నవరాత్రి పండుగకు ముందు వచ్చే అమవాస్యను "మహాలయ అమావాస్య" అంటారు. మన నేటి జీవితానికి పలువిధాలుగా దోహదపడ్డ మునుపటి తరాల పట్ల కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితం చేయబడ్డ ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకాలు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు చేసే క్రతువు ఇది. ఇక్కడ చనిపోయిన వారికి ఉత్తర కర్మల వల్ల ప్రయోజనం ఏమిటి అన్నదాని గురించి సద్గురు మాట్లాడుతున్నారు.


ఎవరైనా చనిపోయినప్పుడు, అతని కుటుంబీకులు అతని కోసం కొన్ని మరణాంతర కర్మకాండలు చెయ్యడమన్నది యోగా సంస్కృతిలో ఒక భాగం. కాని దురదృష్టవశాత్తూ, బహుశా గత 100 -150 సంవత్సరాల్లో, ఈ ఆచారాలు చాలా వరకు మరుగునపడి మిగిలిన అవశేషమంతా పాడైపోయి, ఈ తతంగమంతా పూర్తి వాణిజ్యంగా మారింది. కొంత కాలంగా ఈ విషయం నన్ను బాధిస్తోంది. అందుకే, మా ఆశ్రమంలో స్థాపించిన లింగ భైరవి శక్తిని  మూలాధారంగా ఉపయోగించి, మేము మరణించిన వారికై "కాల భైరవ కర్మ", "కాల భైరవ శాంతి" అనబడే కొన్ని నిర్దిష్ట ప్రక్రియలను మొదలుపెట్టాము. మీకు తెలిసిన  వారెవరైనా చనిపోతే, 14 రోజుల లోపల వారు బ్రతికున్నప్పుడు ధరించిన ఒక వస్త్రంలోని ఒక చిన్న గుడ్డ ముక్కను పంపితే, ఒక నిర్దిష్ట కర్మకాండను నిర్వహించవచ్చు.

 లింగ భైరవి శక్తిని  మూలాధారంగా ఉపయోగించి, మేము మరణించిన వారికై "కాల భైరవ కర్మ", "కాల భైరవ శాంతి" అనబడే కొన్ని నిర్దిష్ట ప్రక్రియలను మొదలుపెట్టాము

ఉదాహరణకు ఎవరో, ఎక్కడో చనిపోయారని అనుకుందాం. మీరు వారు చనిపోయారని, అంటే ఇక లేరని అనుకుంటారు, కానీ ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు, అతను కేవలం తన దేహాన్ని, జీవితమని అప్పటి వరకు అతనికి తెలిసినదంతా కోల్పోయాడు, అంతే.  అతను దేహాన్ని పోగొట్టుకున్నప్పుడు, అతను తన విచక్షణా ఙ్ఞానాన్ని కూడా కోల్పోతాడు. కాని అతనికి ఇంకా ఉనికి ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా మద్యం ఎక్కువగా త్రాగినప్పుడు లేక మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు, జరిగేదేమిటంటే వారు వారి విచక్షణను కోల్పోతారు. సంతోషంగా ఉన్న వారు వారి వివేకాన్ని కోల్పోతే, వారు మరింత సంతోషానికి గురవుతారు. కాని అదే విచారంగా ఉంటే, వారు త్రాగినా లేక మత్తు మందులు తీసుకున్నా, వారు మరింత విచారానికి గురవుతారు. మందు లేక మత్తు మందు దానంతటదే ఆహ్లాదాన్ని లేక విచారాన్ని కలుగజెయ్యదు, మీరిది గమనించారా?

ఒకసారి మనసు తన విచక్షణను కోల్పోతో, మీరు కాస్త సంతోషాన్ని సృష్టించినా, అది మరెన్నో రెట్లు అవుతుంది. మీరు కాస్తంత విచారాన్ని సృష్టించినా, అదీ విస్తారమౌతుంది. తాగినప్పుడు ఆనందంగా అయ్యేవారు కొంతమంది ఉన్నారు; తాగినప్పుడు అధిక విచారానికి గురయ్యేవారు కొందరున్నారు. వారి ప్రాధమిక స్థితి ఏదైతే, అదే అతిశయమవుతుంది, ఎందుకంటే మనసు తన విచక్షణను కోల్పోతుంది.

శరీరాన్ని కోల్పోయినప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది –కాని మరింత అధికంగా జరుగుతుంది. విచక్షణ అసలు ఉండనే ఉండదు. తాగుబోతులో కూడా కొంత విచక్షణ ఉంటుంది, పిల్లల్లో కూడా అది ఉంటుంది, కాని చనిపోయిన వారిలో అది పూర్తిగా ఉండదు. చనిపోక ముందు ఏ ప్రవృత్తులైతే ఉన్నాయో, అవే విస్తారమవుతాయి. చనిపోయిన తర్వాత అత్యంత విచారకరమైన స్థితిలోకి పతనం చెందితే, మనం దానిని నరకం అంటాము. చాలా ఆనందకరమైన స్థితిలోకి వెళితే, మనం దాన్ని స్వర్గం అంటాము. నరకం, స్వర్గం అనేవి భౌగోళిక ప్రదేశాలు కావు. వివేకాన్ని కోల్పోయినప్పుడు వ్యక్తులు, ఏదో ఒక విధంగా ఏదో ఒక స్థితికి చేరుకుంటారు.

ఎవరైనా చనిపోతున్నప్పుడు, పఠించడానికి భారతీయ సంస్కృతిలో మీకు ఏదో మంత్రం నేర్పిస్తారు. దాని ఉద్దేశ్యం, మీరు ఈ మంత్రం పఠిస్తూ చనిపోతున్న వారిలో ఒక రకమైన సంతోషాన్ని సృష్టిస్తారనే. ఆ శబ్దాలు చనిపోయిన వారిలో ఒక విధమైన ఆనంద ప్రకంపనలను కలిగిస్తాయి. కనుకనే భారతీయ సంస్కృతిలో ఈ మంత్రాలను సృష్టించారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు, కూర్చుని ఈ మంత్రాలను జపించాలి. వారి చెయ్యి పట్టుకోవడమో, అదో ఇదో చెయ్యడమో కాదు –కేవలం కూర్చుని ఈ మంత్రాలను పఠించాలి.

సాంప్రదాయం ప్రకారం చూస్తే, ఇండియాలో ప్రజలు వారికి ప్రియమైన వారి మధ్యలో చనిపోవాలని ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే మీరు మీ కుటుంబం మధ్య చనిపోతే, ఎన్నో భావోద్వేగాలు ప్రకటితమౌతాయి. పాశ్చాత్య సంస్కృతిలో దీనిపై అవగాహన తేదు. అందువల్ల వారు వారి కుటుంబ ఆదరణలో, సౌకర్యవంతంగా చావాలనుకుంటారు, కాని ఇది తెలివైన పని కాదు. ఆధ్యాత్మికంగా అనుకూలం, సచేతనం ఐన ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం నిజంగా తెలివైన పని. అక్కడ వీలైనంత హుందాగా శరీరాన్ని వదలి వెళ్లవచ్చు. మీరు హుందాగా జీవించి ఉంటే, మీరు హుందాగా మరణించడం అనేది కూడా చాలా ముఖ్యం అవుతుంది.

ఈ దేశంలో ముసలితనంలో, కుటుంబం మధ్య చావకూడదని, ఒంటరిగా చనిపోవడానికి కాశీకి వెళ్తారు. ఎందుకంటే కుటుంబం మధ్య చనిపోతే, మీరు వారి వంక అనురాగంతో చూస్తారు. సులువుగా దేహన్ని విడిచిపోవడం మీకు వీలుకాదు; విచారం కలుగుతుంది. ఆ విచారం పెరిగి పెద్దదై మిమ్మల్ని ఏదో భయంకరమైన దానిలోకి నెడుతుంది. అది ఇతరులకు కూడా మంచిది కాదు. అందుకే మరణం వచ్చినప్పుడు, దూరంగా వెళ్లి, ఒంటరిగా చనిపోతారు. ఇది ఉద్వేగాలను బట్టో లేక ఆలోచనలను బట్టో చేసే పని కాదు; మరణం గురించిన నిర్దిష్ట అవగాహన, జ్ఞానం ఉండటం వల్ల ఇలా చేస్తారు.

ఒక వ్యక్తి ముసలితనం వల్ల మరణించినప్పుడు, అతని తదనంతర అస్థిత్వాన్ని ఆనందభరితం చేసేందుకు, మనకు ఇంకా 11 నుంచీ 14 రోజుల సమయం ఉంటుంది.

ఒక వ్యక్తి ముసలితనం వల్ల మరణించినప్పుడు, అతని తదనంతర అస్థిత్వాన్ని ఆనందభరితం చేసేందుకు, మనకు ఇంకా 11 నుంచీ 14 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి ఆనందం అందిస్తే, మీరు ఒక్క చుక్క ఆనందాన్ని అతనిలో వేసినా, అది కొంత కాలం తరువాత ఒక ఆనంద సాగరం అవుతుంది, ఎందుకంటే అతనికి వివేకం లేదు, అతను ఆ ఆనందాన్ని ఆపలేడు. మీరు నవ్వడం మొదలుపెడితే, కొన్నిసార్లు మీకు నవ్వాగదు, అప్పుడు మీ విచక్షణ "ఇక చాలు” అంటుంది, అపుడు మీరు ఆ నవ్వు ఆపేసి, మీ పనిలో మీరు వెళ్తారు. కాని మరణించినవారు నవ్వడం మొదలుపెడితే, వారు ఆపలేరు; అక్కడ తట్టి చెప్పేందుకు విచక్షణ గల మనసు ఉండదు. అది కేవలం పెరిగి ఉధృతమై, సాధారణంగా స్వర్గం అనబడే ఒక అతిశయమైన ఆనందమవుతుంది.

ముసలి వయసులో చనిపోతే, మనం ఈ ఆనందపు చుక్కను ఆ జీవిలోకి 14 రోజుల వరకు వెయ్యగలుగుతాము. ఒకవేళ ఎవరైనా 40 ఏళ్ళ లోపే చనిపోతే, అంటే మంచి యవ్వనంలో ఉన్నా, శరీరం దెబ్బతిని జీవన క్రియల ఆచరణకు యోగ్యం కాకుండా పోవడం వల్ల చనిపోతే –అప్పుడు 48 రోజుల వరకూ చాలా సులభంగా ఆ జీవిలో ఈ ఆనందపు చుక్కను వెయ్యగలుగుతాము. ఎవరైనా చాలా మంచి ఆరోగ్యంతో, శరీరం మంచి స్పందనతో ఉండి చనిపోతే, మనం 90 రోజుల వరకూ అలా ప్రభావితం చెయ్యగలం. 50 -55 ఏళ్ళ వయసులో ఉండి చురుకైన, ఫలవంతమైన జీవితం జీవిస్తూ ఏదో కారణం వల్ల శరీరం దెబ్బతినడం వల్ల చనిపోతే, అప్పుడు కూడా మనం ఆ జీవిని 48 రోజుల వరకూ ప్రభావితం చెయ్యగలుగుతాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఎడిటర్ నోట్: 16సెప్టెంబర్ 2020న మహాలయ అమావాస్య  వచ్చింది. పూర్వీకుల, మరణించిన బంధువుల శ్రేయస్సు కోసం "కాల బైరవ శాంతి"  ప్రక్రియని ప్రతి సంవత్సరం లింగభైరవి సమక్షంలో పవిత్ర మహాలయ అమావాస్య రాత్రి నిర్వహిస్తారు. మరణించిన బంధువుల కోసం "కాల బైరవ శాంతి"  ప్రక్రియని నిర్వహించుటకు, info@lingabhairavi.orgకి ఈ మెయిల్ చేయండి లేదా 83000 83111 కు కాల్ చేయండి లేదా website సందర్శించండి.