బంద్ - హర్తాళ్
ఈరోజుల్లో నాయకుడు కావాలంటే దేశాన్ని ఎలా ఆపాలో తెలియాలి కాని దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలియనవసరంలేదని సద్గురు మన వ్యవస్థ గురించి చెబుతున్నారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో మనం అనేక మంది నాయకులని చూశాం. అయితే, అప్పట్లో ఈ నాయకత్వం ఇప్పటి నాయకత్వం కంటే ఎంతో విభిన్నమైనది. ప్రజలు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన కాలం అది. అప్పట్లో కనీ వినీ ఎరుగని రీతిలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన మహాత్మా గాంధీనే ఉదాహరణగా తీసుకోండి. ఓ దేశాన్ని నిలువరించగల సత్తా ఆయనలోనే కనిపించింది. అప్పట్లో జరిగిన సత్యాగ్రహ లక్ష్యమంతా ఓ దేశాన్ని ఎలా ఆపడమన్నదే. ఆయన దేశాన్ని నిలువరించడం ద్వారా బ్రిటిష్వారిని మోకరిల్లేటట్టు చేశారు. ఈ బంద్లు, రాస్తా రోకోలు, రైల్ రోకోలు అప్పటి నుంచీ వస్తూనే –ఉన్నాయి. అయితే, మనం ఇప్పటికీ ఆ అలవాటు నుంచి బయటపడలేక పోతున్నాం.
ఈ దేశంలో మీరు నాయకుడు కాదలచుకుంటే, ఓ 25 మందిని కూడగట్టుకుని రేపు ఓ రోడ్డు మీద బైఠాయించండి. అలా రోడ్డు మీద కూర్చుని, దేన్నీ అటూ ఇటూ వెళ్లనివ్వవద్దు. ఓ రెండు రోజుల పాటు ప్రజల్ని నానా అవస్థలూ పెట్టండి. మూడో రోజయ్యే సరికి మీరో గొప్ప నాయకుడైపోతారు. ఈ మాత్రం చేస్తే సరిపోతుంది. రోడ్డు మీద బైఠాయించి, రాకపోకల్ని స్తంభింపజేయడం ద్వారా చాలా మంది రాత్రికి రాత్రి నాయకులై పోవడాన్ని నేనే అనేక సందర్భాల్లో స్వయంగా, కళ్లారా చూశాను. వాళ్ళు చేసిందల్లా కొన్ని చెట్లను నరికి రోడ్డు మీద పడేయడమే.
విదేశీ శక్తులు వెళ్ళిపోయిన తరువాత మీరు దేశాన్ని ముందుకు వెళ్లేలా చేయాలి. సత్యాగ్రహమంటే దేశాన్ని నిలువరించేలా చేయడం. ఇప్పుడు దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలా అన్నది ఆలోచించాలి. అయితే, ఈ దేశానికి పట్టిన దుర్గతి ఏమిటంటే, సత్యాగ్రహం అన్నది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఆందోళనకారులే నాయకులవుతున్నారు. ఈ ఆందోళనకారులే పాలకులు అవుతున్నారు. తాము చేయాల్సిందేమిటో వాళ్లకు అర్థం కావడం లేదు. దేశాన్ని ముందుకు నడిపించడం ఒక రకమైన నైపుణ్యం, దేశాన్ని ముందుకు పోకుండా ఆపడం మరో రకమైన నైపుణ్యం. చాలామంది నాయకులకి తాము పాలించాల్సిన ప్రజల పట్ల ఏమాత్రం చింతలేదు.