కారాగారానికి వెళ్ళలేకపోయింది. అప్పుడే శిశివు జన్మించి, ఒక అద్భుతం జరిగింది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి – కాపలావాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోయారు – సంకెళ్ళు తెగిపోయాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావించాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమనా నదివైపుకు నడిచాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంది, ఆయన దాని గుండా తేలికగా నడవగలిగాడు. ఆయన నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్ళాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో లేదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేశాడు.

ఎనిమిదో బిడ్డను కంసుడు చంపే ప్రయత్నం చేయడం

అప్పుడు ఆ ఆడపిల్ల ఏడ్చింది. కాపలావాళ్ళు వెళ్లి కంసుడికి వార్త చేరవేశారు. అప్పటికి పూతన తిరిగి వచ్చింది. కంసుడు వచ్చి అది ఒక ఆడ శిశువు అని గమనించాడు. ఇక్కడ ఎదో గడబిడ జరిగిందని ఆయనకు అర్ధం అయ్యి పూతనను “నీకు ఖచ్చితంగా తెలుసా? ఈ బిడ్డ జన్మించి నప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా?” అని అడిగాడు. పూతన ప్రాణ భయంతో, “నేను ఇక్కడే ఉన్నాను. నేను నా సొంత కళ్ళతో చూసాను’’. “ఈ బిడ్డ నా కళ్ళ ముందే ఇక్కడే పుట్టింది” అని ఇంకా నమ్మేటట్లు ఆమె చెప్పింది. దేవకీ వసుదేవులు “ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంప గలిగేవాడేమో. కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు” అని అర్ధించారు. కాని కంసుడు “లేదు, నేను ఎటువంటి అవకాశం తీసుకోదలచులేదు” అన్నాడు. మళ్ళీ ఒక్కసారి ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోయాడు.

అలా చేసేటప్పుడు ఈ బిడ్డ అతని చేతి నుంచి జారిపోయి కిటికీలోనుంచి ఎగిరి బయటకు వెళ్లి అతన్ని చూసి “నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు” అని నవ్వింది, ఇప్పుడు కంసుడికి అనుమానం పెరిగింది. అక్కడ ఉన్నవారిని అందరినీ విచారించాడు. కాపలావాళ్ళు నిద్రపోయారు, పుతానా బయటకు వెళ్ళింది. కాని ఎవరూ ఏదీ ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే అందరికీ వాళ్ళ ప్రాణభయం. మీరు వ్యవహారాలను భయంతో నడిపించాలని చూస్తే మొదట్లో అది మీకు ప్రయోజనంగానే అనిపిస్తుంది. “నువ్వు ఇది చేయకపోతే చస్తావు!” – ఇలా అంటే మీకు కావలసినట్లే పనులు జరుగుతాయి. కాని కొంత కాలం తరువాత ఇదే ఒక పెద్ద సమస్య అవుతుంది. ఏదైనా మీకు కావలసినట్లు జరగకపోతే అది వాళ్ళ ప్రాణానికే చేటుతెస్తుంది. అప్పుడు మీరు నమ్మేటట్లు వాళ్ళు పరిస్థితిని సృస్టిస్తారు. మీరు భయ పెట్టి పనులు నడుపుతున్నపుడు ఈ పరిస్థితులనే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ సమయంలో గోకులంలో ఉన్న కృష్ణుడు, నాయకుడి కొడుకే అయినా కూడా అతను ఒక సాధారణమైన ఆవుల కాపరిలాగానే పెరిగాడు. జీవితంలోని ఈ దశలో ఆయన చుట్టూ ఎన్నో అద్భుతాలు జరిగాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Sri Krishna@flickr_abhisharma