జీవితంలో మంచివి, చెడ్డవి అని రెండు లేవు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు తన సేనను దుర్యోధనునికి ఇస్తాడు. ఈ సన్నివేశాన్ని వివరిస్తూ, సద్గురు జీవితంలో పూర్తిగా చెడ్డది లేక పూర్తిగా స్వచ్ఛమైనది ఉండవని వివరించారు. 'శ్రీకృష్ణుడు ధర్మసంస్థాపనకే అవతరించినట్లైతే దుర్యోధనునికి (అధర్మవర్తనుడికి) తన సేనను ఎందుకు ఇస్తాడు?' అన్న ప్రశ్నకు సమాధానంగా ఏమి చెప్తున్నారో చూడండి....

కురుక్షేత్ర యుద్ధం ఎటువంటి పరిస్థితిని కల్పించిందంటే  ఏ  ఒక్కరు (ఏ రాజ్యాధిపతి) తటస్థంగా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక పక్షం వహించవలసిన స్థితి అది. యాదవ వీరులు, కృష్ణుడు కూడా కౌరవ పాండవులిద్దరిలో ఏదో ఒక పక్షానికి చేరవలసిన సందర్భం ఏర్పడింది. కృష్ణడు ఈ యుద్ధాన్ని సమర్ధించలేదు. తటస్థంగా'నే ఉండాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. అతడికి హస్తినాపుర సామ్రాజ్యం పట్ల ద్వేషం లేదు. దుర్యోధనుని అతడు సమర్ధించలేదు. భీష్ముడు, ద్రోణాచార్యుడు  కృపాచార్యుని వంటి వీరులెందరో కౌరవుల పక్షాన ఉన్నారు. కృష్ణుడు వారెవ్వరికీ శత్రువు కాడు, అంతేకాక వారందరికీ కృష్ణునియందు అమితమైన భక్తి గౌరవాలున్నాయి. కృష్ణునికి దుర్యోధనుడు, పాండవులు రక్త సంబంధీకులైన బంధువులు. ఒక బంధువు వచ్చి సహాయాన్ని అర్ధించినప్పుడు కాదని తిరస్కరించటం క్షత్రియధర్మం అంగీకరించదు.

కృష్ణుడు క్షాత్రధర్మాన్ని, వేదధర్మాన్ని దగ్గర చేసి ఒక్కటిగా చేయాలని ప్రయత్నం చేశాడు.  

వీరులైన క్షత్రియులు క్షాత్రధర్మాన్ని, తత్త్వవేత్తలైన  (బ్రాహ్మణులు) వారు బ్రహ్మతేజాన్ని (వేదధర్మాన్ని) పాటించాలి. కృష్ణుడు క్షాత్రధర్మాన్ని, వేదధర్మాన్ని దగ్గర చేసి ఒక్కటిగా చేయాలని ప్రయత్నం చేశాడు. ఇందుకు అవసరమైన నియమావళిని ఏర్పరచి సంఘాన్ని క్షేమంగా ఉంచాలనుకున్నాడు.

బ్రాహ్మణుడు ఒక రోజులో కొన్ని గంటలు స్థిరంగా ఒకచోట కూర్చుని వేద పఠనం చేయాలని పెద్దలు (వేదాలు) నిర్ణయించారు. ఇదే ధర్మాన్ని క్షత్రియుని అనుసరించమని నిర్దేశించటం ఉచితం కాదు. అతడు ఆ విధంగా చేయలేడు కూడా. ఒకవేళ క్షత్రియుడు బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తే అతడొక మంచి పరిపాలకుడు గాని, గొప్ప వీరుడుకాని కాలేడు. సంఘంలో అన్ని వర్ణాల వారికి ఎవరి ధర్మాలు వారికి ఉండేవి. అందువలననే వేర్వేరు జాతులవారికి వేర్వేరు వృత్తులు, వారికి తగిన ధర్మాలు నిర్దేశించారు. అయితే కొంతకాలానికి, క్షత్రియులు వారికి ఏది ఇష్టమో అదే వారి ధర్మంగా భావించటం మొదలు పెట్టారు. ఆ భావన వలన ఇతరుల ధర్మాలను, వ్యక్తులను లక్ష్యపెట్టడం మానేశారు. ఈ రకమైన ప్రవర్తన వలన సమాజంలో సామరస్యం భంగపడింది. అటువంటి సమయంలో కృష్ణుడు, వ్యాసమహర్షి సమాజంలో క్షాత్రతేజం, బ్రహ్మతేజాలను ఒకదానికి ఒకటి ఆలంబనగా చేసి అందరికీ మేలు చేయాలని సంకల్పించారు.

పాండవులు కృష్ణునే సంపూర్ణంగా నమ్ముకున్నారు. 'మా జీవితమైనా, మరణమైనా నీతోనే, నీవు లేకుండా మేము ఏమీ చేయలేము' అని కృష్ణునితో ఎప్పుడో చెప్పారు. 

క్షాత్రధర్మాన్ని అనుసరించి ఒక క్షత్రియుని వద్దకు ఒక బంధువుగాని లేక మరెవరుగాని  వచ్చి సహాయంకోరితే 'లేదు' అని చెప్పకూడదు. అర్జున దుర్యోధనులిద్దరూ కృష్ణుని సహాయం కోరి వచ్చారు. కృష్ణుడు వారిద్దరికీ ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చాడు. కృష్ణుడు ఒక్కడు  ఒకవైపు, అశేషమైన యాదవ సైన్యం ఒకవైపు. ఈ రెంటిలో ఎవరికి ఏది కావాలో ఎన్నుకోమన్నాడు. అధిక సంఖ్యాబలం కల యాదవ సైన్యాన్ని ఎన్నుకోవటమే మేలైనది అనుకున్నాడు దుర్యోధనుడు. కాని మొదటగా ఎన్నుకునే అవకాశం అతడికి కృష్ణుడు ఇవ్వలేదు, దాని వలన అతడు విచలితుడై పోయాడు. పాండవులు కృష్ణునే సంపూర్ణంగా నమ్ముకున్నారు. 'మా జీవితమైనా, మరణమైనా నీతోనే, నీవు లేకుండా మేము ఏమీ చేయలేము' అని కృష్ణునితో ఎప్పుడో చెప్పారు. ఆ మాటే వారి జీవితాలలో గొప్ప ఫలితాలను  అందించింది. ఇప్పుడు మీరొక ప్రశ్న వేయవచ్చు.

'కృష్ణుడు ధర్మం పక్షాన నిలచేవాడైతే అధర్మపరులకు సైన్య సహాయం ఎందుకు అందించాడు'?

కృష్ణుడు న్యాయాధికారి కాడు. నీతి, అవినీతులను విచారించి తప్పు, ఒప్పుల గురించి తీర్పునిచ్చేందుకు (న్యాయానికి, ధర్మానికి మధ్య అతి సన్నని రేఖ ఉంది. ధర్మం శాశ్వతమైనది, స్థిరమైనది. నీతి, న్యాయం అనేవి పరిస్థితులపైన, సాక్ష్యాలపైన ఆధారపడి నిర్ణయించబడేవి) అతడు పాండవులు సంపూర్ణమైన స్వచ్ఛమైన నడవడి గలవారనిగాని, కౌరవులు పరమ దుర్మార్గులని కాని ఎన్నడూ భావించలేదు. కృష్ణుడు మావన జీవితాన్ని దర్శించిన విధానం ఇదే. (ప్రతివారిలో మంచి చెడు రెండు ఉంటాయి. పరిస్థితులను వారి మనస్థితిని అనుసరించి  ఒకటి బైటపడుతుంది) అతడు కౌరవ పాండవులతో ఒకేవిధంగా బంధుత్వాన్ని  నిర్వహించాడు. దుర్యోధనుని భార్య భానుమతి కృష్ణుని భక్తురాలు. అతడు కౌరవులను కేవలం  దుష్టులుగానే చూడలేదు, కానీ వారి కారణంగా ఆ సమయంలో సంభవిస్తున్న దుర్మార్గాలను మాత్రం అంతం చెయ్యాలని ప్రయత్నించాడు. అంతేతప్ప అతడికి వారిపట్ల ఎటువంటి కోపంగాని, శత్రుత్వం గాని ఉన్నాయని భావించకూడదు. కౌరవులను దుర్మార్గులుగా కృష్ణుడు తీర్పునివ్వలేదు. మానవులందరు మంచి చెడుల కలయిక అనే అతడు గ్రహించాడు.

ఈ విధంగానే ధర్మాన్ని మనలో నిలుపుకునే ప్రయత్నం కొనసాగించాలి. ఇలా కాకపోతే మీరు అధర్మవర్తనులు కాగలరు. ఏ మనిషైనా తన జీవితంలో ఏ సందర్భంలోనైనా అధర్మ పరుడయ్యేందుకు సమర్థుడే. ఒక మనిషి ఎప్పటికీ అధర్మమార్గం ఎన్నుకోడని నిశ్చయంగా చెప్పేందుకు వీలుకాదు. కనుకనే మీరెల్లవేళలా జాగ్రత్త వహించాలి, ఎప్పుడూ ధర్మమార్గాన్ని అనుసరించేందుకు  ప్రయత్నం చేస్తూ ఉండాలి, లేదంటే, ఎప్పుడో అతి సులభంగా అధర్మ మార్గంలోనికి జారిపోతారు. మీరు ఏ విధంగాను, ఏ కారణంగాను అధర్మం వైపు లొంగిపోని స్థిర చిత్తుల స్థాయికి చేరుకున్న వారైతే తప్ప ఇది ప్రతివ్యక్తికీ అనుభవమే.

కృష్ణుడు అనేక విధాలుగా దుర్యోధనుని ధర్మమార్గం వైపు ప్రోత్సహించాడు, అతడు సైన్యానికి, తనకు మధ్య ఎన్నుకునే అవకాశం కల్పించిన సందర్భంలో కూడా యుద్ధాన్ని నివారించాలనే ప్రయత్నం చేసాడు. సైన్యాన్ని దుర్యోధనునికి పంచటం ఒక విధంగా తెలివైన పని. సైన్యాన్ని పొంది, ఆనందించిన దుర్యోధనుడు, అక్షౌహిణి సైన్యాన్ని తనవెంట పంపుతున్న కృష్ణునికి తనంటేనే ఇష్టమని, అతడు తన పక్షమే వహించాడని పొంగిపోయాడు పైగా పాండవులు మూర్ఖులు, ఒక్క మనిషిని, ఆయుధం పట్టి యుద్ధం చేయనన్న వానిని కోరుకున్నడని కూడా తలపోసాడు. ఈ సందర్భంలో దుర్యోధనునికి అధర్మమార్గాన్ని శాశ్వతంగా మూసివేయగల అవకాశం కృష్ణుడు కల్పించాడు. కాని, అలా జరగలేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: Abee5