ఆదియోగి శివుడు యోగ విజ్ఞాన శాస్త్రాన్ని సప్తరుషులకు ఒకలా, పార్వతీ దేవికి ఒకలా ఇంకా గణాలకు మరో విధంగా ప్రసరణ చేసారు. ఈ కథ ద్వారా సద్గురు జ్ఞానాన్ని పొందడానికి మనకొక దారిని చూపుతున్నారు.

Sadhguruమౌలికంగా యోగాని ప్రసరింపచేయడానికి మూడు విధానాలున్నాయి. నేను మీకో కథ చెపుతాను...ఆదియోగి యోగాని, దాని పూర్తి అంశాలని ఎంతో విస్తృతంగా సప్త ఋషులకు వివరిస్తున్నారు. దీనికి ఎన్నో దశాబ్దాలు పట్టిందని చెప్తారు. బహుశా, ఇన్ని అంశాలను గ్రహించడానికి ఇది వాళ్ళ అనుభూతిలో ఎన్నో వేల సంవత్సరాలుగా అనిపించి వుండవచ్చు. ఈ కథ అలానే చెపుతోంది, “ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు అధ్యయనం చేయవలసి వచ్చింది” అని. ఇది నిజానికి అంత సమయం అయి ఉండకపోవచ్చు. అది అలాంటి అనుభూతి అయి వుండవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ కాళ్ళు మడుచుకుని, నాలుగు గంటలపాటు కదలకుండా కూచోమంటే, మీకది నాలుగు వేల సంవత్సరాలుగా అనిపిస్తుంది కదా..?

అంటే ఆయన ఎన్నో సంవత్సరాలపాటు ఈ మానవ యాంత్రికతని, ఒక విధంగా చూస్తే - ఈ సృష్టి యాంత్రికతను వారికి వివరించారు. ఎందుకంటే, మానవ దేహం, లేదా మానవ వ్యవస్థ అనేది; ఈ సృష్టికి ఒక చిన్న ప్రతిరూపమే. ఈ రోజున ఆధునిక శాస్త్రంలో ఎన్నో సిద్ధాంతాలు ఏమి చెప్తున్నాయంటే - ఒక అణువు ఎలా రూపొందించబడిందో, ఈ ప్రపంచం అంతా కూడా అదే విధంగా రూపొందించబడింది అని. అంటే, ఒక బ్యాక్టీరియా ఎలా చేయబడిందో మీరూ అదే విధంగా చేయబడ్డారు. కాకపోతే, మీరు మరింత అధునాతనంగా, మరింత సంక్లిష్టంగా ఉన్నారు.

నాకు కూడా ఇది అంతా తెలుసుకోవాలని వుంది అని అడిగింది. ఆయన ఆవిడని చూసి నవ్వి, “రా, వచ్చి నా వొళ్ళో కూచో” అన్నారు.

ఆదియోగి ఇవన్నీ సప్త ఋషులకు వివరిస్తూ వెళ్లారు. ఆయన భార్య అయిన పార్వతీ దేవి అక్కడ జరుగుతున్నదాని తీవ్రత, అది ఎంత పరిమాణంతో జరుగుతోందో, దానిని గమనించి; నాకు కూడా ఇది అంతా తెలుసుకోవాలని వుంది అని అడిగింది. ఆయన ఆవిడని చూసి నవ్వి, “రా, వచ్చి నా వొళ్ళో కూచో” అన్నారు. ఆవిడ – “లేదు, నాకు ఇది కాదు కావలసింది...” అంది. “ఈ ఏడుగురు ఏమి తెలుసుకుంటున్నారో, నేను కూడా అది తెలుసుకోవాలనుకుంటున్నాను” అని ఆవిడ అంది.  ఆయన – “రా ఇక్కడకొచ్చికూర్చో” –అన్నారు. కొంచెం సంకోచిస్తూనే ఆవిడ వెళ్ళి కూర్చుంది.  ఆయన ఆవిడని దగ్గరకి లాక్కుని, మరింతగా దగ్గరికి లాక్కొని; కాసేపటి తరువాత ఆవిడని ఆయనలో సగభాగం చేసేసుకున్నారు. మీరు, ఎవరినైనా మీలో ఇముడ్చుకోవాలనుకోండి, మీలో ఒక భాగాన్ని మీరు పడేసుకోవాలి కదా..?  అందుకే “ప్రేమలో పడడం” అంటారు. అంటే మీలో ఏదో పడిపోవాలి.

ఈయన తనలో ఒక సగ భాగాన్ని పడిపోయేలాగా చేసుకొని, ఆ మిగతా సగభాగంలో ఆవిడని చేర్చేసుకున్నారు. ఇది చూసి గణాలు, “మేము, ఈ సప్త ఋషులు తెలివైనవారు కాబట్టి, మాకు తెలియనిదేదో వారికి తెలుస్తోందని అనుకున్నాము. కానీ, ఈవిడక్కూడా అది లభించింది. మరి మా సంగతేమిటి...?” అన్నారు. ఆయన దానికి, “ ఆ సరే రండి. నాతో పాటు గ్రోలండి, మనమందరం తాగుదాం”  అన్నారు.

అంటే, మౌలికంగా యోగ విధానాన్ని ప్రసారం చేయడానికి మూడు విధానాలున్నాయి. ఒకటి, పరిపూర్ణమైన శాస్త్రంగా – ఈ విధంగా ఆయన సప్త ఋషులకు ప్రసారం చేశారు. రెండవది – మనం వారిని ఇముడ్చుకోవడం ద్వారా. దీనికి కొంత సాన్నిహిత్యం కావాలి. మళ్ళీ సాన్నిహిత్యం అనేది  ఎంతో దురుపయోగం చేయబడుతున్న పదం. నేను సాన్నిహిత్యం అనగానే మీరు శృంగారం అనుకుంటారు. ఈ శరీరం మీలోని పైపొర మాత్రమే. కేవలం ఒక రసాయనిక, విషపూరిత తత్వం వల్లే, రెండు శరీరాలు ఒకటి అవ్వగలుగుతాయి. ఇది సాన్నిహిత్యం కాదు. సాన్నిహిత్యం అంటే ఇంకా ఎంతో జరగాలి. రెండు మౌలికమైన జీవ శక్తులు ఒక్కటిగా కలిసిపోవాలి.  దాన్ని సాన్నిహిత్యం అంటారు. ఆ గణాలకి ఆయన – “సరే, రండి, వచ్చి నాతోపాటు గ్రోలండి” అని చెప్పారు.  అంటే ఒకరికి దీనిని పూర్తి శాస్త్రం లాగా బోధించారు. మరొకరికి లయం చేసుకోడం ద్వారా, ఒక్కటవడం ద్వారా – ఒక రకమైన సాన్నిహిత్యం ద్వారా తెలిపారు. మిగతావారికి “మీరు ఇవన్నీ పట్టించుకోకండి – కేవలం నాతో వుండండి, చాలు”  అని చెప్పారు. నేను కూడా మీకు అదే చెప్తున్నాను.

ప్రేమాశిస్సులతో,
సద్గురు