Mahabharat All Episodes

సద్గురు: దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్లి ‘‘నేను భీముని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏదో విధంగా ఎప్పడూ అతను తప్పించుకుంటున్నాడు’’ అని  ఫిర్యాదు చేశాడు. ‘రాజభవనంలోనే దుర్యోధనుడు తన దాయాది సోదరుని చంపే ప్రయత్నం చేస్తున్నాడా’ అనుకుంటూ ధృతరాష్ట్రుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇద్దరూ కేవలం పదహారేళ్ల వయసు వాళ్లే. ఒక రోజు దుర్యోధనుడికి, శకుని సలహా ఇస్తున్నాడు. ఇలా ఫలితం ఉండదు. ‘‘ఈ హత్యా ప్రయత్నం రాజభవనం బయట చేస్తే మంచిది, ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా చేయడానికి అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు చాలా సున్నితంగా చేయాలి, అలా చంపడానికి నీ సోదరుడు చాలా బలవంతుడు‘‘ ఆయన ఇంకా మాట్లాడుతూ ‘‘మాట్లాడటం అనేది ఈ హృదయంలోని భావాన్ని వ్యక్త పరచడం కాగూడదు, మాట్లాడటం అనేది నీ బుర్ర లో ఏముందో దానిని దాయడం కోసం. భీమునితో స్నేహం చేయి, ప్రేమించు, వాడితో తగాదాలకు దిగకు. వాడిని కోపంగా చూడకు, చిరునవ్వుతో మాట్లాడు. వాడొక బుద్ధిహీనుడు, తప్పకుండా నీ బుట్టలో పడతాడు‘‘ అన్నాడు.

అందరిలో తెలివైన సహదేవుడు ఒక్కడే, మోసపోలేదు, అందుకే అతను దూరంగానే ఉంటున్నాడు

ఆ విధంగా దుర్యోధనుడు భయం లేని వాడు, ధైర్యవంతుడు, రెండు నాలుకలు లేని ఆ మనిషి, కపటుడు అయ్యాడు. అతను ఎప్పుడూ ఈర్ష్యా ద్వేషాలతో నిండి ఉండేవాడు. కానీ అతనికి శకుని ఇప్పుడు కపటాన్ని నేర్పాడు. అందువల్ల దుర్యోధనుడు ఆ ఐదుగురి సోదరులతో, ముఖ్యంగా భీముడుతో తన స్నేహం పెంచుకున్నాడు. దుర్యోధనుడు తన మనసు మార్చుకున్నాడు, అందువల్ల తమను ప్రేమిస్తున్నాడు అనుకున్నారు వారు. ఐదుగురిలో తెలివైన సహదేవుడు ఒక్కడే, మోసపోలేదు, అందుకే అతను దూరంగానే ఉంటున్నాడు.

సహదేవునికి ఎంత వివేకం ఎలా వచ్చిందంటే: ఒకరోజు అరణ్యంలో చలి మంట(campfire) ముందు, పిల్లలతో పాండు రాజు ఇలా చెప్పాడు. ఈ 16 ఏళ్ల నుంచీ, నేను మీ తల్లులకు దూరంగా ఉన్నాను. నేను బ్రహ్మచర్య సాధన చేస్తున్నాను. అది నాకు ఎంతో తెలివి, దూరదృష్టిని ఇచ్చాయి. కానీ నేను ఒక గురువును కాదు. దీనిని మీకు ఎలా అందించాలో నాకు తెలియదు. కానీ, ‘‘నేను చనిపోయిన రోజు మీరు నాలోని ఒక మాసం ముక్క తీసుకుని తినండి. అలా మీరు నా మాంసాన్ని మీ మాంసంలో భాగం చేసుకుంటే, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు మళ్ళీ ప్రయత్నం చేయకుండానే మీకు లభిస్తుంది’’ అని చెప్పాడు.

సహదేవుని తెలివి

పాండురాజు మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలు జరుగుతుండగా, అందరి మనస్సూ భావోద్వేగాలతో మునిగిపోయినప్పుడు, ఆ విషయం గురించి అందరూ పూర్తిగా మర్చిపోయారు. సహదేవుడు అందరికంటే చిన్నవాడు, మరింత బాధపడుతున్నాడు. పాండు రాజు మాంసాన్ని ఒక చీమ వచ్చి తీసుకు వెళ్లడం చూసిన సహదేవునికి, అప్పుడు తన తండ్రి ఏమి చెప్పాడో గుర్తుకు వచ్చింది. చీమనుంచి ఆ చిన్న మాంసం ముక్క తీసుకుని మింగి వేశాడు. ఆయన తెలివి, బలం, పెరిగాయి. ఆనాటి కాలంలో ఆయన రాజులలో ఋషి అయ్యేవాడు. కానీ కృష్ణుడు ఆ తెలివి మూలంగా విధి దారితప్పుతుందని చూశాడు. అందుకే సహదేవుడుతో ఒకప్పుడు, ఇది నా ఆజ్ఞ, నీ తెలివిని ఎప్పుడూ చూపించకు, ఎవరైనా నిన్ను ఒక ప్రశ్న అడిగితే, దానికి సమాధానంగా వారికి మరో ప్రశ్న వెయ్యి అని చెప్పాడు.

అప్పటినుంచి, ఎవరైనా ప్రశ్నిస్తే, సహదేవుడి సమాధానం కూడా ప్రశ్నలతోనే ఉండేది. అది అర్థం చేసుకొనే తెలివి, చాలా తక్కువ మందికి ఉంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఎంత తెలివైన వాడో చూసేవారు. అర్థంకాని వాళ్ళు ప్రతిదాని గురించీ ఆయన సందిగ్ధం వ్యక్తం చేస్తున్నాడు అనుకున్నారు. ‘సహదేవ జ్ఞానం’ అని ఒక శాస్త్రమే తయారయింది. ఇప్పటికీ దక్షిణ భారతంలో ఎవరైనా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటే ‘‘ఆయన సహదేవుడు లాగా చేస్తున్నాడు’’ అని అంటుంటారు. ఇది ఎందుకంటే, ఆయన సమాధానంగా ప్రశ్నలు అడగటం వలన, అతను తన తెలివిని ప్రదర్శిస్తున్నాడు, అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆయన కృష్ణుడి ఆజ్ఞ పాలిస్తున్నాడు. అదేమిటంటే తన జ్ఞానాన్ని బయటికి చెప్పకుండా, ఎప్పుడూ ప్రశ్నలకు, ప్రశ్నల ద్వారానే సమాధానం ఇచ్చేవాడు. దాని మూలంగా, దానిలోని గ్రహించేంత తెలివి వారికి ఉంటేగాని, తమకు సమాధానం ఇస్తున్నాడని వారికి అర్థం అయ్యేదికాదు..

ఒక తప్పుడు విష ప్రయోగం 

సహదేవుడు ఒక్కడే దుర్యోధనుని హృదయంలో ఏ ముందో చూడగలిగేవాడు. అది అతనికి పూర్తి విషంగా కనిపించింది. మిగిలిన నలుగురు అతనితో చాలా సన్నిహితమయ్యారు. దుర్యోధనుడు వారికి ఎన్నో బహుమతులిచ్చేవాడు. భీముడికి ఎప్పుడూ ఇష్టమైన బహుమతి, ఆహారమే. దుర్యోధనుడు ఎంత కావాలో అంత తినిపించేవాడు. భీముని ఆకలి ఎటువంటిదంటే, ఎవరైనా ఏదైనా ఆహారం పెట్టగానే, ఆయన మిగతా అన్నీ మర్చిపోయేవాడు. తనకు ఆహారం పెట్టిన వాళ్లే, ఆయన స్నేహితులు. ఆయనకు ఎప్పుడూ ఆకలి, అందుకే ఆయన తిని, తిని పెద్దగా అయిపోయాడు.

ఒకరోజు దుర్యోధనుడు విహారయాత్ర వెళ్దామని అన్నాడు. శకుని జాగ్రత్తగా ప్రణాళిక రచించాడు. నది ఒడ్డున ‘ప్రమానకోటి’ అనేచోట ఒక పెద్ద డేరా వేయించాడు. అందరూ అక్కడికి వెళ్లి బాగా భోజనం చేశారు. దుర్యోధనుడు బాగా ఆతిధ్యం ఇచ్చాడు. ఆయన పాండవులు ప్రతి ఒక్కరి వద్దకూ వచ్చి, స్వహస్తాలతో భోజనం వడ్డించాడు. మిగతా అందరికీ ఎంత వడ్డించాడో, భీముడికి అంత వడ్డించాడు. అందరూ బాగా తిన్నారు, ఈ తెలివి తక్కువ వారు చాలా పొరబడ్డారు. సహదేవుడు ఒక్కడే దూరం నుంచి చూస్తూ కూర్చున్నాడు.

కపటం ఇలానే పనిచేస్తుంది. అది కావలసిన దానికన్నా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది.

ఇక పాయసం సమయం వచ్చేప్పటికి భీముడికి పాత్రనిండా ఇచ్చారు. దానిలో ఒక తరహా విషాన్ని కలిపారు. అది ఎలాంటిదంటే చాలా మెల్లగా దాని ప్రభావం చూపుతుంది. భీముడు మొత్తం అంతా ఖాళీ చేశాడు. ఆ తర్వాత, వాళ్లందరూ నదికి వెళ్లారు. వాళ్లు ఆటలు ఆడుతున్నారు. ఒక సమయంలో భీముడు బయటికి వచ్చి నది ఒడ్డున పడుకున్నాడు. మిగతా వాళ్లందరూ డేరాలోకి వెళ్లి, తమ ఆటలు కొనసాగిస్తున్నారు. కొంత సమయం తరువాత దుర్యోధనుడు నది ఒడ్డుకు వెళ్లి భీముడు బాగా మత్తుగా ఉండడం చూశాడు. ఆయన భీముడి చేతులు, కాళ్లు కట్టివేసి నదిలోకి దొర్లించాడు. భీముడు విషనాగులు ఉండే చోట మునిగిపోయాడు.

పాములు ఆయనను వందల చోట్ల కరిచాయి. కానీ వాటి విషయం భీముడు ఆహారంలో తీసుకున్న విషయానికి విరుగుడుగా పనిచేశాయి. ఈ జ్ఞానాన్ని దక్షిణ భారతంలో సిద్ధ విద్య అంటారు.  ఆ విద్యలో విషానికి, విషంతో చికిత్స చేస్తారు. అంటే ఆధునిక వైద్యశాస్త్రంలో వాక్సిన్ (టీకా మందు) పని చేస్తినట్టుగా. విరుగుడు మందు పనిచేయడం మొదలు పెట్టగానే, ఆయన మెల్లిగా కోలుకున్నాడు. ఎప్పుడైతే తమ విషానికి అతను తట్టుకున్నాడో, ఆ నాగులు అతనిని తమలో ఒకనిగా తీసుకున్నాయి. ఆ నాగరాజు ఈ వాయు పుత్రుడిని, తన పక్కన కూర్చోబెట్టుకుని చూడు నాయనా, నీకు విషం పెట్టారు. అదృష్టవశాత్తు నిన్ను నదిలోకి పొర్లించారు, అలా కాక వారు నిన్ను నది ఒడ్డున ఉంచేసి ఉంటే నీవు ఈ పాటికి చనిపోయి ఉండేవాడివి అని చెప్పాడు. కపటం ఇలానే పనిచేస్తుంది. అది కావలసిన దానికన్నా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. వారు అతన్ని నది ఒడ్డున వదిలేయవలసింది, కానీ వారు ఏ విధమైన అవకాశం తీసుకోదల్చుకోలేదు. అందువల్లనే దుర్యోధనుడు ఆయన్ని  నదిలోకి దొర్లించాడు, దానివల్ల దానికి అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగింది. 

నాగులు ‘‘నీకో రసాయనం ఇస్తాము, ఇక్కడివారికి తప్ప ఇది ఎవరికీ తెలియదు,’’ అంటూ వారు అనేక రకాల విషాలు, పాదరసం, కొన్ని మూలికలు, కలిపి నవపాషాణం అనే ఒక అతిఘోరమైన విషాన్ని తయారు చేశారు. దక్షిణ భారతంలో దీనిని ఇప్పటికీ ఒక మందులా వాడతారు. నవపాషాణం తయారుచేయడం చాలా క్లిష్టమైన క్రియ, దానిని ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఒక రకమైన విషం, ఒక చుక్క ఎక్కువ వేసినా లేక మరొకటి ఒక చుక్క తక్కువ వేసినా, అది మనిషిని చెప్పేస్తుంది. వారు చాలా జాగ్రత్తగా ఆ మందును తయారు చేసి భీముడికి ఇచ్చారు. అది తీసుకున్నాక భీముడు బలం దాదాపు మహాకాయ స్థితికి చేరింది. ఇక ఈ సమయంలో ఇక్కడ భీముడు కనబడక, ఆయన మిగతా నలుగురు సోదరులూ బాధపడ్డారు.

తమను ఎవరో మోసం చేశారని వారు అర్థం చేసుకున్నారు, కానీ వారు బయటకు చెప్పలేకపోయారు. ఎందుకంటే దుర్యోధనుడు  కూడా చాలా బాధపడుతున్నట్లు కనబడుతున్నాడు. ఆయన సోదరుడు భీముడు, ఏమయ్యాడు, అంటూ ఏడుస్తున్నాడు. సహదేవుడు ‘వారు అతనిని చంపేశారు’ అన్నాడు. ఆతిథ్యం, బహుమతుల విషయంలో మునిగి, తమ సహోదరుని వారు కోల్పోయాము అనే బాధతో, ఆ నలుగురు సోదరులు ఎంతో సిగ్గుతో ఇంటికి చేరారు. తల్లి కుంతీదేవికి ఏం జరిగిందో వారు చెప్పారు. కుంతీదేవి బాధతో కూలిపోయింది.

భీముడు పునరాగమనం

ఆమె మూడు రోజులు ధ్యానంలో ఉండి పోయింది. ఆమె నా పుత్రుడు భీముడు చనిపోలేదు, ఆయన కోసం వెతకండి, అనిచెప్పంది. నలుగురు సోదరులు, వారి స్నేహితులు, అడవి అంతా కలియతిరిగారు. నదిలోకి దూకి చూశారు. భీముని కోసం అన్ని చోట్లా వెతికారు, అయినా వారికి అతను కనపడలేదు. చివరికి వారు ఇక వదిలేశారు. కుంతి తన దృష్టినే సందేహించింది. చివరికి వారు భీముని 14 వ రోజు కర్మకాండలకు సిద్ధమయ్యారు. దుర్యోధనుడు భీముని జ్ఞాపకార్ధం చాలా పెద్ద సన్నాహాలు చేశాడు. 14 రోజుల సంతాప దినాలు ముగించిన సందర్భంగా, పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఈ సంస్కృతిలో అది అలాగే జరుగుతుంది. కానీ తన హృదయంలో మాత్రం దుర్యోధనుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. బయటికి మాత్రం సంతాపం చూపిస్తున్నాడు. 

ఈ ఐదుగురు సోదరులు జాగ్రత్తగా, తమ సొంత రక్షణ వ్యవస్థలు తయారు చేసుకుంటూ తమ మనుషులను రాజభవనంలోకి తీసుకు వస్తున్నారు.

భీముడు రాజభవనం తిరిగి వచ్చాడు. అన్నదమ్ములు, అతని తల్లి ఎంతో ఆనందించారు. దుర్యోధనుడు, అతని సోదరులు ఇది నమ్మలేకపోయారు. శకుని అయితే భయపడిపోయాడు, అసలు అతనికి భీముడు బతికే ఉన్నాడా లేక అదేమన్నా అతని దెయ్యమా అని సందేహించాడు. భీముడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు విదురుడు వచ్చి వారికి సలహా ఇచ్చాడు ‘‘ఇది శతృత్వం పెంచుకునే సమయం కాదు. వాళ్ళు ఇంకా చాటుమాటు గానే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీకు ఇంకా ఇది భద్రమైన చోటే. అదే మీరు శతృత్వం చూపిస్తే, వాళ్లు మిమ్మల్ని చంపేస్తారు. మీరు కేవలం ఐదుగురే వారు 100 మంది ఇంకా వారికి సైనికులు కూడా ఉన్నారు’’ అన్నాడు. భీముడు, అతని సోదరులు తమ కోపాన్ని నిగ్రహించుకున్నారు. 14 రోజులు నాగలోకంలో ఉన్నాక అక్కడి రసాయనం ఆయనను బలవంతుడిని చేసింది. అంతేకాదు ఆయనకు ఆకలి కూడా ఎక్కువయింది. అతని 14 వ రోజు కర్మకాండలకు పెద్ద విందు తయారు చేస్తున్నప్పుడు ఈ ‘చనిపోయినవాడు’ తిరిగి రావడంతో విందు ఏర్పాట్టు ఆపివేశారు. అప్పుడు భీముడు అక్కడున్న కోసిన కూరగాయలు మొత్తం ఒక పెద్ద గంగాళంలో వేసి ఒక వంట తయారు చేశాడు. ఆర్య సంస్కృతిలో ఇప్పటికీ, మిగిలిపోయిన కొన్ని కూరగాయలు ఉంటే, అవన్నీ కలిసి ఒక వంటకం తయారు చేస్తారు. అది ఇప్పటికీ దక్షిణ భారతంలో ఎంతో ఇష్టమైన వంటకం. దానిని ‘అవియల్’ అంటారు. అంటే కలగలపు కూర అని అర్థం.

ఇక రెండు బృందాల మధ్య శత్రుత్వం పెరిగింది. ఈ ఐదుగురు సోదరులు జాగ్రత్తగా, తమ సొంత రక్షణ వ్యవస్థలు తయారు చేసుకుంటున్నారు. తమ మనుషులను రాజభవనంలోకి తీసుకు వస్తున్నారు. అప్పటి వరకూ వారికి రాచభవన విషయాలు వారికి తెలియదు. కానీ వారు ఇప్పుడు నిజంగానే ఒక తీవ్ర పోరాటం ప్రారంభించారు.

To be continued

More Mahabharat Stories

Editor's Note: A version of this article was originally published in Isha Forest Flower, March 2016.