నవరాత్రి ఉత్సవాలను ఈశా యోగా కేంద్రంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ తొమ్మిది రాత్రులలో దేవీ ఉత్సవాలు జరుగుతాయి, ఇది భారతదేశంలో ఘనంగా జరుపుకునే ఉత్సవ సమయం. నవరాత్రిలోని మొదటి రోజున ఈ సృష్టిలో దేవి యొక్క పాత్ర ఏమిటి, మనం దుర్గ లేక కాళి అనే శక్తి రూపాలు ఏమిటి అనేవి సద్గురు మనకు వివరిస్తారు.


ఈ ప్రపంచంలోని అన్ని గుణాలను యోగాలో మూడు గుణాలుగా గుర్తించబడ్డాయి: తామస, రాజస మరియు సత్వ గుణాలు. తామస అనే పదానికి జడత్వం అని అర్ధం. రజో గుణం అంటే ఏదైనా చర్యలో పాల్గొనటం. సత్వ గుణం అంటే హద్దులను పటాపంచలు చేయటం. నవరాత్రిలోని మొదటి మూడు రోజులు తమో గుణాన్ని సూచిస్తుంది, దుర్గ మరియు కాళి లాంటి రౌద్రమైన దేవతల రోజులు ఇవి. భూమిది తమో గుణం, ఆమె జన్మనిస్తుంది. గర్భావస్థలో మనం గర్భంలో ఉన్న సమయం తమో గుణం కలిగినది. ఇది నిద్రాణస్థితిలాంటిది కాని మనం పెరుగుతున్నాము. కనుక తమో గుణం ఈ భూమి స్వభావం, అలాగే మీ పుట్టుక స్వభావం కూడా. మీరు భూమి మీదే కూర్చుని ఉన్నారు.

మీరు ఎలాగైనా ఆమెలోని భాగమే. ఆమెకు నచ్చినప్పుడు మిమల్ని బయటకు విసురుతుంది, ఆమె కోరుకునప్పుడు మిమల్ని వెనక్కి లాక్కుంటుంది.

ఆమెతో లీనమై ఉండటం నేర్చుకోండి. మీరు ఎలాగైనా ఆమెలోని భాగమే. ఆమెకు నచ్చినప్పుడు మిమల్ని బయటకు విసురుతుంది, ఆమె కోరుకునప్పుడు మిమల్ని వెనక్కి లాక్కుంటుంది. మీ శరీర స్వభావం గురించి మీకు తరచూ గుర్తుచేయటం ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు మీరు కదులుతున్న ఒక మట్టి కుప్ప వంటివారే. భూమి మిమల్ని లోపలికి లాక్కోవాలని నిర్ణయించుకునప్పుడు మీరు ఒక చిన్న మట్టి కుప్పగా అవుతారంతే. 

ఆశ్రమంలో ఉన్నవారికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు ఎలాంటి పని చేసే వారైనా సరే మీరు ప్రతీ రోజు కనీసం ఒక్క గంట సేపు అయినా మట్టిలో మీ వేళ్ళను ఉంచండి అని. మీ తోటలో ఏదైనా చేయండి. మీరు అమరులు కారనేది మీ శరీరంలో సహజ జ్ఞాపకంగా స్థిరపడుతుంది. మీ శరీరం శాశ్వతం కాదని శరీరానికి ఒక అవగాహన వస్తుంది . ఆధ్యాత్మిక అన్వేషణకు మీ శరీరంలో ఈ అవగాహన ఎంతో ముఖ్యమైనది. ఈ అవగాహన ఎంత త్వరగా వస్తే అంతగా ఆధ్యాత్మిక భావం బలంగా తయారవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు