భారతీయ దేవాలయాలు ప్రార్ధన కోసం ఏర్పరచబడిన ప్రదేశాలు కావు. ఎప్పుడూ ఎవరూ అక్కడ ప్రార్ధన చేయించరు. ఈ సంప్రదాయంలో మీకు ఎప్పుడూ చెప్పదేమిటంటే మీరు ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ మీరు కొంచం సేపు కూర్చోవాలి. ఎందుకంటే ఈ దేవాలయాలు శక్తి కేంద్రాలు. ఇవి పబ్లిక్ ఛార్జింగ్ ప్రదేశాల లాంటివి. ప్రతీ రోజూ ఉదయాన్నే, స్నానం చేసి, దేవాలయానికి వెళ్లి కూర్చుని ఆ శక్తిని పొంది మిమల్ని మీరు శక్తివంతులను చేసుకోవాలని, ఆ తరువాతే ఈ ప్రపంచంలోకి సరైన ప్రకంపనలతో వెళ్ళాలని చెప్పేవారు.

లింగాన్ని సృష్టించే శాస్త్రాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో ఉంది. కానీ గత 800 – 900 సంవత్సరాలుగా భక్తి ఉద్యమం దేశమంతా వ్యాపించిన తరువాత ఈ శాస్త్రము కనుమరుగై పోయింది. ఒక భక్తునికి అతని భావోగ్వేదము తప్ప మరేదీ ముఖ్యం కాదు. అతని భావోగ్వేదమే అతని మార్గము. ఒక భక్తుడు అతను కోరుకున్నది చేయవచ్చు. ఎందుకంటే అది అతని భావోగ్వేదము యొక్క బలము. అందువల్ల వారు శాస్త్రాన్ని పక్కన పెట్టి, వారికి నచ్చిన విధంగా దేవాలయాలను కట్టడం మొదలు పెట్టారు. అందువల్ల లింగాలను తయారుచేసే శాస్త్రం మరుగున పడిపోయింది. సాధారణంగా, శాస్త్రీయ ఆధారం కలిగిన లింగాలు ముక్తిని ఒక శాస్త్రీయ ప్రక్రియగా పరిగణించిన సిద్ధులు, యోగులచే సృషించబడినవే. అవి నిరంతర ప్రకంపనలు. సాధారణంగా అవి  ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట గుణాలతో మంత్రాలను ఉపయోగించి ప్రతిష్టించబడ్డాయి.

దక్షిణ భారతదేశంలో పంచ భూతాల కోసమై అయిదు లింగాలు ఉన్నాయి. మీ భౌతిక శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచ భూతాలతో నిర్మించబడినదే. మీరు అనుభవించే ప్రతీదానిపై వాటికి గట్టి పట్టు ఉంటుంది. వీటిని దాటి పోవటానికి యోగాలో ఉన్న మౌలికమైన సాధనే భూతశుద్ధి.

ప్రతీ ధాతువుకి,  దాని నుండి విముక్తులవడానికి మీరు చేయగలిగే ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దీని కోసమే పంచ భూత స్థలాలను సృష్టించారు. మీరు వెళ్లి సాధన చేసుకోవడానికి మహోన్నత దేవాలయాలు నిర్మించారు. భౌగోళికంగా అవన్నీ డెక్కన్ ప్రాంతంలోనే – నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. నీటికి సంబంధించిన దేవాలయం తిరువనైకావల్‌లో, అగ్నికి సంబంధించిన దేవాలయం తిరువన్నామలైలో, వాయువుకి సంబంధించిన దేవాలయం కాళహస్తిలో, భూమికి సంబంధించిన దేవాలయం కాంచిపురంలో, ఆకాశానికి సంబంధించిన దేవాలయం చిదంబరంలో ఉన్నాయి.

మనం అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే ఈ అయిదు లింగాలు సాధన కోసం సృష్టించబడినవి, ప్రార్ధన కోసం కాదు. జనాలు ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఈ పంచ భూతాల సాధన కోసం వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, ఈ సంబంధం ఈనాడు లేదు. ఎందుకంటే ఈ సాధనకు కావలిసిన వాతావరణం తొలిగించేయబడింది. దీనికి కావలిసిన అవగాహనా, నైపుణ్యం సాధారణంగా కనుమరుగై పోయాయి, కానీ దేవాలయాలు ఇంకా ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ గుణాన్నీ, శక్తినీ నిలబెట్టుకున్నాయి, మిగతా ఆలయాలు బలహీనమైపోయాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు